30, ఆగస్టు 2021, సోమవారం

38. మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంథి విభేదినీ

 

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ 
మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥

99. మూలాధారైక నిలయా

మూలాధార చక్రం వద్ద కుండలినీ శక్తి ఒక సర్పము వలె మూడున్నర చుట్లు 

చుట్టుకుని, శిరసుని కప్పుకుని, నిద్రాణ స్థితిలో ఉంటుంది. శ్రీదేవి స్థానం ఆ మూలాధారచక్రమే. 

ఆ మూలమే మొదలు కనుక అది ఆధారం. ఆధారం అది ఒక్కటే కనుక అది ఏక ఆధారం. 

అక్కడ నివాసం వున్న ఆ శ్రీదేవి, మూలాధారైకనిలయ. 

మూలాధార చక్రపద్మానికి నాలుగు రేకలు. ఆ పద్మ మధ్య బిందువుకే కులకుండమని పేరు. 

ఆ కులకుండము లోనే కుండలినీ శక్తి  ముడుచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. 

అదే అమ్మ నిలయము. అక్కడ వున్న కుండలినీ శక్తి సుషుమ్న ద్వారా, సహస్రారం వద్ద వున్న 

శివుడ్ని చేరటానికి ఊర్ధ్వగమనం మొదలెడుతుంది. 

అమ్మే స్వయంగా ఉపాసకులను మూలాధారం నుంచి సహస్రారం వరకు నడిపించి, అక్కడ 

శివునితో కలుపుతుంది. నిరంతరమూ ఆ సాధనలో ఉండటమే దానికి త్రోవ.   

నిద్రాణమై వున్న కుండలినిని ఉపాసనతో లేపితే, ఆ శక్తే మనల్ని ముందుకు నడిపిస్తుంది. 

మూలాధారచక్రం వద్ద కుండలినీ రూపంలో వున్న ఆ మూలాధారైకనిలయ కు వందనం. 

ఓం శ్రీ మూలాధారైకనిలయాయై నమః 


100. బ్రహ్మగ్రంథి విభేదినీ 

మన శరీరంలో ఆరు చక్రాలు, మూడు గ్రంధులువున్నాయి. గ్రంధి అంటే ముడి. 

సంసారలంపటంలో పడి, మనకు మనమే వేసుకున్న చిక్కుముడులుగా వీటిని భావించండి. 

మొదటి గ్రంధి బ్రహ్మగ్రంధి. ఆ గ్రంథిలో బ్రహ్మ ఉంటాడు కనుక అది బ్రహ్మ గ్రంధి. 

ఈ ముడి మూలాధారచక్రము, స్వాధిష్ఠానచక్రములకు వేసిన ముడి.

మూలాధారం పైన ఒకటి, స్వాధిష్టానము పైన ఒకటి, మొత్తము రెండు గ్రంధులున్నాయి. 

ఆ రెండు గ్రంధులనూ కలిపి బ్రహ్మ గ్రంధి అంటారు. స్వాధిష్టానపద్మమునకు ఆరు రేకలు. 

జీవుడు ఉపాసనతో, గురుసహాయముతో, బుద్ధితో ఈ ముడిని విప్పుకుని పైకి సాగాలి. 

ఈ గ్రంధి భేదనము జరగకపోతే, జీవుడు మరింతగా విషయలాలసలో పడిపోతాడు. 

ఆ గ్రంధి భేదన శక్తి అమ్మయే. ఆ బ్రహ్మ గ్రంధి భేదనం జరిగితే కానీ, విషయవాసనలు వీడవు. 

ఉపాసకులకు ముడి వేసేదీ అమ్మమాయే, తిరిగి ఆ ముడిని విప్పేదీ అమ్మమాయే.  

ఈ మాయా సంసార జంజాటము దాటించి, బ్రహ్మగ్రంధిని భేదించే జ్ఞానాన్నిచ్చే, 

ఆ బ్రహ్మగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః 


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

మొదటి వంద నామాల వివరణ సంపూర్ణం 


101. మణిపూరాంతరుదితా

స్వాధిష్టాన చక్రానికి పైనున్నది నాభి దగ్గర వున్నమణిపూర చక్రం. ఈ పద్మానికి పది రేకలు. 

ప్రతి పద్మానికీ ఉన్న ప్రతిరేకా, సాధనా మార్గంలో జీవుడికి జ్ఞాన సముపార్జనలో 

రకరకాలైన అనుభవాలను ఇస్తుంది. బ్రహ్మ గ్రంధి భేదనము అయి, దాన్ని దాటగానే, 

అక్కడ వున్న మణిపూర చక్ర మధ్యములో అమ్మ ప్రకటితమవుతుంది.  

ఆ మణిపూర చక్ర పద్మ మధ్యంలో వున్న తల్లే మణిపూరాంతరుదిత.  

అక్కడ శ్రీదేవిని మణులతో పూజిస్తే ఆమె తృప్తి చెందుతుంది. 

ఒక పది దళాలతో వున్న పద్మాన్ని ఊహించుకోండి. ఆ పద్మం మధ్యలో, 

చక్కగా రత్నాభరణాలతో, మణిమకుటాలతో కూర్చుని వున్న శ్రీదేవిని దర్శించండి. 

ఆ అమ్మకు మీరు రత్న మాణిక్యాలతో పూజచేస్తున్నట్టు భావించండి. 

ఆ మణిపూరాంతరుదిత అప్పుడు సంతృప్తయై, 

మిమ్మల్ని సాధనా మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. 

మణిపూర చక్రపద్మ మధ్యంలో ప్రకటితమైన ఆ మణిపూరాంతరుదిత కు వందనం. 

ఓం శ్రీ మణిపూరాంతరుదితాయై నమః 



102. విష్ణుగ్రంథి విభేదినీ

మణిపూర చక్రం పైన విష్ణుగ్రంధి వున్నది. ఈ ముడి వద్ద విష్ణువు ఉంటాడు. 

ప్రతి జీవిలోనూ సురాసురులిద్దరూ వుంటారు. 

ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే, అయినా ఎప్పుడూ పరస్పరం కలహించుకుంటూనే వుంటారు. 

ఈ విరోధం హద్దులు దాటినప్పుడు, స్వయంగా విష్ణువే ప్రకటితమయి 

ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు. ఏదీ ఎక్కువగా చేయకుండా,

రాగము - ద్వేషము కానీ, మిత్రత్వము - శత్రుత్వము కానీ, ఆశ - దురాశ కానీ 

శృతి మించకుండా చూసే శక్తి విష్ణుశక్తి. 

మణిపూర చక్రమునకు పైన వున్న గ్రంధి విష్ణు గ్రంధి. 

ఆ ముడి వద్ద విష్ణువు వున్నాడు కనుక అది విష్ణు గ్రంధి. 

ఈ గ్రంధి వద్ద సాధకుడు తానే ఆ విష్ణువు అన్న భావనలో ఉండాలి. 

అన్నిటి పట్లా సమతాభావం ఉండాలి. దాన్నే సోహం అని మనం చెప్పుకుంటున్నాం. 

ఆ పైన వున్న చక్రం అనాహతం. ఆ పద్మానికి పన్నెండు రేకలు. 

ఇది హృదయ స్థానమందు వున్నది. హృదయమంతా విష్ణువే కొలువై ఉన్నట్టు భావించాలి. 

ఆ విష్ణువే నేను అన్న భావంలో స్థిరపడితే, ఈ రెండు చక్రాలకూ వున్న ముడి, 

ఆ విష్ణు గ్రంధి భేదనం జరుగుతుంది. ఆ తరువాత 

విష్ణుమాయ విడిపోయి, సాధన పైకి సాగుతుంది. 

విష్ణుగ్రంధి విభేదనం చేసి, విష్ణుమాయను తొలగించిన, ఆ విష్ణుగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ విష్ణుగ్రంథివిభేదిన్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


2 కామెంట్‌లు:

  1. మీ వివరణ గ్రంథుల గురించి చాలా చక్కగా వుంది.రుద్రగ్రంథి తరువాత ఒకసారి మీ నుండి వినాలని ఉంది.

    రిప్లయితొలగించండి
  2. You can call me on the number given under the post. Better call at around 5 pm.
    Please mention your name.
    Namaste.

    రిప్లయితొలగించండి