ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥ 39 ॥
103. ఆజ్ఞా చక్రాంతరాళస్థా
కనుబొమల మధ్య గల భాగాన్ని భృకుటి అంటాం. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది.
ఆ ఆజ్ఞాచక్రపద్మ మధ్యంలో పరమేశ్వరి, ప్రసన్నంగా ఆశీనురాలయి ఉంటుంది.
ఈ పద్మానికి రెండే రేకలు. అవి ఇడా, పింగళా నాడులకు సంకేతం.
ఆ రెండింటి మధ్య నుంచి సుషుమ్నానాడి, పైకి సహస్రారం వైపుకు కదులుతుంది.
ఈ రెండు రేకలూ శివ, శక్తి స్థానాలకు కూడా సంకేతం.
ఈ ఆజ్ఞాచక్రం వద్ద జపం చేస్తే, ఆజ్ఞాపించ గల గురువు దర్శనం అవుతుంది.
ఋషుల దర్శనం అయ్యేదీ ఇక్కడే. అక్కడే జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇక్కడి నుంచీ అయ్యే దర్శనాలేవీ భ్రమలు, భ్రాంతులు కావు.
అప్పటికి జీవుడు, మనోనిగ్రహం పొంది, కోరికలు దగ్ధమయి, బాహ్య ప్రేరణల పట్ల
ఎక్కువగా చలించని స్వభావాన్ని కలిగి ఉంటాడు.
ఆ ఆజ్ఞా చక్రంలో ఉంటూ మనలను ఉద్ధరిస్తున్న, ఆ ఆజ్ఞాచక్రాంతరాళస్థ కు వందనం.
ఓం శ్రీ ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః
ఓం శ్రీ రుద్రగ్రంథివిభేదిన్యై నమః
105. సహస్రారాంబుజా రూఢా
ఆజ్ఞ పైన సహస్రార కమలమని చెప్పుకున్నాం కదా. ఈ పద్మానికి వెయ్యి రేకలు.
ఇదిగో, ఇక్కడ, ఆ లలితా పరమేశ్వరి సహస్రార కమలంపై కూర్చుని ఉన్నది.
తల మధ్యలో వున్న మాడు వద్ద వున్న ప్రాంతం ఈ సహస్రార స్థానం.
మాడు పుట్టినప్పుడు తెరచుకుని ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మాయ కమ్మి మూసుకుపోతుంది.
దీనికి పైన బ్రహ్మ రంధ్రమున్నది. జపతపాలతో ఆ బ్రహ్మ రంధ్రాన్ని తెరచుకుని జీవుడు
స్వేచ్చని పొందాలి. అప్పుడే జీవుడికి తానే దేవుడు అన్న భావన స్థిరపడుతుంది.
ఆ స్థితిని పొందితే జీవుడు ఆ సహస్రార పద్మంలో, వెలిగిపోతున్న లలితా పరమేశ్వరిని దర్శించి,
బ్రహ్మానంద భరితుడవుతాడు. ఒక్క విషయం శ్రద్ధాభక్తులతో గమనించండి.
ఈ మొత్తం సాధనా క్రమంలో, ప్రతి దశలోనూ అమ్మ జీవుడితోనే వున్నది.
తల్లి పిల్లలను ఎంత భద్రంగా, పక్కనే వుండి నడిపిస్తుందో, ఈ లలితమ్మ కూడా
తన రక్షణ కోరి వచ్చిన అందరినీ, కాపు కాచుకుంటూ తన మార్గంలో నడిపిస్తున్నది.
సహస్రార కమలంలో ఉంటూ మనలను ఎంతో అవ్యాజానురాగంతో, ప్రేమతో,
కరుణిస్తున్న, ఆ సహస్రారాంబుజారూఢ కు వందనం.
ఓం శ్రీ సహస్రారాంబుజారూఢాయై నమః
106. సుధాసారాభి వర్షిణీ
ఆ సహస్రార కమల స్థాయికి చేరుకుంటే, సుషుమ్నానాడి ద్వారా పైకి వెళ్లిన
జీవుడికి దొరికేది అమృతవర్షము. అమ్మ అక్కడ చంద్రవంక రూపములో సుధలను వర్షిస్తుంది.
ఆ సుధాధారలను స్రవిస్తున్న తత్వమే కామధేను తత్వము.
గ్రంధి భేదనములు జరిగి, ఇంద్రియ నిగ్రహంతో, అసూయ లేని అనసూయ తత్వంతో,
సమస్త సృష్టి పట్లా ఏకత్వ భావము పొందిన, జీవుడికి ఇక్కడ కామధేనుతత్వం బోధపడుతుంది.
ఈ జ్ఞానం పొందిన వారికి, గరికపోచ బ్రహ్మాస్త్రమెలా అవుతుందో,
అదే విధంగా సామాన్య ధేనువు, కామధేనువు అవుతుందని అవగాహన కలుగుతుంది.
అటువంటి కామధేనువు జ్ఞాన సుధాధారలను తన పొదుగు నుంచి వర్షిస్తుంటే,
డెబ్బై రెండు వేల నాడులూ ఆ అమృత ధారలలో తడిసి జీవుడు ఆనందభరితుడవుతాడు.
సరియైన మార్గంలో సాధన చేస్తే, ప్రతి గ్రంధీ ఉపాసకుల పాలిట కామధేనువు అవుతుంది.
ఆ స్థితికి చేరుకోవాలంటే అమ్మ చరణాలను పూజించాలి. అప్పుడు ఆ చరణకమలాలే
ఉపాసకులను సహస్రార కమలానికి చేరుస్తాయి. జీవుని శరీరమంతా పద్మమయం.
ప్రతి పద్మమూ, దాని ప్రతి దళమూ ఉపాసకులకు దివ్యానుభూతులను అందిస్తాయి.
ఆ అమృత అనుభూతులను, సహస్రారకమలం చేరుకున్న ఉపాసకుల కొరకు,
చంద్రమండలం నుంచి, సుధాధారల రూపంలో వర్షిస్తున్న, ఆ సుధాసారాభి వర్షిణి కి వందనం.
ఓం శ్రీ సుధాసారాభివర్షిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650