26, సెప్టెంబర్ 2021, ఆదివారం

65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ

భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ 
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥

275. భానుమండల మధ్యస్థా

సంధ్యాసమయములో శ్రీదేవిని గాయత్రీ రూపములో ధ్యానిస్తున్నాము.
 
గాయత్రిని భానుమండలములో ధ్యానము చేస్తున్నాము. 

సూర్యమండలం మధ్యమున గాయత్రి ఉన్నది. 

సూర్యమండలములో మధ్యభాగాన పరమశివుడు వున్నాడని కూర్మ పురాణమూ, శృతులూ కూడా 

చెప్తున్నాయి. పరమశివునితో పాటే పార్వతి. భానుమండలమంటే అనాహతచక్రము. 

అనాహతచక్ర మధ్యంలో, అంటే హృదయమధ్యంలో వున్నది శ్రీదేవి. 

భర్గోదేవతలకు శ్రీదేవి ఆధారము. ఆ భర్గోదేవతల వలననే ఆదిత్య మండలాలు వచ్చాయి. 

అటువంటి పన్నెండు ఆదిత్య మండలాల నుంచి ఒక సవితృ మండలం ఏర్పడింది.  

ఈ పన్నెండు ఆదిత్యమండలాలకు సవిత కేంద్రం, ఈ ద్వాదశ ఆదిత్యమండలాలకూ ఆధారం. 

ఈ సవితృ మండలాల నుంచి సూర్యమండలం వచ్చింది. 

ఇవి అన్నీ గుంపులు గుంపులుగా పుడుతూ ఉంటాయి. 

వాటి మధ్యలోని వెలుగే శ్రీదేవి. ఈ మండలాలన్నింటి మధ్యలో వున్న కాంతి పుంజమే శ్రీదేవి. 

ఆ శ్రీదేవి వెలుగులోనే భర్గోమండలాలు, ఆదిత్య మండలాలు, సవితృ మండలాలు, 

సూర్యమండలాలు అన్నీ ప్రకాశిస్తున్నాయి. 

ఆవిధంగా భానుమండలము మధ్యలో ప్రకాశిస్తూ తన కాంతితో భర్గో, ఆదిత్య, సవితృ, భాను 

మండలాలనూ ప్రకాశింపచేస్తున్న,  ఆ భానుమండల మధ్యస్థ కు  వందనం. 

ఓం శ్రీ భానుమండలమధ్యస్థాయై నమః  


276. భైరవీ

భైరవుడంటే పరమశివుడు. భైరవ పత్ని కనుక ఈ మాత భైరవి. 

భైరవీ మంత్ర స్వరూపురాలు. పన్నెండేళ్ల కన్యకను భైరవీ అంటారు. 

ఈ శక్తి సాత్వికముగా వున్నప్పుడు త్రిపుర సుందరిగాను, 

రజస్తమో గుణాలు పొందినప్పుడు త్రిపుర భైరవి గాను ఉంటుంది. 

ప్రపంచములోని స్త్రీలందరిలో ఈ భైరవీ శక్తి యొక్క విభూతి తేజోరూపములో ఉంటుంది. 

కనుక ప్రపంచములోని స్త్రీలందరూ భైరవీ స్వరూపులే. 

భీరు శబ్దము నుంచి భైరవ శబ్దం వచ్చింది. భీరుత్వము పోగొట్టేది భైరవి. 

ప్రతి స్త్రీ లోనూ విభూతి వలే ఉంటూ, భీరుత్వము పోగొట్టే,  భైరవి కి వందనం. 

ఓం శ్రీ భైరవ్యై నమః  


277. భగమాలినీ 

ఈ భగమాలినీ దేవత తిథి నిత్యా దేవతలలో ఒక దేవత. 

ఈ దేవత మంత్రంలో భగ శబ్దము చాలాసార్లు వస్తుంది. 

ఆ భగ అనే బీజాక్షరాలతో కూర్చిన మంత్రమాలను ధరించి వున్నది, 

కనుక, ఈ దేవతకు భగమాలినీ అనే నామం వచ్చింది. ఆరు రకముల ఐశ్వర్యములను కల దేవి. 

భ అంటే కాంతి, ప్రకాశము. గ అంటే గతిశక్తి, వ్యాపన శక్తి. భగ అంటే వెలుగును ప్రసారం చేసే శక్తి. 

బిందు రూపంలో వున్న అమ్మ, వెలుగుల్ని ప్రసరించడానికి త్రికోణ ఆకారము లోకి మారుతుంది. 

అదే స్త్రీచిహ్నము, యోనిరూపము. 

పురుష చిహ్న త్రికోణములు శివవిభూతులు, స్త్రీచిహ్న త్రికోణములు దేవీ విభూతులు. 

ఈ రెండూ కలిస్తే శివ శక్తి సమ్మేళనం. శ్రీచక్రములోని త్రికోణములవే. 

అమ్మని త్రికోణ రూపంలో అర్చిస్తే, శుభప్రదం. 

చేసే ప్రతి కార్యములోను, త్రిభుజములను, త్రికోణములను దర్శించి, ధ్యానిస్తే మంగళకరం. 

కాంతి, శక్తి ప్రసరణము చేస్తూ భగమాలను ధరించిన, ఆ భగమాలిని కి వందనం. 

ఓం శ్రీ భగమాలిన్యై నమః  


278. పద్మాసనా

శ్రీమాతను బ్రహ్మరూపా అన్నాం. బ్రహ్మ పద్మాసనంలో ఉంటాడు. 

అమ్మవారు కూడా బ్రహ్మ కనుక, పద్మాసనా అయ్యింది. పద్మము అనేది నవనిధులలో ఒకటి. 

ఆ శ్రీదేవి, పద్మనిధి యందు కూర్చుని, అర్హులైన భక్తులకు ఐశ్వర్యములు ఇస్తుంది. 

పద్మాసురుడనే రాక్షసుడిని ఓడించి పద్మాసన స్థిత అయ్యింది. 

అమ్మ కూర్చున్న పద్మానికి, ప్రకృతే రేకలు, వికారములు కేసరములు, జ్ఞానమే కాడ. 

జ్ఞానమనే కాడపై ఆధారపడిన పద్మమనే ప్రకృతిపై, వికారమైన కేసరములను తొలగించి 

ఆశీనురాలయినది శ్రీదేవి. ఈ దేవి అనుగ్రహం ఉంటే సమస్త సుఖభోగములూ, అన్యోన్య 

దాంపత్యము లభిస్తాయి. ఈ దేవి కోపిస్తే, ఏ ఇంటా సుఖశాంతులుండవు. 

ఈ నామంతో దేవిని జపిస్తే సుఖము, శాంతి కలుగుతాయి. 

పద్మాసనంపై కూర్చుని, భక్తులకు సుఖము, శాంతి, ఐశ్వర్యము, దాంపత్య సుఖము 

ప్రసాదిస్తున్న, ఆ పద్మాసన కు వందనం. 

ఓం శ్రీ పద్మాసనాయై నమః 

  

279. భగవతీ

భగవతి అంటే భగము కలిగినది. 

పైన చెప్పుకున్న అన్ని భగ అర్ధములూ ఈ నామంలో కూడా వర్తిస్తాయి. 

కాళికాపురాణం ప్రకారం ఆరు రకాల ఐశ్వర్యం కలిగినది. 

ఈ దేవతకు ఉత్పత్తి, ప్రళయముల జ్ఞానముంది. భూతముల రాకపోకల జ్ఞానమున్నది. 

జ్ఞానము, అజ్ఞానము అనే  తత్వజ్ఞానమున్నది. 

ఈ శక్తులుండుట చేత ఈ దేవి భగవతీ అని కీర్తించబడుతోంది. 

ఉత్పత్తి, ప్రళయం, భూతముల రాకపోకలు, విద్యా, అవిద్యా విషయములలో సంపూర్ణ జ్ఞానముతో 

ప్రకాశిస్తున్న, ఆ భగవతి కి వందనం. 

ఓం శ్రీ భగవత్యై నమః 


280. పద్మనాభ సహోదరీ

పద్మనాభుడంటే, నారాయణుడు. ఆతని సోదరి నారాయణి. దేవీ భాగవతం ప్రకారము,

సృష్ట్యాదిలో ఈ బ్రహ్మాండంలో మూడు పిండాండములు ఉద్భవించాయి. 

ఒక పిండాండము నుంచి నారాయణ, నారాయణి, రెండవ పిండాండము నుంచి బ్రహ్మ, లక్ష్మి, 

మూడవ పిండాండము నుంచి శివ, సరస్వతులు ఉదయించారు. 

ఆ విధముగా నారాయణుడు, నారాయణి సహోదరులు. 

భగవతీ, పద్మనాభసహోదరీ అనే ఈ నామాల్లో నుంచి బీజాక్షర కూర్పు చేస్తే, 

వాగ్భవకూట రూపమైన "క ఏ ఈ ల హ్రీమ్" అవుతుంది. 

ఈ నామాలు అమ్మవారి వాగ్భవకూటాన్ని సూచిస్తాయి. 

విష్ణు సహోదరి అయిన, ఆ పద్మనాభ సహోదరి కి వందనం. 

ఓం శ్రీ పద్మనాభసహోదర్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి