12, నవంబర్ 2021, శుక్రవారం

112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ

   

విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః 
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥

548. విమర్శరూపిణీ

పరమాత్మకు స్వభావసిద్ధమైన స్ఫురణ వున్నది. ఆ స్ఫురణా శక్తికే విమర్శ అని పేరు. 

పరమాత్మ యొక్క స్వాభావికమైన స్ఫురణ స్వరూపురాలు కనుక, ఈ నామంలో ఆ తల్లిని 

విమర్శరూపిణీ అని చెప్పుకుంటున్నాం. ఈ శక్తియే సమస్త జగత్తూ ఏర్పడటానికీ, లయించడానికీ 

కూడా కారణభూతము అని సౌభాగ్యసుధోదయంలో చెప్పబడింది. 

మాతృకావివేకములో విమర్శ అనగా వాచక శబ్దము, ఆ వాచక శబ్దమే ఆ పరమేశ్వరి భావనను 

తెలియచేస్తుంది అని చెప్పారు. అంటే, అమ్మ తనకు తానుగా శబ్దరూపములో తనను

ప్రకటించుకొనుచున్నది అని అర్ధం. శబ్దము, అర్ధము రెండూ కలిసే కదా ఉంటాయి. 

అమ్మ అని మనం పిలుచుకునే భావన వాచ్యార్థము అయితే,  

విమర్శ అని చెప్పుకుంటున్నది వాచకశబ్దము. వాచకశబ్దము, వాచ్యార్థమూ రెండూ అమ్మే. 

కనుక అమ్మ అన్నా, విమర్శ అన్నా, ఆ రెండూ ఒక్కటే. అందుకే అమ్మ విమర్శరూపిణీ. 

విమర్శనాత్మక శక్తి రూపములో అందరిలోనూ వున్నది ఆ పరమేశ్వరియే. 

ఆత్మ విమర్శ చేసుకుంటే, అది ఆత్మ జ్ఞానానికి దోహదమవుతుంది. 

ఆత్మ విమర్శ రూపంలో మనలను ఉద్ధరించే శక్తే విమర్శరూపిణీ.   

అమ్మ యొక్క స్వభావసిద్ధ శక్తి స్వరూపమైన, ఆ విమర్శరూపిణి కి వందనం. 

ఓం శ్రీ విమర్శరూపిణ్యై నమః  


549. విద్యా 

విద్య అంటే మోక్షసాధకమైనది, జ్ఞానదాయకమైనది అని అర్ధం. 

విద్య జ్ఞానస్వరూపిణి, వేదస్వరూపిణి. మోక్షాన్నీ, జ్ఞానాన్నీ ఇచ్చేది ఆ శ్రీమాతే కనుక, 

ఆ తల్లిని ఈ నామంలో విద్యా అని పిలుస్తున్నాం.  

దేవీమాహాత్మ్యములో "ఓ భగవతీ, నీవే విద్యాస్వరూపిణివి" అని చెప్పారు. 

గౌడపాదసూత్రములో, చైతన్యశక్తియే విద్య, హృదయములో వుండే కళయే విద్య, అని చెప్పారు. 

శైవతంత్రములో, ఏ కళ చేత వివేకము కలిగి, విద్యా అవిద్యా జ్ఞానము కలుగుతోందో, 

ఆ కళయే విద్య అనీ, దానినే తేజోనిష్టాకళ అంటారనీ వున్నది.  

జ్ఞానరూపములో అంతఃకరణ యందు వెలుగునది విద్య, ఆ వెలుగు అగ్ని తేజస్సు కాదు, 

అది జ్ఞాన తేజస్సు. కనుక అంతఃకరణ అందలి చైతన్యమనే తేజోకళయే విద్య అని తెలుస్తోంది. 

చైతన్య రూపములో అంతఃకరణలో తేజోకళగా వెలుగుతున్న, ఆ విద్య కు వందనం.  

ఓం శ్రీ విద్యాయై నమః  


550. వియదాది జగత్ప్రసూః 

వియత్ అంటే ఆకాశము. వియత్ మొదలైన పంచభూతములతో నిండి వున్న ఈ జగత్తును 

ప్రసవించిన ఆ జగన్మాతనే ఈ నామంలో వియదాది జగత్ప్రసూ అంటున్నాం. 

ఆ పరమేశ్వరి నుంచియే ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, 

వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృధ్వి వచ్చాయి. 

వరుసగా ప్రకృతి, పురుషుడు, త్రిగుణాలు, పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 

మొదలైనవన్నీ ఏర్పడ్డాయి. ఈ ప్రపంచమే పంచీకరణం వలన ఏర్పడింది. 

ఈ సమస్త తత్వాలతో జగత్తులనన్నింటినీ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రసవిస్తున్నది 

ఆ మూలప్రకృతి శ్రీలలిత. తిరిగి ఈ తత్వాలన్నీ ఆ జగజ్జననిలోనే లయమవుతున్నాయి. 

ఆకాశం మొదలు అన్ని తత్వముల పుట్టుకకూ ఆధారమైన, ఆ వియదాదిజగత్ప్రసూ కు వందనం. 

ఓం శ్రీ వియదాదిజగత్ప్రసువే నమః  


551. సర్వవ్యాధి ప్రశమనీ 

సర్వ వ్యాధులనూ ఉపశమింప చేయునది సర్వవ్యాధి ప్రశమనీ. 

ఆధి వ్యాధుల నుండి తన భక్తులను రక్షించునది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మను ప్రార్ధిస్తే, అన్ని వ్యాధుల నుండీ తప్పక ఉపశమనం లభిస్తుంది. 

అంటే, వ్యాధులను తొలగిస్తుంది అని అర్ధం కాదు. వ్యాధి యొక్క బాధ నుండి ఉపశమనం 

లభిస్తుంది అని అర్ధం. వ్యాధితో పాటు, దానిని భరించే, సహించే శక్తిని కూడా ఆ తల్లే ఇస్తుంది. 

'పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే' అని శాస్త్రం చెప్పింది. 

కనుక వ్యాధి వచ్చిందీ అంటే, అది ఖచ్చితంగా పూర్వజన్మలలో చేసిన పాపమే. 

అటువంటి ప్రారబ్ధం వలన వచ్చిన వ్యాధులను తప్పనిసరిగా అనుభవించవలసినదే. 

కాకపోతే, ఈ జన్మలో జ్ఞానం కలిగి, అమ్మను శరణు వేడితే, అమ్మ ఉపశమనం కలిగించి, 

ఆ వ్యాధి రుణం తీర్చుకునేందుకు అవసరమైన శక్తినీ, సహనాన్నీ ఇస్తుంది. 

అందుకే కొందరు, కష్టాలను అనుభవిస్తున్నా కూడా ధైర్యంగానే వుంటారు. 

ఆ పరమేశ్వరి ఇచ్చిన ధైర్యం అది. అందుకే అమ్మను సర్వవ్యాధిప్రశమనీ అంటున్నాం.    

తనను నమ్మినవారికి ఆధి వ్యాధులు కలిగినప్పుడు, ఉపశమనం కలిగిస్తున్న,

ఆ సర్వవ్యాధిప్రశమని కి వందనం. 

ఓం శ్రీ సర్వ వ్యాధిప్రశమన్యై నమః 

  

552. సర్వమృత్యు నివారిణీ

మృత్యువులు రెండు రకాలు. ఒకటి కాల మృత్యువు, రెండు అకాల మృత్యువు. 

కాల మృత్యువు అంటే సహజంగా ఆయువు తీరిన తరువాత కలిగే మరణం. ఇది ప్రకృతి సహజం. 

'జాతస్య మరణం ధృవం' అన్నది భగవద్గీత. పుట్టినవాడికి మరణం తప్పదు. 

అయినప్పటికీ ఆ మరణం దేహానికే కానీ, ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పటికీ చిరంజీవి.

ఈ ఆత్మజ్ఞానమును కలిగినవానికి మృత్యువు లేదు. ఇటువంటివారికి మరణం కేవలం

పాత వస్త్రాన్ని విడచి, నూతన వస్త్రం ధరించటంతో సమానం. 

అకాల మృత్యువు అంటే, ఆయువు తీరకుండానే, అనుకోని సంఘటనల వలన ప్రాణం పోవడం. 

అమ్మను సేవించినవారికి అకాల మృత్యువు కలగదు. 

కొన్నిసార్లు అజ్ఞానం కొద్దీ కాలమృత్యువును కూడా అకాలమృత్యువుగా భావిస్తూ ఉంటాం. 

కానీ అమ్మ భక్తులకు ఏర్పడ్డ మృత్యువు ఎప్పుడూ అకాలమృత్యువు  కాదు. 

అవి అన్నీ ఆయుష్షు తీరి మరణం సంభవించిన మృత్యువులే. 

ఇక సంపూర్ణంగా జీవాత్మ, పరమాత్మా ఒక్కరే అనే జ్ఞానం పొంది, ఆత్మజ్ఞానం కలిగిన వానికి 

పునర్జన్మే ఉండదు. పుట్టుక లేకపోతే మరణమే లేదు. 

అటువంటి వారు ఎప్పుడూ జననమరణాలకు అతీతంగా  ఆ పరమాత్మ యందే రమిస్తూ, 

బ్రహ్మానందంలో వుంటారు. వారికి మరణం లేదు. 

మృత్యువు అంటే అజ్ఞానం అని కూడా అర్ధం వుంది. తన భక్తులను  మృత్యువు అనే అజ్ఞానం 

నుంచి ఉద్ధరించి జ్ఞానామృతం ప్రసాదిస్తుంది ఈ పరదేవత. 

అందుకే అమ్మను ఈ నామంలో సర్వమృత్యు నివారిణీ అంటున్నాం. 

తన భక్తులకు మృత్యుభయం నివారించే, ఆ సర్వమృత్యు నివారిణి కి వందనం. 

ఓం శ్రీ సర్వ మృత్యునివారిణ్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి