నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49 ॥
176. నిర్వికల్పా
వికల్పము అంటే భ్రాంతి. ఏమీ లేని శూన్యాన్ని వున్నట్టుగా భావించుట.
శూన్యమయిన పదార్ధాన్ని ఎవరు ఎలా అర్ధం చేసుకుంటే అలా అనిపిస్తుంది.
గుప్పిడి మూసి లోపల ఏమి వుంది అని అడిగితే, కొందరు శూన్యము అంటే,
కొందరు గాలి అనచ్చు. రెండు విషయాలూ సత్యమే అనిపిస్తాయి.
రెండూ కూడా సత్యము ఎలా అవుతాయి అనే సందేహం కూడా వస్తుంది.
అదే విధంగా జీవుడు తన అంతః శత్రువుల ప్రభావానికి లొంగిపోయినపుడు,
రంగుటద్దాలలో చూసి, లేనిది వున్నట్టూ, వున్నది లేనట్టూ భ్రమ పడుతూ ఉంటాడు.
దీనినే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. తాడుని చూసి పాము అనుకోవటం.
మమకార, మోహముల వల్ల వున్న విషయమును సరిగా చూడలేక పోతాడు.
ఈ వికల్పములన్నీ జీవుడికే కానీ అమ్మకు లేవు. ఆ పరమేశ్వరికి ఏ వికల్పములూ లేవు.
ఈ సృష్టిలో ప్రతిదీ ఆ అమ్మ ఆజ్ఞ మేరకే నడుస్తుంది. ఆ తల్లి సర్వ సాక్షి అని తెలుసు గదా.
గుప్పిడి లోని విషయము, గుప్పిడి బయట విషయము రెండూ ఆ అమ్మ సృష్టే.
వున్నది, లేదు అనే రెండు విరుద్ధ భావాలూ ఒక్కటే అయినప్పుడు, రెండు విషయాలూ లేవు,
రెండు పక్షాలూ లేవు. ఆ తల్లికి సంకల్పమూ లేదు, వికల్పమూ లేదు.
ఓం శ్రీ నిర్వికల్పాయై నమః
బాధ లేనిది అని ఈ నామానికి భావం. ఆ తల్లి నిష్కామా, నిష్క్రోధా, నిర్లోభా, నిర్మోహా, నిర్మదా
ఇక బాధకు తావేదీ. ఆ శ్రీమాత ఎప్పుడూ నిరాబాధా. బాధ పొందనిది, బాధ లేనిది.
ముత్యపుచిప్ప ధగధగలు చూసి దానిని వెండి అని భ్రమ పడినంత మాత్రాన అది వెండి
అయిపోదు కదా. ముత్యపు చిప్ప ముత్యపు చిప్పే, వెండి వెండే.
ఒకసారి అది వెండి కాదు, అని తెలియగానే అది తిరిగి ముత్యపు చిప్ప అయిపోతుంది.
ఈ భ్రాంతుల వలన ముత్యపు చిప్పకి ఏ బాధలేదు. దానికి ఏ మార్పూ రాదు.
త్రిమూర్తులకు కూడా భ్రాంతి ఉంటుంది. ఆ భ్రాంతి వలన కలిగే బాధా ఉంటుంది.
శ్రీలలిత శుద్ధజ్ఞానమూర్తి, సచ్చిదానందమూర్తి కనుక, ఆ మాతకు ఏ భ్రాంతులూ, ఏ బాధలూ లేవు.
ఓం శ్రీ నిరాబాధాయై నమః
178. నిర్భేదా
శ్రీలలితని ఈ నామంలో నిర్భేదా అని పిలుస్తున్నాం.
నిర్భేదా అంటే, భేదము లేనిది, భేదము చూపనిది అని భావం.
జ్ఞానులనైనా, అజ్ఞానులనైనా ఆ తల్లి ఒకే విధంగా, ఏ భేదమూ లేకుండా చూస్తుంది.
తిర్యక్కులనైనా(జంతువులు), మానవులనైనా కూడా ఒక్కలాగే చూస్తుంది.
తల్లి కదా భేదం చూపించదు. ఆ మహత్వశక్తిని అర్ధం చేసుకునే తీరులో,
మనలో మనకు భేదం ఉందేమో కానీ, ఆ శ్రీమాతకి ఎటువంటి భేదమూ లేదు.
తన సంతానమంతా ఆమెకు సమానమే. అంతేకాదు. ఏరూపంలో వున్నా ఆ అమ్మకు అన్నీ ఒకటే.
మంచు, నీరు, ఆవిరి ఈ మూడింటిలో వున్న పదార్ధమొక్కటే అయినా, సామాన్యులకు వేరువేరుగా
కనిపిస్తుంది. జ్ఞానులకు ఆ భేదము ఉండదు. శుద్ధజ్ఞాని కనుక అమ్మకు ఆ భేదము లేనేలేదు.
జ్ఞానినీ, అజ్ఞానినీ, చెట్టునూ, పుట్టనూ భేదభావము లేకుండా చూస్తున్న, ఆ నిర్భేద కు వందనం.
ఓం శ్రీ నిర్భేదాయై నమః
179. భేదనాశినీ
లలితాపరమేశ్వరి భేదనాశినీ కూడా కనుక, తన భక్తుల మనసులలో వున్న
భేదభావాన్ని తొలగించి, అద్వైత జ్ఞానాన్ని అందిస్తున్నది.
బంగారం ఒక్కటే అయినా, ఆభరణములు వేరు వేరుగా కనపడుతున్నట్టు,
బ్రహ్మం ఒక్కటే అయినా, పైకి వేరువేరుగా కనపడుతున్నది.
లోపల వున్న జీవాత్మ అందరిలోనూ ఒక్కటే అని ఆ తల్లి బోధిస్తున్నది.
జీవాత్మ, పరమాత్మా రెండూ ఒక్కటే, అందరిలోనూ వెలుగుతున్న జ్యోతీ ఒక్కటే.
ప్రతి చోటా ఆ అభేదాన్ని చూడగలవాడే జ్ఞాని. ఈశ్వర, ఈశ్వరీ తత్వములోని అద్వైతతత్వాన్ని,
తన ఉపాసకులందరికీ ప్రేమతో అందిస్తున్న తల్లి లలితాపరమేశ్వరి.
ద్వైత భావనను, భేదభావమును నాశము చేస్తున్న, ఆ భేదనాశిని కి వందనం.
ఓం శ్రీ భేదనాశిన్యై నమః
180. నిర్నాశా
నాశమే లేనిది నిర్నాశా. ఈ నామానికి అమ్మ కన్నా సార్ధక నామధేయులెవరు.
సర్వకాల, సర్వావస్థల యందు ఒకేలా వెలుగొందుతున్న తల్లి, ఆమెకు నాశనమేదీ.
ప్రళయకాలంలో కూడా ఆ తల్లి నిత్యముక్త కనుక, ఎప్పుడూ అస్తిత్వాన్ని కోల్పోదు.
అందరూ, అన్నీ, నశిస్తాయి. గుణముతో వున్న వారందరూ, త్రిమూర్తులతో సహా
ప్రళయకాలంలో అమ్మలో లయిస్తారు. అమ్మనుంచి వచ్చినవన్నీ తిరిగి అమ్మలో చేరిపోతాయి.
కనుక అమ్మ సృష్టి నుంచి వచ్చిన అన్నీ, అందరూ కూడా అమ్మలోనే ఎల్లప్పుడూ వుంటారు.
ఆ రాజరాజేశ్వరి, నిత్య, నిత్యముక్త, ఆమెకు నాశము లేదు.
ఆదిమధ్యాంతరహిత. ఆ తల్లికి అంతము అనేది లేనే లేదు.
ఆ శ్రీలలిత గురించి సత్యంజ్ఞానమనంతంబ్రహ్మ అని శ్రుతులు చెప్తున్నాయి.
ఆ శ్రీలలిత సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మము. కనుక ఆ శ్రీమాతకు నాశములేదు.
నిత్య సత్య స్వరూపిణి, ఆ నిర్నాశ కు వందనం.
ఓం శ్రీ నిర్నాశాయై నమః
181. మృత్యుమథనీ
మరణము దేహానికి కానీ, దేహికి కాదు. దేహి ఎప్పుడూ నిత్యుడు, అమరుడు.
మరణమనగా జీర్ణమై చిరిగిపోయిన పోయిన దుస్తులు మార్చుకొనుట మాత్రమే అని భగవద్గీతలో
స్పష్టంగా చెప్పబడింది. మరణమనగా మార్పు మాత్రమే.
జీవుడికి జర, రుజ లతో నలిగిన దేహం పోయి, సరికొత్త దేహం వస్తుంది.
కానీ లోపల వున్న ఆత్మది ఎప్పటికీ అమృతతత్వమే. దానికి మృతి లేదు.
అజ్ఞాని ఈ భావమును గ్రహించలేక, దేహము కోసమే బాధపడుతూ ఉంటాడు.
మృత్యుభయంతో బాధపడేవారు ఈ నామం చెప్పుకోండి, ఆ భయాన్ని అమ్మ తీసేస్తుంది.
ఈ నామము జపిస్తే అమ్మ జీవుడికి మృత్యుభయం పోగొడుతోంది.
మర్త్యునికి మృత్యుబాధను, భయాన్ని నశింపచేసే, ఆ మృత్యుమథని కి వందనం.
ఓం శ్రీ మృత్యుమథన్యై నమః
182. నిష్క్రియా
అన్ని కార్యములూ నిర్వహిస్తూనే, ఎటువంటి కర్తృత్వమూ వహించని, ఆ నిష్క్రియ కు వందనం.
ఓం శ్రీ నిష్క్రియాయై నమః
ఒక చిన్న సంఘటన: వివేకానందుడు కాశ్మీర యాత్రలో క్షీరభవానీ ఆలయాన్ని సందర్శించాడు.
అప్పటికే, ఆ ఆలయం దుండగుల చేతిలో ధ్వంసం అయిపోయి వుంది. అమ్మని ఆస్థితిలో చూసి
వివేకానందుడు ఏడ్చాడు. అమ్మను దర్శించగలవాడు కనుక, అమ్మను అడిగాడు, "అమ్మా,
నీ ఆలయాన్ని నాశనము చేసేవాడిని ఎందుకు ఆపలేదూ, నీ గుడిని ఎందుకు రక్షించుకోలేదూ",
అని. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, "నాయనా, గుడి కట్టమని నేనడిగానా, మీ ఆరాధనకు వీలు
అని మీరు కట్టుకున్నారు, మరొకడు వాడి ఆరాధనకు అడ్డమని కూల్చుకున్నాడు. నేను దేనికీ,
ఎటువంటి కర్తృత్వమూ వహించను. కానీ జీవులు చేసే పాప, పుణ్యాలకు సరిపడా వారి వారి
పద్దులో మాత్రం ఖచ్చితంగా లెక్క కట్టి మరీ వేస్తాను. ఆ పుణ్యఫలితమూ, ఈ పాపఫలితమూ
రెండింటినీ తప్పనిసరిగా జీవుడు అనుభవించవలసినదే." తనకు కలిగిన ఈ అనుభవాన్ని
వివేకానందుడు స్వయంగా చెప్పాడు. నిజమే కదా, మన సగుణోపాసన కోసం, విగ్రహారాధన కోసం,
మంత్రపూతంగా శక్తిని ఒక ప్రదేశంలో నిక్షిప్తం చేసి, దాన్ని గుడి అంటున్నాం. అదే గుడి మన
హృదయంలో కడితే, అమ్మ మన గుండెలో నిండిపోదూ, ఉండిపోదూ. ఆ గుడిని ఎవరూ ధ్వంసం
చేయలేరు. మన పంచాయతనం మనతోనే అని చెప్పుకున్నాం కదా.
మన ఆలయం మన లోనే, మన దేవత మన తోనే.
183. నిష్పరిగ్రహా
ఎప్పుడూ ప్రదానమే కానీ, పరిగ్రహము చేయని, ఆ నిష్పరిగ్రహ కు వందనం.
ఓం శ్రీ నిష్పరిగ్రహాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
The explanation for "Niskriyaayai Namaha'" liked very much.
రిప్లయితొలగించండి