27, జులై 2021, మంగళవారం

4. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా


చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4 ॥

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా

అమ్మవారు తన పరిమళ భరితమైన కబరీభరముతో ఆ చిదగ్ని కుండము నుంచి 

నెమ్మది నెమ్మదిగా బయటకు ప్రకటితమవుతోంది. 

సాధారణంగా, దేవుని పాదాలకు నమస్కరించి మొదలు పెట్టాలనే భావనతో, 

ఎవరైనా దేవతావర్ణన చేసేటప్పుడు పాదముల నుంచీ ప్రారంభించి వర్ణిస్తారు. 

కానీ ఇక్కడ శ్రీలలిత కుండంలో నుంచి పైకి ఆవిర్భవిస్తోంది. 

అందువలన అమ్మవారిని ఆపాదమస్తకం కాకుండా, శిరసు నుంచి పాదాల దాకా వర్ణిస్తుస్తాం. 

అమ్మ ఎలా ఎలా బైటకు వస్తే, అలా అలా అమ్మని వర్ణిస్తూ కీర్తిస్తున్నాం. 

ముందుగా దర్శనమిచ్చినవి అమ్మవారి కురులు. 

కనుక ఇక్కడ తొలుతగా అమ్మవారి కేశపాశాల గురించి చెప్తూ, 

చంపకం, అశోకం, పున్నాగ వంటి పరిమళభరితమైన పుష్పాల సువాసన 

అమ్మవారి కేశరాశికి వున్నదట. 

అమ్మ కేశాలకు పరిమళం చంపకం, అశోకం, పున్నాగ వంటి పుష్పాల వలన రాలేదు.  

ఆ పుష్పాలకే ఆ పరిమళం అమ్మ కురుల మీద ఉండటం వలన అబ్బినాయి.

పుష్పాలకే పరిమళాన్ని అందించే కబరీభరం అమ్మది. 

నిజమే కదా, ఈ అఖిల చరాచర జగత్తులో అన్నీ అమ్మ ఇస్తేనే వచ్చాయి.

అమ్మ జగజ్జనని కదా, పుష్పాలకు, వాటి పరిమళాలకు కూడా. 

చంపకం, అశోకం, పున్నాగల వంటి పరిమళ భరితములైన పుష్పాలకే 

సుగంధాన్ని అందించే వేణీభరం, కబరీభరం, కచభరం కలిగివున్న, 

ఆ  చంపకాశోకపున్నాగసౌగన్ధికలసత్కచ కు వందనం.    

ఓం శ్రీ చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః 


14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా

ఈ నామంలో అమ్మవారి కిరీటాన్ని వర్ణిస్తున్నారు. 

ఆ బంగరు కిరీటంలో కురువింద మణులు పొందికకా, పొంకంగా, వరుసగా పేర్చబడ్డాయి. 

కురువిందమణులు భూమిలో ఏర్పడే రాళ్లు. 

ఆ రాళ్లను సాన పడితే అవి కెంపులయ్యి ధగధగలాడతాయి.

అలా ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న మణులతో పొదిగిన కిరీటాన్ని అమ్మ ధరించి వుంది. 

దానికి సాటి వచ్చే కిరీటమే మరొకటి లేదు. 

అన్ని కిరీటాలూ అమ్మవారి కిరీటం ముందు పరాజితులే. అందరూ అమ్మకు సామంతులే. 

ఒకసారి అమ్మవారు బహు రమ్యంగా సభ తీర్చి వున్నది. 

ఆ సభలో బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన దేవతలంతా అమ్మవారిని కీర్తిస్తూ వున్నారు. 

అమ్మ విలాసంగా తన తలను ఊపుతూ అందరినీ వింటున్నది. 

అప్పుడు మహేశ్వరుడు వస్తున్నాడని పరివారం సమాచారం అందించారు. 

అమ్మ హఠాత్తుగా లేచి నిలబడింది. అది చూసి సభాసదులంతా లేచారు. 

అమ్మ తన భర్తను ఆహ్వానించటానికి పరుగున కదలి ద్వారం వైపు వెళ్తున్నది. 

అమ్మ పాదాలు చూసిన దేవతలందరూ వంగి పాదాలకు నమస్కరించటం మొదలుపెట్టారు. 

సాధారణంగా ఎవరూ ఎవరికీ సకిరీట నమస్కారం చెయ్యరు. 

కానీ, ఇక్కడ వేగంగా కదులుతున్న అమ్మవారిని చూసి ఎక్కడ అమ్మవారి పాదాలు 

మళ్ళీ దొరకవో అని అందరు దేవతలూ తక్షణమే వంగి సకిరీట నమస్కారాలు చేస్తున్నారు. 

పరిచారకులు, అమ్మా, ఇదిగో ఇంద్రుని కిరీటం, ఇదిగో, బ్రహ్మ కిరీటం, మణులు పొదిగి వున్నాయి,

మీ పాదాల వద్ద వున్నాయి, కొద్దిగా జాగ్రత్త తల్లీ అని చెప్తూ 

ఆమెకి ద్వారం వైపుకు దారి చూపిస్తున్నారు. 

అమ్మవారికి కామేశ్వరుని ఆహ్వానించడం పైనే ధ్యాస. 

భర్తకు పాద నమస్కారం చేసి, సగౌరంగా సభలోకి తీసుకు వచ్చి, 

తన పక్కనే ఎంతో మర్యాదతో సింహాసనంపై కూర్చుండబెట్టింది. 

ఈ ముచ్చట సౌందర్యలహరిలో ఆదిశంకరుడు ప్రస్తావించాడు. 

అమ్మవారి కిరీటం ముందు అన్ని కిరీటాలూ ప్రణమిల్లవలసిందే. 

మాణిక్యమకుటం ధరించిన, ఆ కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండిత కు వందనం. 

ఓం శ్రీ కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


5 కామెంట్‌లు: