11, ఆగస్టు 2021, బుధవారం

19. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా

 నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా 
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ॥ 19 ॥


44. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా 

ఇప్పుడు ఆ పరాశక్తి  కాలివేళ్ళ గోళ్ళ గురించి తలచుకుందాం. 

ఒక మహా జ్ఞాన ప్రకాశము, గొప్ప విద్యుత్కాంతి ఆ గోళ్లను కప్పి వుంది. 

ఒక చక్కని రశ్మి, ఆభ, వెలుగు, ద్యుతి ఆ నఖములను ఆచ్ఛాదించి వున్నది.  

ఆ కాలి గోటి కాంతి ప్రవాహములో సమస్త జగత్తూ ఓలలాడుతోంది. 

ఆ పాదాలకు నమస్కరించిన వారి అజ్ఞానమనే తమస్సు, ఈ నఖ కాంతుల వలన 

నశించి పోతున్నది. అజ్ఞానము నశింపబడిన తరువాత, 

వారు కూడా ఆ మహా ప్రకాశంలో లీనమయి, ధన్యులవుతున్నారు. 

వారి అజ్ఞానపు పొర తొలగించబడి, జ్ఞానము బహిర్గతమవుతోంది.

ఆ హైమావతీ పాద పద్మములు ఎవరి హృదయములో కైనా చేరగలవు.  

తమ నఖ కాంతులతో వారి  లోపల ఉన్న తమోగుణాన్ని తొలగించి ఉద్ధరించగలవు.  

తనకు పాద నమస్కారం చేసిన వారి తమోగుణాన్ని, తన కాలి గోటి ప్రభలతో తొలగిస్తున్న 

ఆ పరమేశ్వరి, ఆ నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ కు వందనం. 

ఓం శ్రీ నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణాయై నమః 


45. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా

ఇక మొత్తంగా ఆ రాజరాజేశ్వరి పాదపద్మాల గురించి చెప్పుకుందాం. 

ఆ పాదద్వయ తేజస్సుకు, ప్రభావానికి ముందు మరేవీ సాటి రాలేవు. 

సాధారణంగా పాద పద్మాలు అంటాం. 

ఇక్కడ అమ్మవారి పాదాలు ఆ పద్మాలనే పరాకృతం చేస్తూ తేజరిల్లుతున్నాయి. 

సరోరుహములైన పద్మములు ఎంతో స్వచ్ఛంగా, అతి మృదువుగా, చక్కని ప్రకాశంతో,

తాకితే మాసిపోతాయా, నలిగిపోతాయా అన్నట్లుంటాయి. 

ఆ పద్మాల కన్నా మృదువైనవి, స్వచ్ఛమైనవి, రాజరాజేశ్వరి పాదాలు. 

ఆ పాదాలు భక్తులకు తరుణోపాయాలు. ఉపాసకులకు స్మరణోపాయాలు

సిద్ధులకు శరణోపాయాలు. యోగులకు ధన్యోపాయాలు.   

తన పాద ప్రభాజాలంతో, నిజమైన పద్మాలను కూడా ధిక్కరించగల 

ఆ త్రిపురసుందరి, ఆ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ కు వందనం. 

ఓం శ్రీ పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి