12, సెప్టెంబర్ 2021, ఆదివారం

51. దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా

   

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా 
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ॥ 51 ॥

193. దుష్టదూరా 

దుష్టులకు ఆ లలితాపరమేశ్వరి చాలా దూరము. ఆమెను దుష్టులు ఎప్పటికీ చేరలేరు. 

తెలుసుకొనలేరు. దోషము కలవారికి ఆ శుద్ధ జ్ఞాన స్వరూపిణి అందదు. 

వారిని దగ్గరకు కూడా రానియ్యదు. దూరుట అంటే నిందించటం, అధిక్షేపించటం.  

కుతర్కము, వితర్కము చేయువారు కూడా ఆ విశ్వేశ్వరిని అందుకోలేరు. వారు కూడా దుష్టులే. 

ఏ విషయము పైన అయినా, తర్కము చేయవచ్చు కానీ, కుతర్కము, 

వితర్కము చేసేవారి దుష్టత్వము అమ్మ ఆగ్రహానికి దారి తీస్తుంది. 

ఇతరులను నిందించుట, హింసించుట, కష్టము, నష్టము కలిగించుట దుష్టుల లక్షణము.  

అట్టివారి దుష్టత్వాన్నీ, ధూర్తత్వాన్నీ, అమ్మ సహించదు. వారిని దూరంగానే ఉంచుతుంది.  

ఆ శ్రీమాతను దూరం చేసుకోవడం కన్నా దౌర్భాగ్యమేముంటుందీ. 

వారు ఈ భౌతిక ప్రపంచములో ఎంత పెద్ద పదవిలో వున్నా, ఎంత ధనవంతులైనా, 

అమ్మకు దూరమైన కారణం వల్ల క్రమంగా శక్తిహీనులై, తుదకు నశించిపోతారు. 

దుష్టులను, దోషులను, దూరంగా ఉంచే, ఆ దుష్టదూర కు వందనం. 

ఓం శ్రీ దుష్టదూరాయై నమః 

194. దురాచార శమనీ 

దురాచారము అంటే చెడు ప్రవర్తన. దానిని శమింపచేస్తుంది కనుక ఆ తల్లి దురాచరశమనీ. 

చేయవలసిన కర్మలు చేయకపోవటం, చేయకూడని కర్మలు చేయటం రెండూ దురాచారమే. 

అమ్మ తన భక్తులు ఈ రెండు దోషాలూ చేయకుండా ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. 

ఆ ఆదేశాన్ని అందుకున్నవారు ఆ తప్పు చేయరు. అప్పుడు వారికి దోషము కలుగదు. 

జీవుడికి దురాచారము వలన పాపము కలుగుతుంది.  

అమ్మ పాపశమనీ కూడా కనుక, ఆ పాపము పోవాలంటే, అమ్మనే ఆశ్రయించాలి. 

అటువంటి ఆదేశములను స్వీకరించక, మరల మరల దురాచారము చేస్తూ ఉంటే,

ఆ దుష్టులకు అమ్మ దూరం అయిపోతుంది. వారికి అందదు. 

వారు తిరిగి జన్మలు తీసుకుంటూ నెమ్మదిగా తమ ప్రవర్తనను సరి చేసుకోవాల్సిందే. 

అది కూడా కేవలమూ అమ్మ అనుగ్రహం పొందిన తరువాతే. 

భక్తులయినా సరే దురాచారం చేస్తే, దానికి తగిన శిక్షను అనుభవించవలసినదే. 

దురాచారం జరిగినపుడు, దానిని శమింపచేసుకోవటం కోసం అమ్మను ప్రార్థిస్తే, 

ఆ దురాచారశమని ఆ దోషాన్ని దయతో పోగొట్టి జీవుడిని శుద్ధుడిగా చేస్తుంది.  

దయతో, దురాచార దోషాన్ని పోగొట్టే, ఆ దురాచార శమని కి వందనం. 

ఓం శ్రీ దురాచారశమన్యై నమః 


195. దోషవర్జితా 

రాజరాజేశ్వరీదేవికి దోషములుండవు, దోషములంటవు. దోషములను వర్జించినది, అంటే, 

త్యజించినది, వదిలివేసినది. కనుక ఆ తల్లి దోషవర్జితా అనే నామంతో పిలువబడుతోంది. 

ప్రత్యేకముగా దేని పట్ల అయినా రాగము కానీ, ద్వేషము కానీ కలిగి ఉంటే కూడా అది దోషమే. 

ఆ తల్లి రాగమథని కనుక, ఆ కాత్యాయనికి ఈ రాగద్వేషాలు రెండూ లేవు. కనుక ఆమె దోష వర్జిత.  

జీవుడు తన దోషాలను పోగొట్టుకోవాలంటే, ఈ నామాన్ని జపించాలి. 

ఆ దోషవర్జితాదేవి అప్పుడు ఆ దోషాలను తొలగించి జీవుడిని విముక్తుడిని చేస్తుంది. 

జీవుల దోషాలను పరిహరించే, ఏ దోషములూ లేని ఆ దోషవర్జిత కు వందనం. 

ఓం శ్రీ దోషవర్జితాయై నమః 


196. సర్వజ్ఞా 

అన్నీ తెలిసినది కనుక, సర్వజ్ఞా అనే నామం ఆ తల్లికి సార్ధకం అయింది. 

అమ్మ సర్వసాక్షి, ఆ తల్లికి తెలియనిదేమీ లేదు. ఆ తల్లి నుంచి ఎవరూ ఏదీ దాచలేరు. 

లలితాపరమేశ్వరి శుద్ధజ్ఞాన రూపిణి. తానే స్వయంగా జ్ఞాన భాండాగారమయిన,

ఆ తల్లికి తెలియని విషయమేమీ లేదు, ఉండదు. ఆమె సర్వజ్ఞ. 

కాశ్మీరములో వున్న సర్వజ్ఞ పీఠానికి ఈ పరమేశ్వరే పీఠాధీశ్వరి. కనుక ఆమె సర్వజ్ఞ. 

అందరి యందు, అన్నింటి యందు వున్న ప్రజ్ఞ ఆ తల్లి అంశమే కనుక ఆమె సర్వజ్ఞ.  

ఆ తల్లి శుద్ధ చైతన్య స్వరూపిణి కనుక ఆమె సర్వజ్ఞ. 

శుద్ధ ప్రజ్ఞకు అధిదేవత అయిన ఆ సర్వజ్ఞ కు వందనం. 

ఓం శ్రీ సర్వజ్ఞాయై నమః 


197. సాంద్రకరుణా

అమ్మ దయాస్వరూపిణి. సంపూర్ణ కరుణామూర్తి. సాంద్రమైన అంటే చిక్కని, ఘనమైన అని. 

తల్లి కదా, పిల్లలకు కష్టం కలగకూడదని జాగ్రత్తలు చెపుతూ ఉంటుంది. 

ఒక్కోసారి లాలిస్తుంది, ఒక్కోసారి మందలిస్తుంది, ఒక్కోసారి దండిస్తుంది. 

ఆ మాహేశ్వరికి కరుణ ఎక్కువ, జీవుడికి కఠినత్వము ఎక్కువ ఉంటుంది. 

హృదయములో అమ్మని నింపుకున్న భక్తులకు, హృదయములో కరుణ కూడా నిండిపోతుంది. 

చక్కని, చిక్కని కరుణ కురిపించే ఆ తల్లికి జ్ఞానులు, అజ్ఞానులు, భక్తులు, అన్న భేదము లేదు.  

కరుణాస్వరూపమే ఆ తల్లి.  కరుణార్ద్రహృదయ అయిన  ఆ సాంద్రకరుణ కు వందనం. 

ఓం శ్రీ సాంద్రకరుణాయై నమః 


198. సమానాధికవర్జితా

లలితాపరమేశ్వరికి సమానము ఎవరూ లేరు. అధికమైన వారూ ఎవరూ లేరు. 

అందుకే ఆ తల్లి పేరు సమానాధికవర్జితా. ఆ తల్లియే అందరికన్నా, అన్నిటికన్నా అధికురాలు. 

అంతకు మించిన ఉన్నతమైన స్థితీ ఎవరికీ లేదు, సమానమైన స్థితీ ఎవరికీ లేదు.   

లలితాదేవి తానే సర్వమూ అయి, ఈ చరాచర సృష్టి నంతా తన కనుసన్నలలో నడిపిస్తున్నది. 

వేదసాక్షిగా ఆ తల్లి తాను సర్వాధిక అయినా, అందరినీ సమానముగా చూస్తుంది. 

తన పాలనలో అందరికీ వారి వారి యోగ్యతను బట్టీ ఫలితాన్ని ఇస్తున్న జ్ఞానమూర్తి శ్రీలలిత. 

అసలైన శ్రీ మహారాజ్ఞి ఆ తల్లే. ఆమె ఎల్లప్పుడూ అందరికన్నా గొప్పది. 

తనతో సములూ, తన కన్నా అధికులూ లేనటువంటి, ఆ సమానాధికవర్జిత కు వందనం. 

ఓం శ్రీ సమానాధికవర్జితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి