చితిః, తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥
362. చితిః
జీవికను కోరుకునే వారికి జీవమైనది చితి అని యోగవాశిష్టములో చెప్పబడింది.
ఓం శ్రీ చిత్యై నమః
363. తత్పదలక్ష్యార్థా
తత్వమసి, తత్ త్వం అసి అనే వాక్యంలో తత్ అంటే బ్రహ్మము, పరబ్రహ్మము, శుద్ధబ్రహ్మము.
తత్ పదము అంటే ఆ బ్రహ్మమును పొందు మార్గము, అదే పరమపదము.
తన భక్తులు, ఉపాసకులు, ఆ బ్రహ్మను చేరు మార్గమే లక్ష్యార్థముగా కలది అని ఈ నామార్ధము.
పరబ్రహ్మమును అందుకొనుట అంత సులభము కాదు, అయినప్పటికీ ఆ రాజరాజేశ్వరి,
తన భక్తులకు ఆ లక్ష్యమును అందించవలెనని భక్తులను తన పథములో నడిపిస్తున్నది.
తత్ త్వం అసి, అంటే నేనే నీవై వున్నాను అని అర్ధం.
ఆ విధంగా జీవుడు ఈశ్వరుడు ఒకటే అను అద్వైత సిద్ధాంతము చెప్పబడింది.
తన ఉపాసకులను ధర్మపథములో నడిపి, తత్ పదమును చేర్చటానికి ఆ జగన్మాత
ఎన్నో ఉపాయాలను చేస్తూ ఉంటుంది. సామ దాన భేద దండోపాయాల ద్వారా,
భక్తులను ఆ పరబ్రహ్మ పదం చేర్చటమే లక్ష్యంగా కల కరుణామూర్తి ఆ శ్రీ లలిత.
భక్తులకు పరమపదము చేరే పథమును చూపిస్తున్న, ఆ తత్పదలక్ష్యార్థ కు వందనం.
ఓం శ్రీ తత్పదలక్ష్యార్థాయై నమః
364. చిదేక రసరూపిణీ
చిత్ అనే చైతన్య రస స్వరూపిణి ఈ చిదేకరసరూపిణి.
చిదానందమనే ఆనంద రస స్వరూపమే ఈ తల్లి అని భావం.
రసమును అనుభవించి మాత్రమే తెలుసుకోగలము, ఈ చిత్ అనే చైతన్య రస స్వరూపాన్ని
కూడా కేవలము అనుభవించి మాత్రమే ఆనందించగలం.
'అమ్మ' అనే పదం ఇచ్చే అనుభూతిని, ఆ పదం తలచినపుడు, పలికినపుడు అనుభవిస్తుంటాం.
అప్పుడు కలిగే ఆనందానుభూతే, రసము. దానిని ఆస్వాదించటమే రసాస్వాదన.
గోపికలు శ్రీకృష్ణుడిని తలచినంత మాత్రానే రసానుభూతికి లోనవుతూ వుంటారు.
శ్రీకృష్ణుని స్మరణం, దర్శనం, అతడితో రాసకేళిలో అద్వితీయ ఆనందానుభూతిని
పొందుతూ వుంటారు గోపికలు. వారికి ఆ రసానుభూతిని కలిగించేది కాత్యాయని.
అందుకే ఆ రసానుభూతిని తమకు ప్రసాదించమని గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తారు.
చిత్ అనే రసానుభూతి స్వరూపమే తానైన, ఆ చిదేక రసరూపిణి కి వందనం.
ఓం శ్రీ చిదేకరసరూపిణ్యై నమః
ఓం శ్రీ స్వాత్మానంద లవీ భూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి