7, అక్టోబర్ 2021, గురువారం

76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ 
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥

341. క్షేత్రస్వరూపా

క్షేత్రము అంటే శరీరము, స్థలము, భూమి, స్త్రీ, అనే అర్ధాలున్నాయి. 

క్షేత్రస్వరూపా అంటే క్షేత్రమను శరీరమునే స్వరూపముగా కలది అని భావం. 

ఈ పదునాలుగు భువనాలన్నీ కూడా ఆ క్షేత్రములో భాగమే. 

బ్రహ్మ నుంచి పిపీలికాది పర్యంతం అంతా ఆ జగన్మాత శరీరం నుంచి వచ్చినవారే. 

శ్రీమాత జీవులను సృష్టించునపుడే ఆ జీవులుండవలసిన స్థలమునూ ఏర్పరుస్తుంది. 

ఆ జీవులుండవలసిన శరీరమునూ సిద్ధం చేస్తుంది. 

అమ్మ మాయలో ఇది అంతా ఒక భాగం. స్త్రీని క్షేత్రమనీ, పురుషుడిని బీజమనీ చెప్తారు. 

శుక్లమునే బీజముగా స్వీకరించి, పెంచి, పోషించి, వంశాభివృద్ధిని చేసే స్త్రీ శరీరమే క్షేత్రము. 

అది పవిత్రమైనది అని భావము. 

లింగ పురాణంలో అమ్మవారిని క్షేత్రమనీ, శివుడిని క్షేత్రజ్ఞుడనీ చెప్పారు. 

క్షేత్రములలో ఉత్తమక్షేత్రం కురుక్షేత్రం. అందుకే దానిని ధర్మక్షేత్రం అంటారు. 

ఆ ధర్మ భూమిలో శ్రీకృష్ణుడే స్వయంగా రథసారథి అయి, ధర్మాన్ని గెలిపించాడు. 

ముప్ఫయి ఆరు తత్వాలతో ఏర్పడిన స్థూల దేహమే క్షేత్రము. 

క్షేత్రమనే శరీరమే స్వరూపముగా కల , ఆ క్షేత్రస్వరూప కు వందనం. 

ఓం శ్రీ క్షేత్రస్వరూపాయై నమః  


342. క్షేత్రేశీ

క్షేత్రములన్నింటికీ అధీశ్వరి కనుక అమ్మవారిని క్షేత్రేశీ అంటున్నాం. 

క్షేత్రజ్ఞుడైన శివుని పత్ని కనుక, ఈ శ్రీదేవి క్షేత్రేశీ అనే పేరు ధరించింది. 

జీవులందరిలో శరీరము రూపములో వున్నది క్షేత్రేశీ. ఆ జగత్తులోని ఈశ్వరీ శక్తియే క్షేత్రేశీ.  

శరీరము తనదే అనుకుంటూ ఉంటాడు జీవుడు. కానీ, ఆ ప్రాణజ్యోతి వెలిగే శరీరమును, 

ఆ శరీరము నివసించే ఈ లోకమును ఏర్పరచినది ఆ శ్రీమాతే అని గ్రహించినవాడు విజ్ఞుడు. 

ఈ క్షేత్రములన్నింటినీ సృజించి రక్షించునది క్షేత్రేశీ. 

క్షేత్రజ్ఞుడైన శంకరుని పత్ని, ఆ క్షేత్రేశి కి వందనం.  

ఓం శ్రీ క్షేత్రేశ్యై నమః  


343.  క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ 

క్షేత్రములైన శరీరము, లోకములతో పాటు క్షేత్రజ్ఞుడైన శివుని కూడా పాలించునది కనుక, 

అమ్మవారికి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని అనే నామం వచ్చింది. 

క్షేత్రము శరీరము, అందుండే జీవుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞానము ఎరిగినవాడు అని భావం. 

దేహి, దేహముల భేదము నెరిగిన వాడు జ్ఞాని. క్షేత్రము నశిస్తుంది, కానీ క్షేత్రజ్ఞుడు నశించడు.  

క్షేత్రమైన శరీరముతో కావలసిన కార్యములు చేయించేవాడే క్షేత్రజ్ఞుడు. 

క్షేత్రమునూ, క్షేత్రజ్ఞుడినీ కూడా ఏకకాలంలో నిర్వహించేది క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. 

ధర్మక్షేత్రమే శ్రీమాత. క్షేత్రజ్ఞుడు శ్రీకృష్ణుడు.  ధర్మ క్షేత్రమునూ, ఆ క్షేత్రములో జరిగే 

కార్యక్రమమునూ పర్యవేక్షించునది ఈ దేవత. 

క్షేత్రములైన శరీరములనూ, క్షేత్రజ్ఞుడైన జీవుడినీ కూడా ఏకకాలంలో పరిపాలిస్తున్న, 

ఆ  క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని కి వందనం. 

ఓం శ్రీ క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః  


344. క్షయవృద్ధి వినిర్ముక్తా  

క్షయము, వృద్ధి అనే వికారములు లేనిది ఈ క్షయవృద్ధివినిర్ముక్త. 

శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహింపలేదు, జలములు కరిగించలేవు, వాయువు శోషించలేదు 

అని శాశ్వతుడైన ఆత్మ గురించి భగవద్గీతలో చెప్పాడు భగవానుడు.  

ఆత్మకు క్షయము, వృద్ధీ రెండూ లేవు. కర్మలు అంటని శ్రీదేవికి కూడా, ఈ క్షయవృద్ధులు లేవు. 

సత్కర్మ వలన వృద్ధీ, దుష్కర్మ వలన క్షయమూ లేని తత్వమే క్షయవృద్ధివినిర్ముక్తా తత్వం. 

వృద్ధి క్షయములు రెండింటినీ త్యజించిన, ఆ క్షయవృద్ధివినిర్ముక్త కు వందనం. 

ఓం శ్రీ క్షయవృద్ధివినిర్ముక్తాయై నమః 

  

345. క్షేత్రపాల సమర్చితా

దారుకావనంలో దారుకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. జపతపాలు, హోమాలు, 

ధ్యానాలు చేసుకునే ఋషులను, మునులను వేధిస్తూ ఉండేవాడు. 

దారుకుడి బాధల నుంచి కాపాడమని ఋషులు, మునులు పరమశివుడిని వేడుకున్నారు. 

అప్పుడు దారుకుడిని సంహరించడానికి శివుడు మూడో కన్నుతో కాళికను సృష్టించాడు. 

కాళిక మహోగ్రంగా వెళ్లి ఆ రాక్షసుడిని చంపేసింది. అయినా కాళికకు ఉగ్రం తగ్గలేదు. 

శాంతం రాలేదు. ఆ ఉగ్ర కాళిక చేసే కరాళ నృత్యంతో లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి.  

మళ్ళీ మునులంతా ఆ కాళికాదేవి ఉగ్రం శాంతించేలా చూడమని శివుడిని కోరారు. 

శివుడు ఒక చిన్నబాలుడి వలె మారి, కాళిక వెళ్ళేదారిలో నిలబడి, 'ఆకలి, ఆకలి' అని ఏడుస్తూ

ఎదురుపడ్డాడు. రోదిస్తున్న బాలుడిని చూసి కాళిక రూపంలో వున్న ఆ శ్రీమాత జాలిపడి, 

మాతృసహజంగా, ఆ బాలుడిని ఎత్తుకుని స్తన్యం ఇచ్చింది. 

శివుడు బాలుడి రూపంలో పాలతో పాటు, కాళిక క్రోధాగ్నిని కూడా తాగేశాడు. 

దానితో కాళిక ఒక్కసారిగా నీరసించి పడిపోయింది. అది చూసి శివుడు భైరవతాండవం చేసాడు. 

తనను తాను యాభై రెండు మంది భైరవులుగా విభజించుకున్నాడు. 

కాళిక కూడా లేచి, తనను తాను యోగినులుగా విభజించుకుని, 

ఆ భైరవులతో కలిసి నృత్యం చేసింది. ఆ కాళీస్తన్యం తాగిన భైరవుడిని క్షేత్రపాలుడు అంటారు. 

పాలు తాగిన క్షేత్రపాలుడు అమ్మకు స్తుతి చేసి పూజించాడు. 

క్షేత్రపాలునిచే పూజ నందుకున్న శ్రీమాత క్షేత్రపాలసమర్చిత అయింది. 

ఈ భైరవులందరూ తదనంతర కాలంలో శక్తి పీఠాలు ఎక్కడ వున్నా, ఆ క్షేత్రాల్లో 

క్షేత్రపాలకులుగా వుండి, శ్రీమాతకు సేవలు అందిస్తున్నారు. 

శక్తి క్షేత్ర దర్శనంలో భాగంగా తప్పనిసరిగా అక్కడి క్షేత్రపాలకుడైన భైరవుని దర్శనం కూడా 

చేయాలని, అప్పుడే యాత్ర పరిపూర్ణం అవుతుందని చెప్తారు. 

అట్టి క్షేత్రపాలకులచే అర్చింపబడుతున్న, ఆ క్షేత్రపాలసమర్చిత కు వందనం. 

ఓం శ్రీ క్షేత్రపాలసమర్చితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి