సీతాపరిత్యాగం పై శ్రీమతి ముళ్లపూడి శ్రీదేవి గారి స్పందన
శ్రీ రాముడు ఆదర్శ మూర్తి. కేవలం భారతీయులకే కాదు,ప్రపంచ వ్యాప్తంగా ఆయనే అనేక మందికి అనేక విధాల ఆదర్శం .
ఏక పత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, సత్యవాక్పాలన, ప్రజాపరిపాలన,ధర్మస్థాపన-అన్ని విషయాలలోనూ శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. రామో విగ్రహవాన్ ధర్మ:--ఒకటే మాట ఒకటే బాణం,ఒకే భార్య.
ఈ కలి యుగంలో కూడా ఇప్పటి దాకా దాదాపుగా ఈ పద్ధతే కొన సాగుతోంది. ఒకే భార్య విషయంలో. వేరే సంప్రదాయాలను అనుసరించేవారు కూడా అవసరాలను బట్టి గాని,వీలును బట్టి గాని ఈ పద్ధతిని అనుసరించక తప్పటం లేదు.
రాముడు రాజు. ఆరోజుల్లో రాజ్యాధికారం వంశ పారంపర్యం. దశరథుడు అయోధ్య రాజు. ఆయన తర్వాత రాముడు అయోధ్య రాజు. అతని తర్వాత అతని కొడుకులు కుశలవులు రాజులు. వారి తర్వాత వారి పిల్లలు.
అలాగే ఒక స్త్రీకి ఒకే భర్త.ఒక పురుషుడికి ఒకే భార్య. ఈ నియమం త్రేతా యుగంలో రాముడి దగ్గరనుంచి ఇప్పటిదాకా ఇలాగే అనుసరించబడుతోంది. ఈ నియమానికి విరుద్ధంగా కూడా ఈ రోజుల్లో జరుగుతూ ఉండ వచ్చు. అప్పుడు అది అక్రమ సంబంధమనీ , వివాహేతర సంబంధమనీ ప్రత్యేకంగా వేలెత్తి చూప బడుతోంది.
సరే-రాముడి పెళ్ళికి అతని వయస్సు పదహారేళ్ళు. సీతతో కూడా అయోధ్యలో రాజుగారి పెద్ద కొడుకుగా పదమూడేళ్ళు తండ్రి చాటు బిడ్డగా సుఖ భోగాలు అనుభవించాడు.
రాముడు వన వాసంలో పద్నాలుగేళ్ళు గడిపాడు.తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు అతని వయస్సు 16+13+14 =
43. అప్పుడు పట్టాభిషేకం చేసుకుని అయోధ్యకు రాజు అయ్యాడు.
పద కొండు వేల ఏళ్ళు రాజ్యం చేశాడు. సుమారుగా ఆ చివరి కాలంలోనే సీతాదేవి గర్భవతి అయింది. ఆ రోజుల్లోనే సీతను గురించి, రాముడిని గురించి అయోధ్యలో అపవాదు రాముడికి తెలిసింది. రాముడు చాలా చింతించాడు. సీత పరమ పవిత్రురాలు అని తనకు తెలిసినా అపనిందకు వెరచి సీతను పరిత్యజించాడు.
అయోధ్య రాముడి పట్టమహిషి సీతాదేవి అడవిలో వాల్మీకి ఆశ్రమంలో కుశ లవులను కన్నది. ఆ పిల్లలకు పది పన్నెండేళ్ళ వయసులో అయోధ్యకు వచ్చి రాముడికి పిల్లలను అప్పగించి తను భూమిలోకి వెళ్ళిపోయింది. రాముడు ఏకపత్నీ వ్రతుడు. సీతాదేవి ఆయన భార్య. అయోధ్యకు రాజు అయ్యాక కోసల రాజ్యలక్ష్మి రాముడికి రెండవ భార్య అయింది. అప్పుడింక రాముడి ఏక పత్నీ వ్రతానికి భంగం కలిగింది.తండ్రి అప్పగించిన రాజ్య లక్ష్మిని వదలటం కుదరదు కాబట్టి, చిన్నప్పుడే పెళ్లి చేసుకుని పదకొండు వేలఏళ్ళు కాపురం చేసిన సహధర్మచారిణి సీతాదేవిని పరిత్యజించాడు. ఇప్పుడు రాజ్యలక్ష్మి మాత్రమే ఆయనకు భార్య. ఆయన ఏక పత్నీ వ్రతం నిలబడింది.
శ్రీరాముడి ఆదర్శాలనే ఆయన తమ్ముళ్ళూ అనుసరించారు. అనుసరించాలి కూడా. ఎందుకంటే రాముడు ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుసరిస్తాడు కాబట్టి. రామ+అయనం- రామాయణం -రాముడి మార్గం-అనికదా. యథారాజా తథాప్రజా కాబట్టి ప్రజలు కూడా రాముడి మార్గాన్నే అనుసరించాలి. లేకపోతే రామరాజ్యం-రాముడి ఆదర్శం అనే మాటలకు అర్థమే లేకుండా పోతుంది.
సామాన్య ప్రజలకు ఏక పత్నీ వ్రతం పెద్ద కష్టం కాక పోవచ్చు. కాస్త వివేకం, విచక్షణ ఉంటే చాలు. కాని రాజులు -రాజ్యాలు ఏలవలసిన రాజులు -ఏకపత్నీ వ్రతులు అవటం కష్టం.(నేను చెప్పేది తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు సీతా పరిత్యాగానికి చెప్పిన కారణం ప్రకారం )ఎందుకంటే ఆ రోజుల్లో రాజ్యాధికారం వారసత్వం కాబట్టి - రాజు కొడుకు రాజు కాగానే రాజ్యలక్ష్మి ఆయన భార్య అయి కూర్చుంటుంది. పెళ్లి చేసుకుంటే వ్రత భంగం అవుతుంది. పెళ్లి చేసుకోక పోతే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే రాజు తర్వాత రాజ్య మేలేందుకు రాజు ఏడి? రాజు పెళ్లి చేసుకోనందువల్ల రాజు వంశం వారసులు లేకుండా అయిపోతుంది. తగిన పాలకుడు లేకపోతే ఆ రాజ్యం ఏమవుతుంది? ఆ సింహాసనం కోసం జనం కొట్టుకు చస్తారు. బలమున్న వాడిదే, డబ్బున్న వాడిదే రాజ్యం అవుతుంది(ఈ రోజుల్లోలాగానే). ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే -రాజు -రాముడి లాగానే- రాజ్యలక్ష్మిని భార్యగా భావించి ఏక పత్నీ వ్రతం భంగం కాకుండా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం వలన.
తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రిగారు గొప్ప పండితులు,కవులు. వారి రామాయణం నేను చూడలేదు. వారికి ఈ సీతాపరిత్యాగం విషయంలో ఈ ఆలోచన రాకుండా ఉండి ఉండదు. వారు చమత్కారంగా ఈ స్వారస్యం చెప్పి ఉంటారు.
ధర్మ మూర్తి రాముడు నిర్దోషి అయిన సీతాదేవిని పరిత్యజించటం న్యాయమా-అన్యాయమా అనే విషయం త్రేతాయుగం నుంచి ఈ కలి యుగం వరకూ ఇంకా చర్చించబడటం చాలా దురదృష్టకరమైన విషయం.
రాముడు సీతను వదిలి పెట్టడం -ఏకపత్నీవ్రతం భంగం అవుతుందని కాదు- అని నా ఉద్దేశం. నాకు తోచింది ఇప్పుడు నేను రాస్తున్నాను గాని ఈ సమాధానం పెద్ద పెద్ద పండితులందరూ నిర్ణయం చేసిన విషయమే.
రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత పదకొండు వేల ఏళ్ళు రాజ్యం చేశాడు. రావణాసురుడి చెరలో సీతాదేవి పదినెలలు ఉన్న విషయం అయోధ్యలో ఇన్ని వేల ఏళ్ల నుంచి ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదా- లేదా -అయోధ్యలో అందరూ చెప్పుకుంటున్నా ఆ విషయం రాముడిదాకా ఎప్పుడూ రాలేదా-ఇన్ని వేల ఏళ్ల తర్వాత ఇప్పుడే రాముడి చెవిన పడిందా- ఈ అపవాదు కు రాముడు ఎలా స్పందించాలి?
రాముడు ఏకపత్నీ వ్రతం-రాజ్య లక్ష్మి -రెండో భార్య- వ్రత భంగం -ఇలా ఆలోచించలేదు. తన రాజ్యంలో ప్రజలు తన మార్గాన్నే అనుసరిస్తారు. తనది ధర్మ మార్గమైతే ప్రజలూ ధర్మమార్గాన్నే -తన మార్గాన్నే అనుసరిస్తారు.-తను చేసింది తప్పు అయితే ప్రజలూ ఆ తప్పు చేయడానికి వెనుకాడరు. ఎందుకు తప్పు చేస్తున్నారు అని అడిగే హక్కు తనకు లేదు -.ప్రజలు అధర్మ మార్గాన నడిస్తే ఆ తప్పుకి రాజుదే బాధ్యత.
ఇప్పుడు సీతాదేవిని గురించిన అపవాదు రాజ్యమంతా వ్యాపిస్తుంది. అంతటితో ఆగదు. సీతాదేవిని రాముడు భార్యగా అంగీకరిస్తే- దశరథ మహారాజు వరకూ నిష్కళంకమైనదిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించిన సూర్య వంశం రాముడివల్ల కళంకితం అవుతుంది. లోకులందరూ రాముడి వైపు వేలెత్తి చూపుతారు. అది రాముడికి మరణ సదృశమే అవుతుంది.
ఆ అపఖ్యాతికి భయపడే రాముడు సీతాదేవిని పరిత్యజించాడు.అదే రాముడి కర్తవ్యం. అదే అందరికీ గౌరవం,గర్వం కూడా.
______ముళ్ళపూడి శ్రీదేవి.