13, అక్టోబర్ 2021, బుధవారం

82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా

 

కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥

373. కామేశ్వర ప్రాణనాడీ 

అమ్మవారిని ఈ నామంలో కామేశ్వరునికి ప్రాణనాడి అని అంటున్నాం. 

ప్రజ్ఞ పురుషుడైతే, ప్రాణము ప్రకృతి. ప్రాణము లేనిదే ప్రజ్ఞ పనికి రాదు.  

ప్రజ్ఞ వ్యక్తము కాకపోయినా దేహముంటుంది కానీ, ప్రాణము లేని దేహముండదు. 

కామేశ్వరునికి ప్రాణము ఆ కామేశ్వరియే. ఆ సత్యము నెరిగినవాడు కనుక, 

ఆ సర్వమంగళ అనుజ్ఞ తీసుకునే పరమేశ్వరుడు హాలాహలం మ్రింగాడు. 

తన లోపల భువనాలన్నీ వున్నాయి కనుక, ఆ భువనాలకు ఈ గరళం వలన నష్టం 

కలగకూడదని, మ్రింగిన గరళాన్ని కంఠం వద్దే ఆపి గరళకంఠుడయాడు ఆ పరమశివుడు. 

అందరికీ హితము కనుక పతిని ఆ గరళాన్ని మ్రింగమన్నది సర్వమంగళ. 

ఆ అమ్మకు తెలుసు, కామేశ్వరుని ప్రాణనాడి తానే అని, శివుడిని ఆ గరళం ఏమీ చేయలేదనీ. 

అమ్మవారికి ఆ ధీమా కామేశుడు కామేశ్వరి మెడలో కట్టిన శుభస్కరమైన మంగళసూత్రం 

వలన వచ్చింది, అని రుక్మిణి భావించింది. అది అమ్మ ధరించిన పంచ మాంగల్యాలలో 

ఒకటైన, తాటంకాల మహిమ అని శంకరభగవత్పాదుడు అన్నాడు. 

పత్ని ధరించే మాంగల్యాలే పతికి ప్రాణనాడులు, జీవనహేతువులు. 

కామేశ్వరుని ప్రాణమే తానైన, ఆ కామేశ్వర ప్రాణనాడి కి వందనం. 

ఓం శ్రీ కామేశ్వరప్రాణనాడ్యై నమః  


374. కృతజ్ఞా  

సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచభూతములు ఈ తొమ్మిదిమందీ ఈ లోకాలలో  

అమ్మవారి గూఢచారులు. ఈ తొమ్మిదిమంది కన్నూ దాటి సృష్టిలో ఏమీ జరుగదు. 

కనుక అమ్మకు తెలియని విషయమేదీ ఈ లోకములో లేదు. 

ఈ తొమ్మిదిమంది రూపములో సాక్షీభూతముగా అన్నీ గమనిస్తున్న అమ్మ, 

ఎవరు చేసిన పాప పుణ్యములకు తగ్గట్టుగా వారికి ఫలితాన్నిస్తూ ఉంటుంది. 

ఆ తల్లి ఎవరు ఏ కర్మ చేసినా మరచిపోకుండా కృతజ్ఞయై ఆ కర్మఫలితాన్నిస్తుంది. 

అందుకే ఆ తల్లిని కృతజ్ఞతా భావంతో కృతజ్ఞా అంటున్నాం. 

కృత అంటే చేసిన కర్మ పట్ల, జ్ఞా అంటే జ్ఞానము కలిగినది కృతజ్ఞా, ఏ కర్మా అమ్మ దృష్టిని 

దాటిపోదు. చేసిన మేలుకు ప్రత్యుపకారము చేయునది కనుక కృతజ్ఞా. 

కృతయుగములో వలె పరిపూర్ణ జ్ఞానము కలది కనుక కృతజ్ఞా.

కృతయుగములో ధర్మమూ, జ్ఞానము పరిపూర్ణము, నాలుగు పాదాలా వర్ధిల్లినాయి. 

త్రేతాయుగములో త్రిపాదములూ, ద్వాపరయుగములో ద్విపాదములూ మాత్రమే ఉన్నాయి. 

కలియుగములో ఏకపాదమే మిగిలింది. అయినప్పటికీ ఆ పరమేశ్వరి మాత్రం కృతయుగంలో

వలెనే సంపూర్ణ జ్ఞానముతో వున్నది. ఆ కృత జ్ఞానముతోనే శంకరునితో పాచికలాడి 

అమ్మ ఎప్పుడూ జయం పొందుతూ ఉంటుంది. 

పరిపూర్ణ జ్ఞాన స్వరూప అయిన, ఆ కృతజ్ఞ కు వందనం.  

ఓం శ్రీ కృతజ్ఞాయై నమః  


375. కామపూజితా 

కాముడు అంటే మన్మధుడు. శ్రీవిద్యను అభ్యసించిన పన్నెండు మంది ప్రధములలో ఒకడు.  

మన్మధుని చేత ఉపాసించబడిన దేవత కనుక, ఆ జగదీశ్వరిని కామపూజితా అన్నారు. 

సృష్టి చేయాలనే కామనతో ఉండేవాడు కనుక మన్మధుణ్ణి కాముడు అన్నారు. 

పరమశివుని అగ్నినేత్రంతో దహింపబడిన తరువాత దేహమును కోల్పోయి అనంగుడైనాడు. 

సంజీవనీ ఔషధి వలె కామేశ్వరి తిరిగి మన్మధునికి ప్రాణం పోసింది. 

మన్మధుడు పరమేశ్వరి ఉపాసకుడై, సృష్టి కార్యం ప్రారంభించే ముందు, 

తొలుతగా ఆ శ్రీమాతను పూజించి, ఆ తల్లి అనుజ్ఞ తీసుకుని సృష్టి కార్యం మొదలుపెడతాడు.   

మూలాధారం వద్ద కామగిరి పీఠంపై వుండి, కాముడిచే పూజింపబడే జగజ్జనని కామపూజితా.  

మన్మధునిచే ఉపాసించబడిన, ఆ కామపూజిత కు వందనం. 

ఓం శ్రీ కామపూజితాయై నమః  


376. శృంగార రససంపూర్ణా

శృంగములు రెండు. అరలు అంటే దళములు ఆరు. 

మొత్తం రెండు ఆర్ల పన్నెండు దళముల పద్మంలో ఉండేది ఆ శ్రీమాత. 

పన్నెండు దళముల పద్మమే అనాహతం, హృదయపద్మం. అనాహతంలో ఉండేది పూర్ణగిరిపీఠం. 

అక్కడ ఎప్పుడూ వుండే దేవత సంపూర్ణా. అనాహతంలో ఉండేది ఈ శృంగారరససంపూర్ణా. 

రసములు తొమ్మిది. శ్రీ చక్రం లోని తొమ్మిది ఆవరణలూ తొమ్మిది రసాలకు సంకేతం. 

మొదటిఆవరణ, త్రైలోక్యమోహనచక్రం శృంగారరసానికి స్థానం. 

అమ్మ చక్కగా శృంగారం (సింగారం) చేసుకుని, త్రైలోక్యమోహనంగా ఉంటుంది. 

ఆ చక్రంలో ఎప్పుడూ వుండే తల్లి కనుక, ఆమె సంపూర్ణా. 

అనాహతపద్మంలో, పన్నెండు దళములతో, పూర్ణగిరిపీఠంలో,  త్రైలోక్యమోహనచక్రంలో 

సంపూర్ణంగా వుండే , శృంగారరసంతో శోభిస్తూ వున్న శక్తే, శృంగారరససంపూర్ణా. 

శృంగారమనే రసముతో సంపూర్ణమైన, ఆ శృంగార రససంపూర్ణ కు వందనం. 

ఓం శ్రీ శ్రృంగారరససంపూర్ణాయై నమః 

  

377. జయా  

జయ స్వరూపము కనుక జయా అనే నామంతో వున్నది అని భావం. 

పద్మ పురాణంలో వరాహగిరి పైన వున్న దేవత పేరు జయా అని చెప్పారు. 

సర్వకాలముల లోనూ జయమునే పొందునది కనుక అమ్మను జయా అన్నాం.  

తన భక్తులు చేపట్టిన కార్యములలో జయమును కలిగించి, ఆనందము నిచ్చునది జయా. 

విఘ్నములను తొలగించి, సర్వత్రా జయమును పొంది, ఆనందమును పొందునది జయా. 

ఉపాసకులకు జయములు కలుగచేసి ఆత్మజ్ఞానమును ఇచ్చునది జయా. 

జయములు కలుగచేయు, ఆ జయ కు వందనం. 

ఓం శ్రీ జయాయై నమః 


378. జాలంధరస్థితా

జాలంధర పీఠమందున్న తల్లి అని ఈ నామానికి అర్ధం. 

జాలంధర పీఠములో విష్ణుముఖి అనే పేరుతో కొలువై వున్న దేవత.   

పద్మ పురాణంలో  విష్ణువు లక్ష్మీ సమేతముగా జాలంధరపీఠములో ఉంటానని జాలంధరునికి 

వరము ఇచ్చి విష్ణుముఖి పేరుతో అక్కడ కొలువై వున్నాడని చెప్పారు.  

జాలంధర మంటే ఇంద్రజాల, మహేంద్రజాలము నకు మించిన మంత్రజాలం. 

ఆ జాలము నెరిగినది కనుక, పరమేశ్వరి జాలంధర పీఠమును అధిరోహించినది.  

సృష్టిలో విష్ణుమాయ మాయలలో గొప్పది. 

ఆ మాయను కూడా తన జాలముతో బంధించినవాడు జాలంధరుడు. 

పరమశివుని సహాయముతో, ఆ జాలము నుండి బయటపడిన వాడు శ్రీమహావిష్ణువు. 

జాలంధరుని జాలము తెలిసినది ఆ పరమేశ్వరీ పరమేశ్వరులకు మాత్రమే. 

జాలంధర పీఠమంటే విశుద్ధి చక్రము. అక్కడ కొలువై వుండే అమ్మ జాలంధరస్థితా. 

అన్ని జాలములకూ మించిన మంత్రజాలం కల, ఆ జాలంధరస్థిత కు వందనం. 

ఓం శ్రీ జాలంధరస్థితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి