26, ఆగస్టు 2021, గురువారం

34. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా


హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః 
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥

84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః 

మహాశివుడు సతీ దేహ పరిత్యాగం తరువాత, విరక్తుడై, హిమాలయాలను చేరి, తపస్సులో 

మునిగిపోయాడు. సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి, పార్వతి అనే నామంతో పెరిగి, 

శివుణ్ణి పతిగా పొందటానికి తపస్సు చేస్తోంది. ఈ ఆది దంపతులను తిరిగి కలిపితేనే కానీ సృష్టి 

తిరిగి ఆరంభం కాదని, తారకాసురుని నిర్జించే కుమారుడు పుట్టడని, బ్రహ్మ మొదలైన 

దేవతలందరూ శివుడ్ని ప్రార్ధించారు. ఏమీ లాభం లేకపోయింది. 

శివుడు సంపూర్ణ వైరాగ్యంతో తపోదీక్షలో ఉండిపోయాడు. పార్వతీ దేవి సేవలకు కూడా 

చలించటం లేదు. అప్పుడు దేవతలంతా రతీ మన్మధుల సహాయం కోరారు. 

లోకరక్షణార్ధమై మన్మధుడు దానికి అంగీకరించాడు. 

పార్వతి పక్కన వున్నప్పుడు, వసంతుడు శివుడిపై తన ఆయుధాలైన పుష్పబాణాలు వదిలాడు. 

శివుడు చలించాడు. కానీ అంతలోనే విషయం గ్రహించి, క్రోధుడై కాముడిని మూడవకన్ను, 

అగ్నినేత్రం తెరచి చూచాడు. కాముడు ఒక్కసారిగా ఉన్న చోటనే భస్మం అయిపోయాడు.

ఆ బూడిద కుప్పను చూసి, రతీ దేవి, దేవతలు అందరూ దుఃఖించారు.

భండాసుర వధానంతరం లలితాదేవిని సంస్తుతిస్తున్న బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతలు 

ఆ మన్మధుడిని తిరిగి బ్రతికించమని ఆ లలితాదేవిని ప్రార్ధించారు. 

అన్నీ తెలిసిన అమ్మ, మన్మధుని పాలిట సంజీవనీమూలిక వలె, అతణ్ణి పునర్జీవితుడిని చేసింది. 

మన్మధుడు బ్రతికాడు, కానీ దేహము లేదు, భస్మమై పోయింది. ఆత్మ మాత్రం తిరిగి బ్రతికింది. 

మదనుడు అనంగుడైనాడు. దేహము లేకపోయినా, ఆత్మస్వరూపముతో మన్మధుడు మరల 

తన స్వధర్మమైన కామోద్దీపన కార్యక్రమం ప్రారంభించాడు. 

యధావిధిగా సృష్టి కార్యం మరల మొదలైంది

అయ్యవారి వహ్నినేత్రం దహించి భస్మం చేసినా, అమ్మవారి కరుణతో మృతుని పాలిట 

సంజీవనీ ఔషధి వలె దీవించడంతో, కాముడు సజీవుడయ్యాడు.  

ఈ నామంతో అమ్మను జపిస్తే, అపమృత్యు దోషాలుంటే పోతాయి. 

అలా మన్మధుణ్ణి పునర్జీవితుడిని చేసిన, ఆ హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధి కి వందనం. 

ఓం శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః 


85. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా 

లలితాదేవి ముఖకమలము శ్రీమత్ వాగ్భవకూటము వలే వున్నది అని ఈ నామానికి అర్ధం. 

ఇంతవరకూ అమ్మవారి స్థూల దేహము, వర్ణన, భండాసుర వధ గురించి చెప్పుకున్నాం. 

ఇప్పుడు అమ్మ యొక్క సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దేహం గురించి చెప్పుకోబోతున్నాం. 

ఆ స్థూలము, ఈ సూక్ష్మములు కూడా ఒక్కటే అని తెలియపరచటం కొరకు, 

అమ్మ ముఖపద్మమే ఎంతో మహత్తు గల వాగ్భవకూటమని ఇక్కడ పోలిక చెబుతున్నారు. 

ముఖంలోని అవయవములు కళ్ళు, ముక్కు, చెవులు, పెదవులు, దంతములు, కంఠము
 
మొదలైన అంగములన్నీ వాక్కుకు దోహదపడుతున్నాయి. కనుక ఈ ముఖభాగమును 

వాగ్భవకూటము అన్నారు. అందునా అది శ్రీమత్ అంటే మహత్తైన, వాగ్భవకూటము. 

అమ్మవారి సూక్ష్మరూపము బీజాక్షర రూపము. లలితా పంచదశీ మంత్రములో మొత్తం 

పదిహేను బీజాక్షరాలుంటాయి. వాటిలోని మొదటికూటమే వాగ్భవకూటము. 

ఈ కూటములో అయిదు బీజాక్షరాలున్నాయి. క ఏ ఈ ల హ్రీమ్. 

ఈ అయిదు బీజాక్షరముల రూపమే లలితాదేవి ముఖము.  

ముఖములో కనుబొమల మధ్యలో ఆజ్ఞాచక్రము వున్నది.  అంటే, ఆ వాగ్భవకూటములో 

ఈ ఆజ్ఞాచక్ర పద్మమున్నది. అక్కడే అమ్మవారి ముఖ దర్శనం చేయాలి. 

ఆ అయిదు బీజాక్షరములనే అమ్మ ముఖముగా ఉపాసించాలి. అప్పుడు వాక్కు పొల్లు పోదు. 

ఈ సాధనలో శాంతంగా మాట్లాడటం, సత్యమే మాట్లాడటం ముఖ్యం. 

ఎంతో గొప్పదైన వాగ్భవకూటమునే తన ముఖముగా చేసుకున్న ఆ వాగీశ్వరి, 

ఆ శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ కు వందనం. 

ఓం శ్రీ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


 

25, ఆగస్టు 2021, బుధవారం

33. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా

కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా 
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత 
వైభవా ॥ 33 ॥

82. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా  

ఇక భండాసురుడు, అతని శూన్యక నగరము మిగిలాయి. ఆ శూన్యక నగరము ఇప్పుడు తన పేరు  

సార్ధకం చేసుకుంది. నగరం శూన్యమయింది. నగరంలో ఎవరూ లేరు, అందరూ హతులయ్యారు. 

కామేశ్వరి అప్పుడు కామేశ్వరాస్త్రం సిద్ధం చేసుకుంది. భండాసురునిపై సంధించింది. 

ఆ అస్త్రాగ్నిలో భండాసురుడితో పాటు, అతని శూన్యక నగరం కూడా సంపూర్తిగా దగ్ధమైపోయింది. 

యుద్ధం  దిగ్విజయంగా పూర్తి అయింది. దేవతాకార్యం సంపూర్ణంగా ముగిసింది.

చిదగ్నిలో నుండి వచ్చిన లలితాదేవి కామేశ్వరాస్త్రాగ్నిలో భండాసురుణ్ణి దగ్ధం చేసింది. 

అజ్ఞానం నశించింది. జ్ఞానాగ్ని మిగిలింది. జీవుడు దగ్ధమైనాడు. 

బూడిద నుంచి పుట్టిన భండాసురుడు తిరిగి బూడిద అయ్యాడు. 

మనం ఎలా పుడతామో, అలాగే పోతాం. కానీ ఈ మధ్యలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 

జీవుణ్ణి మాయా మోహితుడ్ని చేసి, భ్రమయే నిజమని నమ్మిస్తూ ఉంటుంది. 

అహంకారం నుంచి, క్రోధం నుంచి పుట్టిన జీవుడూ నశించాడు, అతని సామ్రాజ్యమూ నశించింది. 

బంధువులు, మిత్రులు, పుత్రులు, పరివారము, సేవక బృందమూ నశించింది. 

మిగిలినది ఆత్మయే. జీవుడు దాన్ని గ్రహించేలోగా జీవిత నాటకం అయిపోతూ ఉంటుంది. 

అందుకే ఆ సత్యాన్ని గ్రహించేవరకూ పునరపి జననం, పునరపి మరణం. 

ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అదే పరమాత్మ లీల. 

కామేశ్వరాస్త్రంతో భండాసురుణ్ణి, అతని నగరాన్నీ కూడా సమూలంగా దగ్ధం చేసిన  

ఆ కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యక కు వందనం. 

ఓం శ్రీ కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకాయై నమః 


83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా

దేవతా కార్యం విజయంగా ముగిసింది. భండాసుర వధ జరిగింది. 

అరవై వేల సంవత్సరాల పాటు, భండాసురుడుకి భృత్యులై, నానా యాతనలు పడిన 

ఆ బ్రహ్మ, ఉపేంద్రుడు, మహేంద్రుడు మొదలైన దేవతలంతా ఎంతో సంతోషించారు. 

కామప్రళయం సృష్టించి, రాక్షసులు తప్ప మరెవ్వరూ సంతానం పొందకుండా ఆపి, 

తమ సంతానం మాత్రమే వృద్ధి చేసుకున్న ఆ రాక్షస సంతతి అంతా, ఈ యుద్ధంలో 

మరణించారు. మిగిలింది కేవలమూ బూడిద, శూన్యత.   

వేల సంవత్సరాల తరబడి పొందిన వేదన నంతా మరచి, దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. 

అమ్మవారికి జయధ్వానాలు చేశారు. అమ్మ వైభవాన్ని, పరాక్రమాన్ని అందరూ స్తుతించారు. 

ఆ విధంగా బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది దేవతలచే స్తుతింపబడే 

వైభవముతో శోభిల్లే ఆ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవ కు వందనం. 

ఓం శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


 

24, ఆగస్టు 2021, మంగళవారం

32. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా

 

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః 
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా ॥ 32 ॥

80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః

లలితాదేవి తన చేతివేళ్ల పది నఖముల నుంచి నారాయణుని పది అవతారములను లీలగా 

సృష్టించింది. భండాసురుడు యుద్ధంలో అమ్మ మీదకు సర్వాసురాస్త్రం వేసాడు. ఆ అస్త్రం 

నుండి సర్వ అసురులూ, సోమకాసురుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలి, రావణుడు,  

కుంభకర్ణుడు మొదలైన  అసురులు పుట్టి, విజృంభించి పోరాటం చేయసాగారు.  

దానికి ప్రతిగా లలిత తన నఖాల నుండి పది నారాయణ ఆకృతులను సృష్టించి వదిలింది. 

అమ్మ చేతి వేళ్ళ గోళ్ళ నుంచి ఉత్పన్నమయిన ఈ మత్స్య, కూర్మ, వరాహ, 

నారసింహ, వామన, భార్గవరామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి రూపాలు, 

ఆ అసురులందరినీ తమ విష్ణుచక్రం ప్రయోగించి చంపివేశాయి. 

శక్తిచక్రము తరువాత ఈ జగత్తులో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసేది విష్ణుచక్రమే

ఎప్పుడు జగత్తులో అహంకారము పెచ్చు పెరిగి, దుర్మార్గము, హింస, పీడన, 

స్వార్ధము, ఎక్కువవుతుందో, అప్పుడు ఈ నారాయణులు ఒక్కొక్కసారి 

ఒక్కొక్క అవతారమును ఎత్తి, ఆయా రాక్షసులను పరిమారుస్తూ వుంటారు. 

ఈ సృష్టి చక్రంలో అసురులు పుడుతూనే వుంటారు. 

ధర్మ సంస్థాపన కోసం వారిని అమ్మ ఆదేశంతో, నారాయణులు సంహరిస్తూనే వుంటారు. 

జీవుడు పుడుతూనే ఉంటాడు, అహంకరిస్తూ దుర్మార్గాలు చేస్తూనే ఉంటాడు. నారాయణి, 

నారాయణుల చేతిలో చస్తూనే ఉంటాడు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. 

ఆ విధంగా ధర్మ గ్లాని కలిగినపుడు, ధర్మ పునః సంస్థాపన కోసం, 

తన చేతి పది వేళ్ళ గోళ్ల నుంచీ నారాయణ దశాకృతులను సృజించిన

ఆ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతికి వందనం.  

ఓం శ్రీ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః 


81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా 

భండాసుర సేన వస్తూనే వున్నది. లలితాసేన చేతిలో చస్తూనే వున్నది.

రుద్రుడి నుంచి పిశాచములు వరకూ గల జీవులను పశువులు అంటారు. 

ఈ పశువులకు పతి అయిన ఈశ్వరుణ్ణి పశుపతి అంటాం. ఈ పశుపతి యొక్క అస్త్రమే 

పాశుపతాస్త్రం. ఈ పాశుపతానికన్నా మహత్తైనది, మహా పాశుపతం. 

దానికి అధిదేవత సదాశివుడు. సదాశివుని అస్త్రం మహా పాశుపతం. 

మొదటి శ్లోకంలోనే శివుని యొక్క వివిధ రూపాల గురించి చెప్పుకున్నాం. 

రుద్రుడు వేరు, సదాశివుడు వేరు. వాళ్ళ శక్తులు వేరు. 

లలితాదేవి భండాసుర సేనపై మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. 

ఆ అస్త్ర శక్తికి ఆ సైన్యమంతా దగ్ధమై పోయారు. ఇక భండాసురుడు ఒంటరిగా మిగిలాడు. 

జీవుడు తన చుట్టూ వున్న ఆడంబరాలు, ఆర్భాటాలు నశించాక ఒంటరి అయిపోతాడు. 

భండాసురుడికి జరిగింది అదే. ఏ జీవుడైతే తన చుట్టూ వున్న ఈ మాయా ద్వైతంలో 

చిక్కుకోకుండా, తానే ఈశ్వరుడని, జీవేశ్వరుడనని, గ్రహిస్తాడో, ఆ జీవుడు అగ్నిలో 

దహింపబడడు. జనన మరణ చక్రము అతడిని బాధించదు. చుట్టూ ఆవరించి వున్న పటాటోపాల

మాయలో పడకుండా ఉండాలంటే, అజ్ఞానం నశించాలంటే, ఈ నామం జపించండి. 

మహా పాశుపతాస్త్రంతో ఆ భండాసుర సైన్యాన్నంతా సమూలంగా దగ్ధం చేసిన 

ఆ మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనిక కు వందనం. 

ఓం శ్రీ మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనికాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


23, ఆగస్టు 2021, సోమవారం

31. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ

  

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా 
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥

78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా

కామేశ్వరి కామేశ్వరుణ్ణి చిరునవ్వుతో చూచినప్పుడు ఉద్భవించిన వాడు మహా గణేశుడు.
అమ్మను చూస్తూనే తాను ఎందుకు సృష్టింపబడ్డాడో గణేశుడికి అర్ధం అయింది. 
వెంటనే ఆ యుద్ధప్రాంగణం అంతా ఒక్కసారి పరికించాడు. ఎన్నో యోజనాల వైశాల్యమున్న, 
ఆ సువిశాల యుద్ధ భూమిలో, సేనావాహిని మధ్యలో విఘ్నేశ్వరునికి జయవిఘ్నయంత్రమును
రచించిన ఆ పెను బండ కనిపించింది. తన దంతాలతో ఆ బండను పెకలించి, దాన్ని ఖండ
ఖండాలుగా భిన్నం చేసాడు. గణేశ్వరుడి ధాటికి భండాసురుడు విసిరిన ఆ యంత్రం
తునాతునకలై పోయింది. అంతే, ఒక్కసారిగా స్త్రీ సైన్యంలో మళ్ళీ యుద్ధోత్సాహం వచ్చింది. 
తిరిగి యుద్ధం ప్రారంభం అయ్యింది. అమ్మ సంతోషించింది. తన పుత్రుడు చూపిన బుద్ధికీ, 
బలానికీ మురిసిపోయింది. హర్షం ప్రకటించింది. 
ఈ నామంతో అమ్మను పూజిస్తే, ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోతాయి. 
ఆవిధంగా గణేశుడి చేత భిన్నమైన విఘ్నయంత్రమును, ఆ కార్యమును నెరవేర్చిన గణేశుణ్ణీ 
చూచి ప్రహర్షిత అయిన  ఆ మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షిత కు వందనం. 
ఓం శ్రీ మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః 


79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ 

ఇక రాక్షసరాజు భండాసురుడే స్వయంగా యుద్ధంలోకి దిగాడు. 

లలితాదేవిపై అస్త్ర, శస్త్రాలు ప్రయోగించటం ప్రారంభించాడు. 

అమ్మ అవలీలగా, సునాయాసంగా ఒక ఆటవలె ఆ శస్త్రాలకు ప్రత్యస్త్రాలను సంధించింది. 

ఈ యుద్ధం ఆమెకు ఆట, భండుడనే జీవుడి వేట. 

స్వార్ధపరుడైన భండుని సేనని, సేనానులను వధించి అతణ్ణి బలహీనుడిని చేసింది. 

అతని నుంచి పుత్రులను దూరం చేసి బంధాలను తెంచేసింది.

తరువాత దుర్మార్గుడైన ఆ జీవుడి భుజాలుగా పేరుపడ్డ విషంగ, విశుక్రులను చంపేసింది.  
 
ఇప్పుడు జీవుడు వంతు వచ్చింది. జీవుడికి ఇది చావుబతుకుల పోరాటం. 

ఈ యుద్ధంలో ఓడిపోతే, తాను కూడా జీవుడుగా అస్తిత్వం కోల్పోయి, 

దేవుడు అయిపోతానేమో అనే ఆందోళన. అమ్మకు లొంగాలా వద్దా అనే సంకటస్థితి, సందిగ్ధత 

చివరి ప్రయత్నంగా అమ్మవారి మీద బాణ, అస్త్ర వర్షం కురిపిస్తున్నాడు భండాసురుడు. 

తల్లి మాత్రం చెడిపోయిన పిల్లవాడిని వదులుతుందా, దండించి అయినా మంచి మార్గంలో 

పెడుతుంది. అమ్మ అనాయాసంగా భండాసురుని అస్త్రాలన్నింటినీ తిప్పికొట్టి తానూ అస్త్రాలని

వర్షింపచేస్తున్నది.  ఆ విధంగా భండాసురుడు ప్రయోగించిన అస్త్ర, శస్త్రాలకు 

ప్రత్యస్త్రాలను వర్షిస్తున్న ఆ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కి వందనం. 

ఓం శ్రీ భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


22, ఆగస్టు 2021, ఆదివారం

30. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా

 

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా 
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥

76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా

తదనంతర యుద్ధంలో దండనాథ అయిన వారాహీదేవి విశుక్రుణ్ణి సంహరించింది. 

విశుక్రుడు, భండాసురుని మరొక సచివుడు, సోదరుడు. ఈ సోదరుడు కూడా వారాహీదేవిచే 

హతుడయ్యాడు. మహా వీర్య పరాక్రమముతో వారాహీదేవి విశుక్రుడి ప్రాణాన్ని హరించేసింది. 

విశుక్రుడు శుక్రాచార్యునితో సమానమైనవాడు. తన తేజస్సును, శక్తిని 

విపరీతమైన విషయములకు వాడి ద్వంద్వములో పడిపోయినవాడు. 

ఆ జీవుడి ప్రాణశక్తిని హరించి, ఉద్ధరించింది వారాహీ శక్తి.  

జీవుడు ఎప్పుడూ రాగము-ద్వేషము, ఆనందము-దుఃఖము, కష్టము-సుఖము 

వంటి ద్వందాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. 

ఆ స్థితిలో నుంచి జీవుడిని విముక్తుడిని చేయటానికి ఈ శక్తులు ప్రకటితమవుతూ ఉంటాయి. 

విషంగ, విశుక్ర వధల వలన భండాసురుడు రెండు భుజములూ తెగినవాడై పోయాడు. 

విశుక్రుడు ప్రాణాన్ని హరించిన వారాహీదేవి వీర్య శౌర్యాలకు ఆనందిస్తున్న, 

ఆ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందిత కు వందనం. 

ఓం శ్రీ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః 


77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా 

యుద్ధంలో జరుగుతున్న ప్రాణనష్టాన్ని గమనించిన భండాసురుడు ఒక పెద్ద బండపై 

జయవిఘ్నమనే యంత్రమును గీసి దానికి ప్రాణప్రతిష్ట చేసాడు. ఆ బండను బలంగా 

శక్తిసైన్యం మధ్యలోకి విసిరివేసాడు. ఆ బండ వహ్ని ప్రాకారాన్ని కూడా దాటుకుని శక్తి సైన్యం 

మధ్యలో ఎక్కడో పడింది. ఆ యంత్రప్రభావం వల్ల శక్తి సైన్యం ఒక్కసారిగా బలహీనపడింది,

చెదిరిపోయింది. సైన్యమంతా తలొక  తీరుగా మారిపోయారు. అమ్మకు విషయం అర్ధమయింది. 

అప్పుడు ఆ విఘ్నాలను నివారించటానికి సంకల్పించింది. 

తన పతియైన కామేశ్వరుని చిరునవ్వుతో ఒకసారి చూచింది. 

అప్పటికప్పుడు గణేశ్వరుడు జన్మించాడు. గణేశ్వరుడు విఘ్ననాయకుడు. 

కామేశ్వరుని ముఖావలోకనము చేసినంత మాత్రమున గణేశ్వరుని కల్పించే శక్తి గల, 

ఆ కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వర కు వందనం. 

ఓం శ్రీ కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః 


గణేశోత్పత్తి వివిధ సందర్భాలలో వేరే వేరేగా చెప్పబడింది. 

ఇక్కడ లలితాసహస్రనామాలలో చెప్పబడిన గణేశోత్పత్తి వివరం చెప్పాను. 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


21, ఆగస్టు 2021, శనివారం

29. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా

 

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా 
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥ 29 ॥

74. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా

అమ్మవారి హృదయము నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల బాల పుట్టింది. 

అందుకే బాల లలితాదేవి పుత్రిక. యుద్ధము ప్రారంభమయింది. 

భండాసురుని సైన్యం వస్తున్నది, శక్తి సేన చేతిలో చస్తున్నది. 

భండుడు తన ముప్ఫై మంది పుత్రులను ఏకకాలంలో యుద్ధానికి పంపించాడు. 

బాల, భండ పుత్రులను వధించటానికి ఉద్యుక్తురాలయి, తల్లి అనుమతి కోరింది.  

అమ్మ అనుజ్ఞ ఇవ్వగానే యుద్ధంలోకి దిగింది, ఆ తొమ్మిది సంవత్సరాల బాల.  

తన పరాక్రమ విక్రమాలతో ఆ ముప్ఫై మంది భండాసుర పుత్రులందరినీ బాల వధించేసింది.  

భండ పుత్రులంటే, జీవుని చుట్టూ అల్లుకున్న బంధాలే. 

ఆ బంధాలను తొమ్మిదేళ్ల చిరుప్రాయంలో వున్న బాల సునాయాసంగా తెంచివేసింది. 

బంధాలు తొలగి, స్వేచ్ఛ, విముక్తి కావాలంటే బాలను  ఉపాసించాలి. 

బాల ఎవరో కాదు, లలితాదేవి బాల్యరూపమే. 

బాల ఎంత గొప్పగా ఆ భండాసుర పుత్రులని వధించిందో, 

ఆ వివరాలన్నీ అమ్మకు అందుతున్నాయి. 

తన తనయ పరాక్రమాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని, భండ పుత్ర వధ విశేషాలనీ 

ఎంతో  ఆనందంగా వింటున్న, ఆ భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందిత కు వందనం. 

ఓం శ్రీ భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః 


75. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా 

అమ్మ సేనకు మంత్రిణి శ్యామలాదేవి. ఆ శ్యామలాంబ యుద్ధంలో భండాసురుని సచివుడు,  

సోదరుడు అయిన విషంగుణ్ణి వధించి సంతోషించింది. ఈ వివరం విన్న లలితామాత కూడా 

ఆనందించింది. విషంగుడు అంటే విషంగ - విరుద్ధమైన, సంగత్వము కలిగినవాడు. 

జీవుని లోపల వున్న విషపూరితమైన విషయాసక్తులు. 

లలితాదేవి బుద్ధి నుంచి ప్రకటితమైన శ్యామలామాత, ఆ విషయాసక్తులను  ఖండించి వేసింది. 

జీవుడు స్థిరమైన బుద్ధి లేక, అనవసర, వ్యగ్రమైన, విషయాసక్తుల యందు మనస్సుని నిలిపి 

ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాడు. బుద్ధి నుంచి ప్రభవించిన మంత్రిణి శ్యామల, ఆ విష విషయ

ఆసక్తుల నుండి జీవుడ్ని ముక్తుడిని చేసింది.  

తన మంత్రిణి శ్యామల విషంగుణ్ణి వధించిన విషయం తెలుసుకుని సంతోషిస్తున్న, 
 
ఆ మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషిత కు వందనం. 

ఓం శ్రీ మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః 


ఇక్కడ ఒక పాఠాంతరమున్నది. బ్రహ్మాండ పురాణము ప్రకారము, విశుక్రుడిని మంత్రిణి 

శ్యామలాదేవి వధిస్తే, దండనాథ వారాహీదేవి విషంగుణ్ణి వధించింది. 

కానీ లలితాసహస్రనామముల ప్రకారము, విషంగుణ్ణి మంత్రిణి శ్యామలాదేవి వధిస్తే, 

దండనాథ వారాహీదేవి విశుక్రుణ్ణి వధించింది. 

ఇటువంటి మరికొన్ని భేదములను కూడా ముందు ముందు గమనించవచ్చు. 

పురాణాలన్నీ వ్యాసుడే వ్రాసినా, అన్నిటికీ కొద్ది కొద్ది తేడాలున్నాయి. 

ఈ మొత్తం నామాల్లో లలితాసహస్రంలో ఎలా చెప్పబడిందో, 

దానిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వ్యాఖ్యానం ఇవ్వబడింది. 

ఈ బేధాలు ఎప్పుడు, ఏవిధంగా ఏర్పడ్డాయో తెలియదు. 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


20, ఆగస్టు 2021, శుక్రవారం

28. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా

 

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా 
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28 ॥

72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా 

లలితాదేవి సైన్యమంతా యుద్ధానికి ఉత్సాహంగా ముందుకు ఉరుకుతోంది. 

యజ్ఞస్థలి అయిన హిమాలయ పర్వతసానువుల నుంచి, దక్షిణాపథంలో వున్న మహేంద్రగిరి

పర్వతాల వద్ద వున్న భండాసురుని రాజధాని, శూన్యకనగరానికి చేరుకుంది అమ్మ సేనావాహిని. 

భండాసురుడు విషయం తెలిసినా, 'ఒక స్త్రీ, తన స్త్రీ సేనతో నా అంతటి మొనగాణ్ణి 

సంహరించగలదా' అని ఉపేక్షించాడు. అమ్మ విలువ, శక్తి తెలియని సామాన్య జీవుడు, భండుడు. 

అమ్మ సైన్యమంతా భండసైన్యాన్ని వధించటానికి ఎంతో రణోత్సాహంతో ఉద్యుక్తులై వున్నారు. 

నకులీశ్వరి వంటి శక్తులను, వారి విక్రమాన్నీ చూసి అమ్మ హర్షం వ్యక్తం చేసింది.

జీవుడు మోహములో పడి, సంసార లంపటములో  పరిభ్రమిస్తున్నపుడు, 

శక్తి సేన మాత్రమే  జీవుడిని ఆ బంధనాల నుంచి ఉద్ధరించగలదు

ఏ శక్తీ పని చేయలేని చోట, స్త్రీ శక్తి అవలీలగా ఆ కార్యాన్ని సాధించగలదు. 

శక్తి మహాత్మ్యం అది. ద్వంద్వాన్ని తొలగించి ఏకత్వభావనను కలిగించటమే అద్వైతము. 

అప్పుడు జీవుడు, దేవుడు ఒక్కటే అనే జ్ఞానం కలుగుతుంది. 

ఆ అద్వైత జ్ఞానాన్ని ఇచ్చి బంధాల నుంచి జీవుడిని విముక్తుడిని చేసేదే  శక్తి. 

అటువంటి శక్తి సేనలన్నీ భండ వధకు ఉద్యుక్తులై  వున్నాయి.  

భండాసుర సైన్యాన్ని వధించటానికి సిద్ధంగా వున్న లలితాసైన్యాన్ని చూసి హర్షిస్తున్న, 

ఆ భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షిత కు వందనం. 

ఓం శ్రీ భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః



73. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా 

నిత్యలు తిధి దేవతలు. మొత్తం పదహారు తిధులకూ పదహారు దేవతలు. కామేశ్వరి నుంచీ 

మహానిత్య వరకూ గల ఈ నిత్యలు ఎంతో పటాటోపంతో తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. 

ఈ దేవతలందరికీ నాయిక నిత్య. 

వీరి పరాక్రమ పటాటోపాన్ని అమ్మ ఎంతో ముచ్చటగా ఉత్సాహంతో తిలకిస్తోంది. 

నిత్యలు జ్ఞానాధి దేవతలు. ఈ నిత్యలని ఉపాసిస్తే, ఆ దేవతలు నిత్యమూ జీవుడి బుద్ధిలో ఉండి, 

అనిత్యమైన అజ్ఞానాన్ని నాశనం చేసి, నిత్యమైన జ్ఞానాన్ని ఇస్తాయి. 

ఇవి అన్నీ ఆత్మ శక్తులు. ఈ శక్తులు జీవుడిని దైవానికి చేరువ చేస్తాయి. 

నిత్య మొదలైన తిధి దేవతల పరాక్రమ పటాటోపాన్ని ఉత్సాహముతో వీక్షిస్తున్న,  

ఆ నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుక కు వందనం. 

ఓం శ్రీ నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


19, ఆగస్టు 2021, గురువారం

27. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా

 

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా 
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥


70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా 

లలిత తన అహంకారము నుంచి వారాహీదేవిని సృష్టించింది. ఈ వారాహిని తన సైన్యానికి 

దండనాథగా నియమించింది. దండనాథ కిరిచక్రమనే రథమును అధిష్టించి వున్నది. 

లలితాసహస్రనామస్తోత్రంలో మూడవ రథం కిరిచక్రరథం. విశాలమైనది, ఉన్నతమైనది. 

కిరి అంటే వరాహము. వరాహములచే లాగబడుతున్న రథమును ఎక్కి వారాహీ దేవి 

దండనాథయై అమ్మను సేవించుచున్నది అని ఈ నామానికి అర్ధం. 

ఈమె లలితాసైన్యానికి దండమును ధరించి ఆదేశములను ఇస్తూ ఉంటుంది. 

కిరి అంటే కిరణము అనే అర్ధం కూడా వున్నది. 

ఈ కిరి చక్రము నుంచి ప్రసరించే కిరణములే, ఈ భూమండలమంతా ఆవరించి వున్నవి. 

వరాహశక్తి అనగా, భూమండలమును ఉద్ధరించు శక్తి. జీవుడు మార్గము తప్పినప్పుడు,

ఈ వరాహశక్తి తన కిరణములలో జీవుని బంధించి పతనమవకుండా ఉద్ధరిస్తుంది. 

దండించటానికీ, ఉద్ధరించటానికీ ఈ వరాహశక్తియే అధిదేవత.  

ఈ వారాహీ దేవతను ధ్యానిస్తే, జీవుడు పతనమవకుండా కాపాడబడతాడు. 

ఆత్మజ్ఞానమును పొంది సదాశివ తత్వంలో రమిస్తాడు.  

కిరిచక్రమనే రథమును ఎక్కి, దండనాథ అయిన వారాహీదేవిచే పూజింపబడుతున్న 

ఆ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృత కు వందనం. 

ఓం శ్రీ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః 


71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా 

జ్వాలామాలిని అనునది చతుర్దశీ తిథి దేవత. అమ్మవారి షోడశ కళలలో పధ్నాలుగవ దేవత

జ్వాలామాలిని లలితాదేవి ఆదేశంపై ఒక ఎత్తైన జ్వాలావలయం, వహ్నిప్రాకారం సృష్టించింది. 

ఆ క్షిప్త జ్వాలావలయంతో లలితాదేవి సేన అంతా పరివేష్టింపబడి వున్నది. 

అజ్ఞానాన్ని దహించి, జ్ఞానాగ్నిని రగిలించే జ్వాలలు అవి. ఆ జ్వాలలలో జ్ఞాని దహింపబడడు.  
 
శ్రీచక్రములోని ఐదు శక్తి త్రికోణములు ఈ జ్వాలామాలినీ శక్తి రూపములే.  

ఆ శక్తి త్రికోణముల మధ్య బిందు రూపములో, అమ్మ స్థిరంగా ఉంటుంది.

చుట్టూ ఎత్తైన అగ్ని జ్వాలలు, మధ్యలో సేన, ఆ మధ్యలో లలితాదేవి, ఇదే ఈ నామ దర్శనం. 

ఆ విధంగా జ్వాలామాలినిచే సృష్టించబడిన అగ్ని ప్రాకారం మధ్యలో వున్న,

ఆ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగ కు వందనం. 

ఓం శ్రీ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650



18, ఆగస్టు 2021, బుధవారం

26. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా

 

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా 
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26 ॥


68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా

లలితాదేవి చక్రరాజమనే రథమును అధిరోహించి వున్నది. 

ఆ రధము ఎన్నో యోజనముల విశాలమైనది, ఉన్నతమైనది. 

ఆ రథములో అన్ని ఆయుధములు అమర్చబడి,  ప్రయోగించడానికి 

వీలుగా, సౌకర్యముగా అమ్మవారికి అందుబాటులో వున్నాయి.

ఆ రథమునకు ఆనందమనే ధ్వజము వున్నది. దానికి తొమ్మిది కోణములు. 

అవే నవావరణములు. అన్ని రథములలో కెల్లా ఉన్నతమైన రథము చక్రరాజము. 

చక్రము తాను తిరుగుతూ రథముపై అధిరోహించిన వారిని కూడా తనతో పాటు తిప్పుతుంది. 

అమ్మ తాను అన్ని కోణాలలో తిరుగుతూ, అందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ, ఈ ముల్లోకాలనీ 

పాలిస్తూ ఉంటుంది. అమ్మవారిని చక్రరాజ రథముపై ఊహించుకుని ఉపాసించండి. 

అర్హులకు చక్రశుద్ధి, చక్రసిద్ధి కలుగుతాయి. అదే శుద్ధవిద్య. 

ఆ శుద్ధవిద్యను పొందిన యోగి సాక్షాత్తూ సదాశివుడంత వాడు అవుతాడు. అదే జ్ఞానము.  

జ్ఞానము కలిగిన తరువాత జీవుడు కర్మల నుండి విముక్తి చెందుతాడు. 
   
అటువంటి జ్ఞానమును అందించు ఉపకరణములే ఆయుధములుగా వున్న చక్రరాజరథమును 

అధిరోహించి వున్న, ఆ చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృత కు వందనం. 

ఓం శ్రీ చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయై నమః 



69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా

లలితాదేవి బుద్ధినుంచి ప్రభవించిన శక్తియే శ్యామలాదేవి. 

ఈమె గేయచక్రమను రథమును అధిరోహించి వున్నది. 

గేయచక్రమనునది లలితాసహస్రనామస్తోత్రంలో చెప్పే రెండవ రథము. 

శ్యామలాదేవిని అమ్మ మంత్రిణిగా నియోగించింది.  

మంత్రిణి అంటే, మంత్రస్వరూపమైన శక్తి, మంత్రాధిదేవత, మంత్రాంగము చేయునది.

మంత్రమును ఉపాసించువారికి మంత్రసిద్ధిని ఇచ్చే దేవత. 

సూక్ష్మంగా దర్శిస్తే, లలితయే శ్యామల. ఎందుకంటే, అమ్మ బుద్ధి నుంచి ప్రకటితమైనది. 

లలితాదేవి కార్యం కోసమై, లలితాదేవి ఆలోచనతో రూపు దాల్చిన శక్తి శ్యామల. 

గేయము అంటే స్తుతించటానికి సిద్ధముగా వున్న స్తోత్రము. 

అటువంటి స్తోత్రముతో సిద్ధముగా వున్న ఈ గేయచక్ర రథము కూడా 

ఏడు కోణములు, ఆవరణలు కలిగి ఉంటుంది. విశాలమైనది, ఉన్నతమైనది. 

ధియో యోనః ప్రచోదయాత్. జీవుని ధీశక్తిని ప్రచోదనం చేసేది, సవితృమండలం. 

ఈ శ్యామలాదేవి ఉపాసన మన బుద్ధిని ప్రచోదనం చేసి, ఊర్ధ్వలోకమైన సూర్యమండలం 

వరకూ తీసుకుపోయే శక్తి గలది. ఈశ్యామలకే కొంత భేదంతో, మాతంగి, లఘుశ్యామల, 

రాజశ్యామల వంటి నామాంతరములు వున్నాయి. 

తన బుద్ధి నుంచి ప్రకటితమైన శ్యామలాదేవి మంత్రిణిగా, గేయచక్రరథారూఢయై  

చేస్తున్న స్తోత్రాన్ని స్వీకరించే తల్లి, ఆ గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవిత కు వందనం. 

ఓం శ్రీ గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650