607. దేవేశీ
దేవతలకు ఈశ్వరి కనుక ఈ నామంలో ఆ పరమేశ్వరిని దేవేశీ అన్నారు.
దివిలో ఉండేవారు దేవతలు. ఆ దేవతలందరూ కూడా శ్రీమాతనే నిత్యమూ పూజిస్తూ వుంటారు.
బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులకు కూడా ఈ జగన్మాతే ఈశ్వరి. ఈశ్వరుడు కూడా ఈ ఈశ్వరినే
ధ్యానిస్తూ ఉంటాడు. తారకాసురుడు, మహిషాసురుడు, భండాసురుడు, చండముండులు,
శుంభనిశుంభులు మొదలైన దానవులు దేవతలను బాధిస్తూ ఉంటే, ప్రతిసారీ దేవతలను
రక్షించినది ఈ దేవేశి పరమేశ్వరియే. అందుకే అమ్మను ఈ నామంలో దేవేశీ అంటున్నాం.
దేవతల పాలిట, రక్షాకవచమై భాసిల్లుతున్న, ఆ దేవేశీ కి వందనం.
ఓం శ్రీ దేవేశ్యై నమః
608. దండనీతిస్థా
దండనీతి అర్ధశాస్త్రములో ఒక విభాగము. దండనీతి శాస్త్రములో చెప్పబడినది కనుక,
అమ్మను ఈ నామంలో దండనీతిస్థా అన్నారు. విష్ణుపురాణంలో తర్కవిద్య, వేదవిద్య, రాజనీతి,
దండనీతి, శిల్పశాస్త్రం, ఆయుర్వేదం వంటి విద్యలన్నీ శ్రీదేవియే అని చెప్పారని చెప్పుకున్నాం.
ఆ పరమేశ్వరి స్వయంగా నీతిశాస్త్ర స్వరూపం. నీతి మార్గములో లేనివారిని, దారి తప్పిన వారిని,
అమ్మ తొలుత సామ, దాన, భేద, ఉపాయములతో, తిరిగి నీతిమార్గములో పెట్టటానికి చూస్తుంది.
వారికి సన్మార్గమును బోధించీ, సహాయ సహకారములను అందించీ, దైవారాధనకూ, ఉపాసనకూ
తోడ్పడే మార్గములను సూచించీ, ఎన్నో ఉపాయములను ప్రయోగిస్తుంది.
అప్పటికీ సరియైన దారిలోకి రాని వారిని, దండనీతితో దండిస్తుంది.
దైత్యుల పట్ల చూపినది దండనీతియే. ఆ దైత్యులకు కూడా, వధించే ముందు, తమ తప్పును
సరిదిద్దుకునే అన్ని అవకాశాలనూ ఇస్తుంది. చివరగా దండనీతిని ఉపయోగించి, వారిని తప్పు
దారి నుంచి ఉద్ధరిస్తుంది. దేవీపురాణంలో అన్యాయమార్గంలో చరించేవారిని శిక్షించుట చేత
ఆ శ్రీదేవికి దండనీతిస్థా అనే నామం వచ్చిందని ఉన్నది.
దుష్టశిక్షణకై, శిష్టరక్షణకై దండనీతిని ఉపయోగించే, ఆ దండనీతిస్థ కు వందనం.
ఓం శ్రీ దండనీతిస్థాయై నమః
609. దహరాకాశ రూపిణీ
దహరము అంటే హృదయము, దహరములో వుండే సూక్ష్మ ఆకాశమే దహరాకాశము.
ఆ దహరాకాశరూపంలో ప్రాణుల హృదయంలో వుండే పరమేశ్వరియే దహరాకాశరూపిణి.
ప్రతి ప్రాణి హృదయపద్మంలో ఒక అత్యంత సూక్ష్మ గుహ వుంది. అదే దహరము.
దానిలో వుండే ఆకాశమే అమ్మ. ప్రతి ప్రాణి హృదయాకాశములో ఉంటూ, వారికి హృదయ
స్పందన యైనది శ్రీమాత. హృదయానికీ, కంఠానికీ మధ్యలో గలదే హృదయపద్మం.
ఆ పద్మం మధ్యలోనే నారాయణుడి సంకల్పం మేరకు బ్రహ్మ ఆవిర్భవించాడు.
కనుక ఈ శరీరమే బ్రహ్మపురం. ఆ బ్రహ్మపురంలో ఉన్న దహరాకాశంలో వున్నదే పరబ్రహ్మ.
ఆ పరబ్రహ్మ స్వరూపమే దహరాకాశ స్వరూపమైన జగన్మాత.
ప్రాణులందరి లోనూ గల హృత్పద్మములో దహరాకాశరూపములో ఉన్న,
ఆ దహరాకాశ రూపిణి కి వందనం.
ఓం శ్రీ దహరాకాశరూపిణ్యై నమః
ఓం శ్రీ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి