7, నవంబర్ 2021, ఆదివారం

107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా

 

ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ 
ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥

519. ముద్గౌదనాసక్తచిత్తా

ముద్గలంటే పెసలు. ముద్గౌదనం అంటే పెసరపప్పు కలిపి వండిన పొంగలి అన్నం. 

మూలాధారంలో వున్న దేవతకు ఈ పొంగలి అంటే ఆసక్తి హెచ్చు. 

చిత్తమంతా పెసరపప్పుతో కలిపి వండిన పొంగలి మీద కల ఈ దేవతకు, ఈ ముద్గౌదనం  

నైవేద్యంగా పెడితే, చాలా తృప్తి చెందుతుంది. 

పెసరపప్పుతో చేసిన పొంగలి అంటే ఆసక్తి చూపిస్తున్న, ఆ ముద్గౌదనాసక్తచిత్త కు వందనం. 

ఓం శ్రీ ముద్గౌదనాసక్తచిత్తాయై నమః  


520. సాకిన్యంబాస్వరూపిణీ 

మూలాధారాంబుజారూఢ అయిన ఈ దేవతకే సాకిన్యంబాస్వరూపిణి అని పేరు. 

ఈ సాకినీ అనే దేవత మూలాధార చక్ర పద్మంలో ఉంటుంది. 

అయిదు ముఖములు కలిగి పంచ భూతాలలో, పంచ తన్మాత్రలతో ప్రకాశిస్తూ ఉంటుంది. 

అంకుశము వంటి ఆయుధాలను కలిగి వున్నది. ధూమ్రవర్ణంలో ఉంటుంది.

జీవులలో ఎముకల రూపంలో ఉంటూ వారి భౌతికదేహ పుష్టికీ, స్వరూపానికి కారణమవుతోంది.

వ నుంచి స వరకూ కల నాలుగు హల్లు అక్షరశక్తి దేవతలచే సేవింపబడుతూ వున్నది. 

ముద్గౌదనం అంటే మక్కువ ఎక్కువ. ఈ లక్షణములన్నీ కల సాకినీ అనే దేవత

మూలాధారచక్రపద్మమును అధిష్టించి వున్నది. 

మూలాధార చక్రాధిష్టానదేవత అయిన, ఆ సాకిన్యంబాస్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ సాకిన్యంబాస్వరూపిణ్యై నమః  


521. ఆజ్ఞాచక్రాబ్జనిలయా

ఆజ్ఞాచక్రాబ్జనిలయా అంటే, ఆజ్ఞేయ చక్ర పద్మములో ఉండునది అని అర్ధం. 

రాబోయే నామాలలో ఆజ్ఞాచక్రములో వున్న శ్రీదేవి విశేషణముల గురించి చెప్పుకుందాం. 

భ్రూమధ్యములో ఆజ్ఞాచక్రమున్నది. ఈ ఆజ్ఞాచక్రమునకు అధిపతి ఈశ్వరుడు. 

ఆ చక్రములో వున్న పద్మముపై కొలువున్న దేవి ఆజ్ఞాచక్రాబ్జనిలయా. 

 చక్ర పద్మమునకు రెండే దళములు. ఆ పద్మము కర్ణిక పై కొలువున్నదే ఆజ్ఞాచక్రాబ్జనిలయా. 

ఆజ్ఞాచక్రానిది తపోలోకం, జీవాత్మ స్థానం, ఊదా లేదా లేత నీలి రంగు, మనస్సు ప్రధానము. 

భృకుటి వద్ద ఆజ్ఞాచక్రములో వున్న, ఆ ఆజ్ఞాచక్రాబ్జ నిలయ కు వందనం. 

ఓం శ్రీ ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః  


522. శుక్లవర్ణా 

శుక్లవర్ణా అంటే తెల్లని వజ్రము వంటి కాంతితో ప్రకాశించు దేహచ్ఛాయ కలది అని అర్ధం. 

ఆజ్ఞాచక్రములో కొలువై వున్న దేవత తెల్లగా ఉంటుంది. స్వచ్ఛతకు చిహ్నం. 

ధవళ కాంతులీనుతూ వుండే, ఆ శుక్లవర్ణ కు వందనం. 

ఓం శ్రీ శుక్లవర్ణాయై నమః 

  

523.  షడాననా

షడాననా అంటే షట్---ఆరు, ఆననా---ముఖములు కలదానా అని అర్ధం. 

ఆరు ముఖములు కల మహేశ్వరియే ఆజ్ఞాచక్రాబ్జనిలయ. 

ఈ ఆరు ముఖములూ షణ్ముఖునికి ప్రతీక. కుమారస్వామి యొక్క శక్తి జనకము ఈ దేవత. 

ఈ ఆరు ముఖములూ ఆరు ఋతువులకు సంకేతం . 

ఆరు ముఖములతో, శక్తితో తేజరిల్లుతున్న, ఆ  షడానన కు వందనం. 

ఓం శ్రీ  షడాననాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

6, నవంబర్ 2021, శనివారం

106. మూలాధారాంబుజారూఢా, పంచవక్త్రా, అస్థిసంస్థితా అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా

 

మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, స్థిసంస్థితా 
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥

514. మూలాధారాంబుజారూఢా

మూలాధారాంబుజారూఢా అంటే, మూలాధార పద్మములో ఉండునది అని అర్ధం. 

రాబోయే ఆరు నామాలలో, మూలాధారములో వున్న ఆ భగవతి విశేషణముల గురించి 

తెలుసుకుందాం. గుదస్థానము వద్ద మూలాధార చక్రమున్నది. 

ఈ చక్రమే ఆది చక్రము, ఆధారచక్రము. అధిపతి గణపతి. అందుకే గణపతి ఆది పూజ్యుడు. 

ఆ చక్రములో వున్న పద్మముపై వున్న దేవతయే మూలాధారాంబుజారూఢా. 

 చక్రపద్మమునకు నాలుగు దళములు. ఆ పద్మకర్ణికపై వున్నదే మూలాధారాంబుజారూఢా. 

మూలాధార చక్రానిది భూలోకం, పృధ్వీతత్వము, ఎరుపు రంగు, గంధ ప్రధానము. 

గుదస్థానము వద్ద, మూలాధారచక్రములో వున్న, ఆ మూలాధారాంబుజారూఢ కు వందనం. 
 

ఓం శ్రీ మూలాధారాంబుజారూఢాయై నమః  


515. పంచవక్త్రా

వక్త్రము అంటే ముఖము. ఈ దేవత అయిదు ముఖములు కలిగివుంటుంది. 

మూలాధారాంబుజారూఢ ధూమ్రవర్ణములో ఉంటుంది. 

అయిదు ముఖములు అయిదు తన్మాత్రలైన, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు ప్రతీకలు. 

సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలకు కూడా ఈ అయిదు ముఖాలూ 

ప్రతీకలు. పంచభూతాలు ఆ పంచ వక్త్రాలుగా చెప్పబడ్డాయి.  

అయిదు ముఖములచే మనోజ్ఞంగా వున్న,  ఆ పంచవక్త్ర కు వందనం.  

ఓం శ్రీ పంచవక్త్రాయై నమః  


516. అస్థిసంస్థితా

డాకినీ చర్మములోనూ, రాకినీ రక్తములోనూ, లాకినీ మాంసములోనూ, 

కాకినీ మేదస్సులోనూ ఉంటే, ఈ మూలాధార స్థిత ముకలలో వున్నది.  

ప్రతిజీవికీ ఎముకలలో ఉంటూ, రూపాన్నీ, ఎముక పుష్టినీ కలుగచేస్తున్న దేవత. 

ఎముకలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే, ఈ నామం జపిస్తే, స్వస్థత లభిస్తుంది. 

అస్థులలో ఉంటూ, జీవుని భౌతిక దేహానికి దృఢత్వాన్ని ఇస్తున్న, ఆ అస్థిసంస్థిత కు వందనం. 

ఓం శ్రీ అస్థిసంస్థితాయై నమః  


517. అంకుశాదిప్రహరణా 

మూలాధారాంబుజారూఢ కు అంకుశము ఆయుధము. దానిని చేత ధరించి ఉంటుంది. 

నాలుగు చేతుల లోనూ అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర ఉంటాయి. 

అంకుశమును ధరించి వున్న, ఆ అంకుశాదిప్రహరణ కు వందనం. 

ఓం శ్రీ అంకుశాదిప్రహరణాయై నమః 

  

518. వరదాది నిషేవితా 

వరద మొదలైన నాలుగు శక్తులచే సేవింపబడు తల్లి అని ఈ నామానికి అర్ధం. 

మూలాధార చక్రానికి నాలుగు దళములు. ఆ నాలుగు దళములలోనూ నాలుగు దేవతా శక్తులు 

వుండి, ఆ మూలాధారాంబుజారూఢను కొలుస్తూ వుంటారు. 

ఆ దేవతలే మాతృకా వర్ణమాలలోని వ, శ, ష, స అనే హల్లు అక్షరములు. 

వారే వరుసగా, వరద, శ్రీ, షండ, సరస్వతి అని పిలువబడే దేవతా శక్తులు. 

వ, శ, ష, స అనే హల్లు అక్షర దేవతా శక్తులచే సేవింపబడే, ఆ వరదాది నిషేవిత కు వందనం. 

ఓం శ్రీ వరదాది నిషేవితాయై  నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

5, నవంబర్ 2021, శుక్రవారం

105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ

 

మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా 
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥

509. మేదోనిష్ఠా

మేదోనిష్టా అంటే, మేదస్సు అను ధాతువులో ఉండునది. 

ఈ మేదస్సు, మెదడులో కొవ్వు రూపములో ఉంటుంది. దీనినే మేధస్సు అని కూడా అంటాం. 

ఈ మేదస్సు లోనే ప్రజ్ఞ ఉంటుంది. జీవుల మస్తిష్కపు కొవ్వులో వుండు దేవత మేదోనిష్టా. 

శ్రీలలిత ప్రతి జీవి మెదడులో వుండే మేదస్సనే తెల్లని మాంస రూపములో ఉంటుంది. 

జీవుల మెదడులో వుండి, వారి ఎదుగుదలకు కారణమైన, ఆ మేదోనిష్ఠ కు వందనం. 

ఓం శ్రీ మేదోనిష్ఠాయై నమః  


510. మధుప్రీతా 

మధుప్రీతా అంటే మధువు నందు ఆసక్తి కలది అని అర్ధం. మధువు అంటే మద్యము, తేనె. 

వేదములో, 'మధువుతో హోమము  చేస్తే, ఆ పరమేశ్వరి ఎంతో సంతోషిస్తుంది' అని చెప్పారు. 

అందుకే సమయాచారాన్ని పాటించే భక్తులు అభిషేకములలో వాడే పంచామృతములలో 

తేనె కూడా ముఖ్యం. తేనెతో అభిషేకము చేస్తే ఈ దేవత ప్రీతి చెందుతుంది అని ఈ నామార్ధం. 

వామాచారాన్ని పాటించే వామాచారులు నేటికీ, మద్యముతో హోమాలు, అభిషేకాలు చేస్తూనే 

వున్నారు. వామాచారము లోని మత్స్య, మద్య, మాంస, ముద్రా, మైథునము లైన పంచమకారము  

లలో మద్యము కూడా ఒకటి. మద్యమును ప్రీతితో సేవిస్తుంది కనుక, ఆ తల్లి మధుప్రీతా. 

మధువుతో తనను సేవిస్తున్న వారిని చూసి సంతోషిస్తున్న, ఆ మధుప్రీత కు వందనం.  

ఓం శ్రీ మధుప్రీతాయై నమః  


511. బందిన్యాదిసమన్వితా

స్వాధిష్టానాంబుజగత, బందిని మొదలగు ఆరు శక్తులచే సమన్వితమైనది అని భావం. 

స్వాధిష్ఠాన చక్ర పద్మానికి ఆరు దళములు అని చెప్పుకున్నాం కదా. 

ఈ బందిన్యాది ఆరు శక్తులూ ఒక్కక్క శక్తి, ఒక్కొక్క దళములో వుంటాయి. 

ఈ శక్తులు పద్మ కర్ణికలో కూర్చుని వున్న, ఆ స్వాధిష్టానాంబుజగతను పరివేష్టించి ఉంటాయి. 

ఆ ఆరు దేవతా శక్తులు, బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠితా. 

ఇవి మాతృకావర్ణమాలలో వున్న బ నుంచి ల వరకూ వున్న హల్లు అక్షరములను సూచిస్తాయి. 

ఆరు హల్లు అక్షరదేవతా శక్తులచే పరివేష్టింపబడిన, ఆ బందిన్యాదిసమన్విత కు వందనం. 

ఓం శ్రీ బందిన్యాదిసమన్వితాయై నమః  


512. దధ్యన్నాసక్తహృదయా

స్వాధిష్ఠానములో వున్న దేవతకి దధి అన్నమంటే ఇష్టం. దధ్యన్నమంటే పెరుగన్నం. 

పెరుగు కలిపిన అన్నము పట్ల ఆసక్తి కలది కనుక, ఆ తల్లి దధ్యన్నాసక్తహృదయా. 

ఆ తల్లి మనసంతా ఈ దధ్యన్నం మీదనే ఉంటుందని ఈ నామం చెపుతోంది. 

పెరుగన్నం అంటే మనసు పడే, ఆ దధ్యన్నాసక్తహృదయ కు వందనం. 

ఓం శ్రీ దధ్యన్నాసక్తహృదయాయై నమః 

  

513. కాకినీరూపధారిణీ 

కాకినీ రూపధారిణీ అన్నది ఆ  స్వాధిష్టానాంబుజగత పేరు. 

కాకినీ దేవత స్వాధిష్ఠాన చక్ర పద్మములో ఉంటుంది. నాలుగు ముఖములు కలిగి, 

నాలుగు తన్మాత్రల లోనూ ఉంటుంది. శూలము వంటి ఆయుధాలను కలిగి వున్నది. 

పచ్చని పసిమి వర్ణంలో ఉంటూ, సౌందర్యాతిశయము వలన అతిగర్వముతో, సంతోషముగా 

ఉంటుంది. జీవులందరి మెదడులో కల కొవ్వులో ఉంటూ వారి ప్రజ్ఞకు కారణమవుతోంది. 

బందిని నుంచి లంబోష్ఠితా వరకూ కల ఆరు హల్లు అక్షర శక్తి దేవతలచే సేవింపబడుతూ 

వున్నది. తేనె, మద్యమంటే బహు ప్రీతి. పెరుగన్నం అంటే మనసు పడుతుంది. 

ఈ లక్షణములన్నీ కల కాకినీ అనే దేవత స్వాధిష్ఠాన చక్రములో ప్రసన్నంగా కూర్చుని వున్నది. 

స్వాధిష్ఠాన చక్రాధిదేవత అయిన, ఆ కాకినీరూపధారిణి కి వందనం. 

ఓం శ్రీ కాకినీరూపధారిణ్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

4, నవంబర్ 2021, గురువారం

104. స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా, అతిగర్వితా

  

స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా 
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా, అతిగర్వితా ॥ 104 ॥

504. స్వాధిష్టానాంబుజగతా


స్వాధిష్టానాంబుజగతా అంటే, స్వాధిష్టాన పద్మములో ఉండునది అని అర్ధం. 

ఈ రెండు శ్లోకాలలో స్వాధిష్టానములో వున్న ఆ మాహేశ్వరి విశేషణముల గురించి చెప్పుకుందాం. 

జననేంద్రియము దగ్గర స్వాధిష్టాన చక్రమున్నది. ఈ స్వాధిష్టాన చక్రమునకు అధిపతి బ్రహ్మ. 

ఆ చక్రములో వున్న పద్మముపై వున్న దేవియే స్వాధిష్టానాంబుజగతా. 

 చక్ర పద్మమునకు ఆరు దళములు. ఆ పద్మము కర్ణిక పై కొలువున్నదే స్వాధిష్టానాంబుజగతా

స్వాధిష్టాన చక్రానిది భువర్లోకం, జల తత్వము, సిందూరపు రంగు, రస ప్రధానము. 

ఈ దేవి ఎప్పుడూ పరాధీన కాదు, స్వాధిష్ఠాన. స్వతంత్ర. తన స్థలములో తానే వుండు దేవి.  

ఎప్పుడూ పరాధీన కాక, స్వాధీనగా వుండే, ఆ స్వాధిష్టానాంబుజగత కు వందనం. 

ఓం శ్రీ స్వాధిష్టానాంబుజగతాయై నమః  


505. చతుర్వక్త్రమనోహరా 

నాలుగు ముఖములతో మనోహరముగా వుండే దేవత ఈ స్వాధిష్టానాంబుజగతా. 

నాలుగు ముఖములూ శబ్ద, స్పర్శ, రూప, రస తన్మాత్రలకు ప్రతీకలు. 

జలతత్వములో, అగ్నితత్వము, వాయుతత్వమూ, ఆకాశతత్వమూ కూడా ఉంటాయి కదా.  

నాలుగు ముఖములతో మనోజ్ఞముగా వున్న, ఆ చతుర్వక్త్రమనోహర కు వందనం.  

ఓం శ్రీ చతుర్వక్త్రమనోహరాయై నమః  


506. శూలాద్యాయుధసంపన్నా

స్వాధిష్టానాంబుజగత శూలము వంటి ఆయుధ సంపత్తి కలిగి ప్రకాశిస్తూ వున్నది.  

ఆ తల్లి తన మూడు చేతులలో శూలము, పాశము, కపాలము ధరించి వున్నది.  

నాలుగవ చేతితో భక్తులకు అభయ ముద్రను చూపిస్తున్నది. 

శూలము వంటి గొప్ప ఆయుధ సంపత్తిని కలిగివున్న, ఆ శూలాద్యాయుధసంపన్న కు వందనం. 

ఓం శ్రీ శూలాద్యాయుధసంపన్నాయై నమః  


507. పీతవర్ణా

స్వాధిష్టానాంబుజగత శరీరచాయ పీతవర్ణం, బంగారము వంటి మేనిచాయ కలది ఈ దేవత.   

బంగారు పసిమి రంగులో, పచ్చగా ప్రకాశిస్తున్న దేవత ఈ పరమేశ్వరి. 

ఈ పసిమి వర్ణం శుభప్రదం. మంగళకరం. అమ్మవారు స్వాధిష్ఠానమనే పద్మంలో కూర్చుని, 

పచ్చని పసిమి వర్ణంలో శుభప్రదంగా, అభయహస్తంతో దీవిస్తున్నది. 

పసుపు ఆరోగ్యకరం, ఆయుర్వర్ధకం. అమ్మ మేని చాయ పచ్చని పసిమి. 

పచ్చని పసిమి చాయలో మెరిసిపోతున్న, ఆ పీతవర్ణ కు వందనం. 

ఓం శ్రీ పీతవర్ణాయై నమః 

  

508. అతిగర్వితా

స్వాధిష్టానాంబుజగత మహా సౌందర్యవతి, ఆ సౌందర్యాతిశయము వలన కలిగిన 

గర్వముచే, అతిగర్వితయై వున్నది అని ఈ నామం చెప్తోంది. 

సకల సంపదలకూ సృష్టి కర్త, అధినేత్రి, అందుకే అతిగర్వితా. 

అన్నీ పొంది సంతృప్తితో వున్నది కనుక, అతిగర్వితయై వున్నది. 

స్వాభిమానము కల, మహా సౌందర్యవతి యైన, ఆ అతిగర్విత కు వందనం. 

ఓం శ్రీ అతిగర్వితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

3, నవంబర్ 2021, బుధవారం

103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ

 

రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా 

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥

499. రక్తవర్ణా

రక్త వర్ణములో అంటే రక్తము వలె ఎర్రగా వుండు శరీరచాయ కలిగినది అని అర్ధం. 

మణిపూర చక్ర పద్మములో వుండే దేవత ఎర్రగా రక్తవర్ణములో వున్నది అని ఈ నామార్ధం. 

రక్త దోషములు వున్నా, రక్తము తక్కువైనా, పలుచగా వున్నా, ఈ నామాన్ని జపిస్తే ఆ దోషము 

పోయి తిరిగి మంచి రక్తము వస్తుంది. స్వస్థత కలుగుతుంది. 

ఎర్రని ఎరుపు రంగులో వుండే, ఆ రక్తవర్ణ కు వందనం. 

ఓం శ్రీ రక్తవర్ణాయై నమః  


500. మాంసనిష్ఠా

ఈ దేవత మాంస ధాతువులో ఉంటుంది. మాంసము నందు అభిమానము కలది అని అర్ధం. 

జీవులందరి శరీరాలలో కల మాంసము నందు స్థిరముగా వుండు దేవత. 

మనందరిలో మాంసములో ఉంటూ, మనకు కండపుష్టిని కలిగించే దేవత మణిపూరాబ్జనిలయ. 

లలితాదేవి మన చర్మములో వుంది, రక్తములో వుంది, మాంసములో వుంది. 

మనలో ఉంటూ మనలను కాపాడుతున్నది ఆ లలితాపరమేశ్వరి.   

శరీరములో మాంసము తక్కువగా వుండి, డొక్కలు ఎండిపోయి వున్నట్లైతే, 

ఈ నామం జపిస్తే, మేలు జరుగుతుంది. కండ పడుతుంది. 

మాంస రూపములో ప్రతిజీవిలో ఉంటూ పుష్టినిస్తున్న, ఆ మాంసనిష్ఠ కు వందనం.  

ఓం శ్రీ మాంసనిష్ఠాయై నమః  


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

అయిదవ వంద నామాల వివరణ


501. గుడాన్నప్రీతమానసా

ఈ నామంలో అమ్మకు గుడాన్నం అంటే ఇష్టం అని చెప్తున్నారు. గుడము అంటే బెల్లము. 

బెల్లముతో వండిన అన్నమంటే ఈ దేవతకు ఎంతో ప్రీతి. 

బెల్లము, బియ్యము, నెయ్యి వేసి బెల్లపన్నం వండి అమ్మవారికి నివేదిస్తే, అమ్మ సంతోషిస్తుంది. 

ఈ ప్రసాదము తిన్నవారికి పుష్టి కలిగి కండ పడుతుంది. 

బెల్లంతో వండిన అన్నాన్ని ఇష్టంగా స్వీకరించే, ఆ గుడాన్నప్రీతమానస కు వందనం. 

ఓం శ్రీ గుడాన్నప్రీతమానసాయై నమః  


502. సమస్తభక్తసుఖదా

భక్తులందరికీ సుఖములు ఇచ్చేది అని అర్ధం. లేదా భక్తులకు అన్ని సుఖములూ ఇచ్చేది 

అని కూడా భావించవచ్చు. 'సు' 'ఖ' అంటే మంచి ఆకాశం అని కూడా అర్ధం, ఖ అంటే ఆకాశం 

కదా. ఆకాశమును కాలుష్యము తొలగించి నిర్మలముగా చేసి ఇచ్చునది అని కూడా అర్ధం. 

తనను నమ్మి కొలిచే భక్తులకు సకల సుఖములూ కలిగించే దయా స్వరూపిణి. 

భక్తులందరి సుఖమూ ఇష్టముగా చూచుకుంటున్న, ఆ సమస్తభక్తసుఖద కు వందనం. 

ఓం శ్రీ సమస్తభక్తసుఖదాయై నమః 

  

503. లాకిన్యంబాస్వరూపిణీ 

లాకినీ అనే పేరు కల తల్లి అని ఈ నామానికి అర్ధం. పై రెండు శ్లోకాలలో చెప్పుకున్న 

అన్ని లక్షణములూ కలిగిన దేవి ఈ లాకిన్యంబాస్వరూపిణీ. 

ఈ లాకిన్యంబాస్వరూపిణియే మణిపూర చక్ర పద్మములో వున్న దేవత. 

మణిపూర చక్రాధిష్ఠాన దేవత. ఈ తల్లి మూడు ముఖములు కలిగి, వజ్రము వంటి 

ఆయుధములను ధరించి, డామరి నుంచి ఫట్కారిణి వరకు కల పది దేవతాశక్తులచే 

సేవింపబడుతూ వున్నది. ఎర్రని రక్త వర్ణముతో ప్రకాశిస్తూ, మాంసధాతువు నందు ఉంటూ, 

భక్తులందరికీ సుఖమును కలిగించే కరుణామయి. గుడాన్నమంటే ఇష్టము కలిగి వున్నది. 

మాంస ధాతువులో ఉంటూ జీవులకు పరిపుష్టి నిచ్చే, ఆ లాకిన్యంబాస్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ లాకిన్యంబాస్వరూపిణ్యై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

2, నవంబర్ 2021, మంగళవారం

102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా వజ్రాదికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా

  

మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా 
వజ్రాదికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥

495. మణిపూరాబ్జ నిలయా

మణిపూరాబ్జనిలయా అంటే, మణిపూర పద్మములో ఉండునది అని అర్ధం. 

ఈ రెండు శ్లోకాలలో మణిపూరములో వున్న భగవతి విశేషణముల గురించి చెప్పుకుందాం. 

నాభి వద్ద మణిపూర చక్రమున్నది. ఈ మణిపూర చక్రము నకు అధిపతి విష్ణువు. 

ఆ చక్రములో వున్న పద్మముపై వున్న దేవి మణిపూరాబ్జనిలయా. 

 చక్ర పద్మమునకు పది దళములు. ఆ పద్మము కర్ణిక పై కొలువున్నదే మణిపూరాబ్జనిలయ. 

మణిపూర చక్రానిది సువర్లోకం, అగ్ని తత్వము, పసుపురంగు, రూప ప్రధానము. 

నాభి వద్ద మణిపూర చక్రములో వున్న, ఆ మణిపూరాబ్జ నిలయ కు వందనం. 

ఓం శ్రీ మణిపూరాబ్జనిలయాయై నమః  


496. వదనత్రయ సంయుతా

మణిపూరాబ్జనిలయకు మూడు వదనములు, అంటే మూడు ముఖములు. 

ఈ మూడు ముఖములు శబ్ద, స్పర్శ, రూప తత్వాలకు ప్రతీక. త్రిగుణములకూ ప్రతీక. 

మూడు ముఖములతో శోభిల్లుతున్న, ఆ వదనత్రయ సంయుత కు వందనం.  

ఓం శ్రీ వదనత్రయసంయుతాయై నమః  


497. వజ్రాదికాయుధోపేతా 

వజ్రము మొదలైన ఆయుధములను ధరించిన దేవత అని ఈ నామానికి అర్ధం. 

ఈ మణిపూరాబ్జనిలయ తన మూడు చేతులతో ఆయుధాల్ని ధరించి ఉంటుంది. 

అవి శక్తి, దండము, దంభోళి. ఈ దంభోళినే వజ్రము అని అంటారు. 

నాలుగవచేతితో అభయముద్రను చూపిస్తూ ఉంటుంది. వజ్రము వంటి 

ఆయుధములను ధరించిన దేవత కనుక వజ్రాదికాయుధోపేతా అనే నామం వచ్చింది. 

వజ్రము వంటి దంభోళిని చేతిలో పట్టుకున్న, ఆ వజ్రాదికాయుధోపేత కు వందనం. 

ఓం శ్రీ వజ్రాదికాయుధోపేతాయై నమః  


498. డామర్యాదిభిరావృతా 

ఈ మణిపూరచక్ర పద్మానికి పది దళములు అని చెప్పుకున్నాం కదా. 

ఆ పది దళములలోనూ పది శక్తులు, మధ్యలో నున్న మణిపూరాబ్జనిలయను పరివేష్టించి 

ఉంటాయి. ఆ పది దేవతా శక్తులే, మాతృకావర్ణమాలలో డ నుంచి ఫ వరకూ గల హల్లు అక్షరాలు. 

ఆ దేవతాశక్తులు వరుసగా,  డామరి, ఢంకారిణి, ణామిరి, తామసి, స్థాణ్వి, దాక్షాయణి, ధాత్రి, 

నందా, పార్వతి, ఫట్కారిణి. ఈ శక్తులు మణిపూరాబ్జనిలయను చుట్టూ చేరి సేవిస్తూ ఉంటాయి. 

డ నుంచి ఫ వరకూ కల హల్లు అక్షరరూప దేవతా శక్తులచే పరివృతమై వున్న, 

ఆ డామర్యాదిభిరావృత కు వందనం.  

ఓం శ్రీ డామర్యాదిభిరావృతాయై నమః 

  

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

1, నవంబర్ 2021, సోమవారం

101. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా, స్నిగ్ధౌదనప్రియా మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ

 

కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా, స్నిగ్ధౌదనప్రియా 
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥

491. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా

అనాహత చక్ర పద్మమునకు పన్నెండు దళములు కదా. 

ఆ పన్నెండు దళములలో కాళరాత్రి మొదలుగా కల పన్నెండు శక్తులు ఉంటాయి. 

ఆ శక్తులు మాతృకావర్ణమాలలో కల, క అక్షరము నుంచి, ఠ అక్షరము వరకూ వున్న హల్లులు. 

ఆ పన్నెండు శక్తులే కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయా, 

జయా, ఝంకారి, జ్ఞనరూపా, టంకహస్తా, ఠంకారిణి.  

ఈ పన్నెండు దేవతా శక్తులూ పన్నెండు దళములలో ఉంటూ, మధ్యలో పద్మకర్ణికలో 

కూర్చుని వున్నఅనాహతాబ్జనిలయ చుట్టూ పరివృతమై ఉంటాయి.  
కాళరాత్రి మొదలగు శక్తులతో ఆవృతమై వున్న, ఆ కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృత కు వందనం. 

ఓం శ్రీ కాలరాత్ర్యాది శక్త్యౌఘవృతాయై నమః  


492. స్నిగ్ధౌదనప్రియా

స్నిగ్ధౌదనం అంటే, నెయ్యి అన్నం. ఘృతముతో కలిపిన అన్నమునే స్నిగ్ధౌదనం అంటారు. 

ఘృతము అంటే ఆవునెయ్యి మాత్రమే. ఇతర పశువుల పాల నుండి సేకరించిన నెయ్యి కాదు. 

ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే ఈ అనాహతాబ్జనిలయకు ఎంతో ప్రీతి. 

అందుకే అమ్మను ఈ నామంలో స్నిగ్ధౌదనప్రియా అంటున్నాం. 

ఎన్నో వ్యాధులకు నేతి అన్నం ఔషధం. భోజనంలో మొదటి ముద్దగా నెయ్యితో కలిపిన

అన్నం తింటే, కంఠంలో ఒక పొర ఏర్పడి తరువాత ఏమి తిన్నా, తేలికగా గొంతు దిగుతుంది. 

ఏమైనా తింటుంటే, గొంతు పట్టుకునే లక్షణం వున్నవాళ్ళు ఈ నామాన్ని జపిస్తే మంచిది. 

ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే మక్కువ కల, ఆ స్నిగ్ధౌదనప్రియ కు వందనం.  

ఓం శ్రీ స్నిగ్ధౌదనప్రియాయై నమః  


493. మహావీరేంద్ర వరదా

వీరేంద్రులంటే గొప్ప పండితులు. వాదనలో దీటు లేనివారు. ఏ పక్షమునైనా వాదించగల దిట్టలు. 

మహావీరము అనే యాగం చేసి, మహావీర అనే పాత్రలో సోమరసం తాగినవారు అని కూడా అర్ధం. 

సోమరసపానము బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. మహా వీరేంద్రులు సదా ఆనందంలో ఉంటారు. 

శివ సూత్రములలో, 'జాగ్రత్, స్వప్న, సుషుప్తు లందు కూడా తురీయావస్థను పొందువారు

వీరేంద్రులు' అని వున్నది. ఇంద్రియములను నిగ్రహించు శక్తి కలవారు వీరేంద్రులు.  

దేవీ భాగవతంలో 'ఇంద్రుడు, ప్రహ్లాదుడు చాలాకాలం యుద్ధం చేసి, ఆ యుద్ధం ఎంతకూ తెగక, 

అమ్మను ప్రార్థిస్తే, ఆ తల్లి ఈ ఇద్దరు వీరులకూ, (ఇంద్ర, వరద అంటే ప్రహ్లాదుడు) వరములు 

ఇచ్చింది' అని వున్నది. అందువలన, మహా వీర ఇంద్ర వరదా, మహావీరేంద్రవరదా, అనే నామం 

వచ్చింది. వరముల నిచ్చునది కనుక వరదా. 

మహావీరేంద్రులకు వరములు  ఇచ్చునది మహావీరేంద్రవరదా. 

అందుకే ఈ  అనాహతాబ్జనిలయను ఈ నామంలో మహావీరేంద్రవరదా అంటున్నాం. 

మహావీరులైన పండితులకు వరముల నిచ్చే, ఆ మహావీరేంద్ర వరద కు వందనం. 

ఓం శ్రీ మహావీరేంద్రవరదాయై నమః  


494. రాకిణ్యంబా స్వరూపిణీ

రాకిణ్యంబా స్వరూపిణీ అంటే రాకినీ అను పేరు కల అంబ అని అర్ధం. 

అనాహతాబ్జనిలయకే రాకినీ అని పేరు. పై నామములలో ఈ రాకిణ్యంబా స్వరూపిణి 

విశేషణములను గురించి చెప్పుకున్నాం. ఈ రాకిణ్యంబ అనాహతపద్మంలో ఉంటుంది. 

శ్యామల వర్ణంలో ఉంటుంది. రెండు తలలు కలిగి, వరాహ సమాన కోరలు కలిగి ఉంటుంది. 

చేతిలో అక్షమాలను ధరించి, రక్తధాతువులో ఉంటూ రక్తముపై ఆసక్తి కలిగి ఉంటుంది. 

కాళరాత్రి మొదలు ఠంకారిణి వరకూ కల పన్నెండు హల్లు శబ్ద దేవతల సమూహంచే 

సంవృతమై ఉంటుంది. ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే ప్రీతి. 

మహావీరేంద్రులకు కూడా వరములు ఇచ్చే దేవత ఈ రాకిణ్యంబా స్వరూపిణి.  

విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత డాకినీ అయితే, అనాహత చక్రాధిష్ఠాన దేవత రాకినీ. 

ఈ తొమ్మిది విశేషణముల విశేష్య స్వరూపురాలు, ఆ రాకిణ్యంబా స్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః 

 

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650