6, ఆగస్టు 2021, శుక్రవారం

14. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ


కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ॥ 14 ॥

33. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ 

పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరూ పందెం వేసుకున్నారు. 

పరమేశ్వరుడు రత్నములలో కెల్లా శ్రేష్టమైన తన ప్రేమరత్నమును పణంగా పెట్టాడు. 

పరమేశ్వరి ఆ కామేశ్వర ప్రేమరత్నాన్ని దక్కించుకోవాలంటే 

దానికి తగిన ప్రతిపణాన్ని తానూ ఒడ్డాలి.  

ఆమె వెంటనే పరమేశ్వరుడికి ప్రతిపణంగా ఏమిస్తే, ఆ ప్రేమరత్నాన్ని గెలుచుకోగలదో 

అటువంటి తన స్తన ద్వయాన్ని ఒడ్డింది. 

దానితో అమ్మవారికి కామేశ్వరుని ప్రేమరత్నం దక్కింది. 

అయ్యవారికి కామేశ్వరి స్తన రత్నాలు రెండూ దక్కాయి. ఇద్దరూ గెలిచారు. 

ఇక్కడ అమ్మవారి స్తనద్వయమంటే సాధారణమైన స్తనాలు కావు. 

ఆ స్తనాలు రెండూ సమస్త జగత్తునీ పోషించే నిండు పాల కుండలు

అలాగని ఆ స్తనాలు రెండూ కురిపించేవి కేవలము క్షీరధారలూ కావు.  

జ్ఞానం, విజ్ఞానం అనే ఫలాలను ఇచ్చే రెండు పూర్ణ కుంభాలు అవి. 

జ్ఞాన, విజ్ఞానముల కోసం ధ్యానించవలసినది ఆ జగజ్జనని స్తనద్వయాన్ని. 

జ్ఞానసంబంధర్ శిశువుగా వున్నప్పుడు అమ్మవారే స్వయంగా ఆ ద్రవిడ శిశువుకు 

చన్నిచ్చి ఆకలి తీర్చిందని చెప్తారు. ఆ తరువాత ఆ జ్ఞాన విజ్ఞాన క్షీర ధారలను త్రాగిన 

జ్ఞానసంబంధర్ గొప్ప కవి, భక్తుడు అయ్యాడు. 

అమ్మవారి స్తన్యాన్ని గ్రోలిన అతడి జన్మ ధన్యం. 

కామేశ్వరుడు ఈ పందెంలో  కామేశ్వరి యొక్క స్తన ద్వయాన్ని పొందాడూ అంటే, 

ఆ మధ్యలోని హృదయ కుహరములో స్థిరంగా ఉన్న కామేశ్వరి హృదయాన్ని పొందినట్టు. 

ఆది దంపతులు మధ్య ఏర్పడిన ఈ ముచ్చటైన ఆ పందెం వలన, 

కామేశ్వరుడికి కామేశ్వరి హృదయరత్నం దక్కితే, కామేశ్వరికి  కామేశ్వరుని ప్రేమరత్నం దక్కింది. 

ఈ వస్తు మార్పిడి వలన ఇద్దరూ ఆనందపడ్డారు. ఇద్దరూ గెలిచారు. 

ఆ విధంగా ప్రతిపణంగా తన స్తనద్వయాన్ని ఇచ్చి కామేశ్వరుని ప్రేమరత్నాన్ని గెలుచుకున్న 

ఆ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని కి వందనం. 

ఓం శ్రీ కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తన్యై నమః 


                                        34. నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ

ఇక్కడ కూడా ఆ శ్రీమాత యొక్క కుచముల గురించి చెప్పుకుందాం. 

ఒక చక్కటి  సొగసైన లత, ఆ లతకి అటూ ఇటూ రెండు మధురమైన నిండైన ఫలములు.  

చూస్తే ఎంత కన్నులవిందుగా ఉంటుంది. అందునా అవి తల్లి కుచములైతే..... 

అమ్మవారి కుచములు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనసులో దర్శించండి. 

నాభి నుంచి తిన్నగా పైకి ఒక లత వలె ఒక రోమ పంక్తి  లేచింది. 

ఆ లత చక్కగా పెరిగింది. కుడి ఎడమలుగా రెండు లతా ఫలాలు ఉద్భవించాయి.

అవి రెండూ మనకు ఆకలి తీర్చే మధుర ఫలాలు. 

ఆ ఫలరసాన్ని త్రాగిన జ్ఞానసంబంధర్ ఎంతటి  ఉత్తమ స్థితి పొందాడో గదా.  

సంగీతసాహిత్యాలు, జ్ఞానవిజ్ఞానాలు, వివేకవైరాగ్యాలు అందించే మహాశక్తి గలవి ఆ కుచములు. 

నాభి నుంచి తిన్నగా ఊర్ధ్వంగా ఎదిగే తీవెకు అంటిపెట్టుకుని ఫలించిన 

పండ్లవలె ఉన్న కుచములు గల, ఆ నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయి కి వందనం. 

ఓం శ్రీ నాభ్యాలవాలరోమాళిలతాఫల కుచద్వయ్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650



2 కామెంట్‌లు: