491. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా
492. స్నిగ్ధౌదనప్రియా
స్నిగ్ధౌదనం అంటే, నెయ్యి అన్నం. ఘృతముతో కలిపిన అన్నమునే స్నిగ్ధౌదనం అంటారు.
ఘృతము అంటే ఆవునెయ్యి మాత్రమే. ఇతర పశువుల పాల నుండి సేకరించిన నెయ్యి కాదు.
ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే ఈ అనాహతాబ్జనిలయకు ఎంతో ప్రీతి.
అందుకే అమ్మను ఈ నామంలో స్నిగ్ధౌదనప్రియా అంటున్నాం.
ఎన్నో వ్యాధులకు నేతి అన్నం ఔషధం. భోజనంలో మొదటి ముద్దగా నెయ్యితో కలిపిన
అన్నం తింటే, కంఠంలో ఒక పొర ఏర్పడి తరువాత ఏమి తిన్నా, తేలికగా గొంతు దిగుతుంది.
ఏమైనా తింటుంటే, గొంతు పట్టుకునే లక్షణం వున్నవాళ్ళు ఈ నామాన్ని జపిస్తే మంచిది.
ఆవునెయ్యితో కలిపిన అన్నమంటే మక్కువ కల, ఆ స్నిగ్ధౌదనప్రియ కు వందనం.
ఓం శ్రీ స్నిగ్ధౌదనప్రియాయై నమః
493. మహావీరేంద్ర వరదా
వీరేంద్రులంటే గొప్ప పండితులు. వాదనలో దీటు లేనివారు. ఏ పక్షమునైనా వాదించగల దిట్టలు.
మహావీరము అనే యాగం చేసి, మహావీర అనే పాత్రలో సోమరసం తాగినవారు అని కూడా అర్ధం.
సోమరసపానము బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. మహా వీరేంద్రులు సదా ఆనందంలో ఉంటారు.
శివ సూత్రములలో, 'జాగ్రత్, స్వప్న, సుషుప్తు లందు కూడా తురీయావస్థను పొందువారు
వీరేంద్రులు' అని వున్నది. ఇంద్రియములను నిగ్రహించు శక్తి కలవారు వీరేంద్రులు.
దేవీ భాగవతంలో 'ఇంద్రుడు, ప్రహ్లాదుడు చాలాకాలం యుద్ధం చేసి, ఆ యుద్ధం ఎంతకూ తెగక,
అమ్మను ప్రార్థిస్తే, ఆ తల్లి ఈ ఇద్దరు వీరులకూ, (ఇంద్ర, వరద అంటే ప్రహ్లాదుడు) వరములు
ఇచ్చింది' అని వున్నది. అందువలన, మహా వీర ఇంద్ర వరదా, మహావీరేంద్రవరదా, అనే నామం
వచ్చింది. వరముల నిచ్చునది కనుక వరదా.
మహావీరేంద్రులకు వరములు ఇచ్చునది మహావీరేంద్రవరదా.
అందుకే ఈ అనాహతాబ్జనిలయను ఈ నామంలో మహావీరేంద్రవరదా అంటున్నాం.
మహావీరులైన పండితులకు వరముల నిచ్చే, ఆ మహావీరేంద్ర వరద కు వందనం.
ఓం శ్రీ మహావీరేంద్రవరదాయై నమః
ఓం శ్రీ రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి