14, అక్టోబర్ 2021, గురువారం

83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా

 

ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ 
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥

379. ఓడ్యాణపీఠనిలయా 

ఓడ్యాణపీఠములో నివసించునది ఓడ్యాణపీఠనిలయా. 

ఓడ్యాణ పీఠమంటే ఆజ్ఞా పద్మం. మూలాధారం వద్ద వున్న కామగిరిపీఠము, 

అనాహతం వద్ద వున్న పూర్ణగిరిపీఠము, విశుద్ధి వద్ద వున్న జాలంధరపీఠము, 

తరువాత స్థితి ఆజ్ఞ వద్ద వున్న ఓడ్యాణపీఠము. ఇవి అన్నీ శక్తి కేంద్రాలు, పీఠాలు. 

ఓడ్యాణ పీఠములో ఆజ్ఞాచక్రము వద్ద ఒక బ్రహ్మరంధ్రమున్నది. 

అక్కడ నివసించే శక్తి ఈ ఓడ్యాణపీఠ నిలయా. ఇది శక్తిపీఠములలో ఒకటి. 

మనం నేడు ఒడిషా అని పిలిచే ప్రాంతాన్ని, ఒకప్పుడు ఉత్కళమనీ, కళింగమనీ, ఓడ్రదేశమనీ 

పిలిచేవారు. అక్కడ వున్న శక్తిపీఠమే జాజ్పూర్ లోని  బిరజా లేక గిరిజా దేవి. 

ఆ దేవతనే ఓడ్యాణపీఠ నిలయగా కొలుస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. 

ఓడ్యాణము అంటే, వడ్డాణము వలె కట్టుకున్న బాలింతరాలి నడుముకట్టు.  

ఈ బిరజాదేవి ఆలయంలో అమ్మవారు బాలింత వలె  నడుంకట్టు కట్టుకుని వుంటారు. 

ఆ శ్రీమాత నిత్య బాలింత కదా. ఈ క్షేత్రంలో అమ్మవారి నాభి పడిందని చెప్తారు. 

మూడు గయలలో ఇది మధ్యగయ, నాభిగయ. ఈ ఆలయంలో ఒక మహా రంధ్రంతో

ఒక నాభి ప్రదేశం ఉంటుంది. అక్కడ పిండ ప్రదానాలు చేస్తూ వుంటారు. అందుకే దీన్ని 

నాభిగయ అంటారు. ఈ క్షేత్రంలోనే బ్రహ్మ ఒక నిలువెత్తు ఏకశిలా స్తంభముగా దర్శనమిస్తాడు. 

ఓడ్యాణ పీఠమైన ఈ క్షేత్రంలో కొలువైన బిరజాదేవి ఓడ్యాణపీఠ నిలయా.  

ఆజ్ఞా పద్మంలో ఆనందంగా కొలువై,  ఉపాసకులకు ఊర్ధ్వగమనాన్ని అనుగ్రహిస్తున్న, 

ఆ ఓడ్యాణపీఠనిలయ కు వందనం. 

ఓం శ్రీ ఓడ్యాణపీఠనిలయాయై నమః  


380. బిందుమండల వాసినీ 

ఈ నామంలో అమ్మవారిని బిందుమండలవాసినీ అంటున్నాం. 

శ్రీచక్రం మేరు ప్రస్తారంలో అగ్రస్థానం లోనూ, భూప్రస్తారంలో మధ్య స్థానం లోనూ వున్నదే 

బిందుస్థానం. అక్కడే అమ్మ సదా కొలువై వుంటుంది. సహస్రారకమలంలోని మధ్యబిందువు ఇదే. 

దానికి కొద్దిగా పైన వున్న రంధ్రమే బ్రహ్మరంధ్రము. 

ఈ బ్రహ్మ రంధ్రం బ్రహ్మనాళంతో కలుపబడి  వుంటుంది. 

ఆ బ్రహ్మ నాళంపైన బ్రహ్మరంధ్రము వద్ద వున్న కమలమే బ్రహ్మ స్థానం.

బ్రహ్మ ఆ కమలం పై కూర్చునే అమ్మ ఆనతి మేరకు సృష్టి చేస్తూ ఉంటాడు. 

ఆజ్ఞ లో ఒక పద్మము, దాని మధ్యలో బిందువు, సహస్రారములో ఒక పద్మము, 

దాని మధ్యలో బిందువు, బ్రహ్మరంధ్రములో ఒక పద్మము, దాని మధ్యలో బిందువు వున్నాయి.

ఈ మూడు బిందువులతో ఏర్పడినదే త్రికోణము. ఇదే సర్వసిద్ధిప్రద చక్రస్థానం. 

ఆ త్రికోణం మధ్యలో వున్న బిందువే బిందుమండలం. 

ఇదే చిట్టచివరి ఆవరణమయిన సర్వానందమయ చక్రస్థానం.   

ఆ బిందుమండలం లో వసించే దేవి బిందుమండలవాసినీ. 

ఈ చక్రాలు, పద్మాలు, బ్రహ్మరంధ్రాలు, త్రికోణాలు, బిందువులు అన్నీ మనలోనే వున్నాయి. 

ఎవరిని వారు మేరుప్రస్తారంగా ఊహించుకోండి. మనకు కొద్దిగా పైన ఉండేదే బిందువు. 

బిందు స్థానం ఒక తెల్లని కాంతి మండలము. ఆ మండలం కేంద్రబిందువే శ్రీరాజరాజేశ్వరి. 

అక్కడ వున్న ఆ వెలుగే అమ్మ. పోతన గారు గజేంద్రమోక్షంలో 

"లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికవ్వల 

ఎవ్వెండేకాకృతిన్ వెలుగు నతని నే సేవింతున్" అన్నాడు.  ఆ వెలిగేదే లలితాపరమేశ్వరి. 

మనలోనే అన్నీ ఉంచుకుని ఎక్కడో వెతుకుతున్నాం. మీలోనే ఆ అమ్మను దర్శించండి. 

తెలిసినవారికి అమ్మ హస్తామలకం. అరచేతిలో ఉసిరికాయ. 

బిందుమండలంలో ఉంటూ సమస్త భువనాలనూ నడిపిస్తున్న, 

ఆ బిందుమండల వాసిని కి వందనం.  

ఓం శ్రీ బిందుమండలవాసిన్యై నమః  


381. రహోయాగక్రమారాధ్యా

అంతర్యాగమునే రహోయాగమని అంటారు. రహ అంటే ఏకాంతము, రహస్యస్థలము.  

బాహ్యంగా అందరికీ కనిపించేలా చేసే ప్రక్రియ బహిర్యాగమైతే, అంతరంలో రహస్యంగా చేసే 

యాగమును రహోయాగము అంటారు. ఇది కేవలము మానసిక యాగము. 

'అయమాత్మాబ్రహ్మ' అని మాండూక్యోపనిషత్తు లో చెప్పబడింది. 

ఈ ఆత్మే బ్రహ్మము అని ఈ మహావాక్యము చెప్తోంది. ముందే చెప్పుకున్నాం. 

మనమే అమ్మ అనీ, శరీరమే శ్రీచక్రమనీ. 

బిందువు బ్రహ్మ రంధ్రము, మస్తకము త్రికోణము, అష్టకోణము లలాటము, అంతర్దశారము 

భ్రూమధ్యము, బహిర్దశారము కంఠము, చతుర్దశారము హృదయము, అష్టదళము నాభి, 

షోడశదళము కటి, భూపురము పాదాలుగా భావించండి. 

మనలో నున్న అమ్మను దర్శించి పూజించటమే ఈ రహోయాగక్రమవిధానము. 

ఈ విధానములో భక్తుడు, భగవంతుడు ఒక్కరే అనే విషయం మనసులో స్థిరపడాలి. 

శ్రీమద్భాగవతంలో పోతన "తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ " 

అంటాడు. 

ఆ అమ్మను నమ్మితే ఆ దుర్గ మన మనస్సులలోనే ఉంటుంది. ఆ దుర్గను పూజించాలి. 

ఎవడికైతే, ఈ సత్యం బోధపడుతుందో, వాడు జ్ఞాని. అప్పుడు జ్ఞానాగ్ని అనే చిదగ్ని జ్వలిస్తుంది. 

ఆ చిదగ్నిలో మన పాపపుణ్యాలన్నింటినీ ఆహుతి చేస్తూ యాగం చేయాలి. 

ఆ రహోయాగంలో పాపమూ, పుణ్యమూ కూడా పూర్తిగా దగ్ధమైపోవాలి. ఏదీ మిగలకూడదు. 

అంటే, దేని యందునూ ఆసక్తి లేక, దేనినుంచీ ఏమీ ఆశించక, నిస్సంగుడై ఉండాలి. 

ఏకాంతంగా భక్తి సాధన, దృఢవ్రతమే దీక్షగా ఈ రహోయాగక్రమాన్ని చేయాలి. 

అట్టి ఆరాధన వలన మోక్షము లభిస్తుంది. కుండలినీ శక్తి లేచి, జీవుడిని చంద్రమండలం 

వరకు తీసుకు వెళ్తుంది. అక్కడ సుధాధారాలు వర్షించి డెబ్బై రెండు వేల నాడులూ తడుస్తాయి.

అమృతత్వం లభిస్తుంది. ఈ రహోయాగం చేసే భక్తులను అమ్మ కటాక్షించి జీవుడిని 

ఈశ్వరుడితో కలుపుతుంది. అదే జీవేశ్వర సంగమం. శివ పార్వతుల సంగమం. భక్తుల చేత

అంతర్యాగక్రమముతో ఆరాధించబడుతున్న, ఆ రహోయాగక్రమారాధ్య కు వందనం. 

ఓం శ్రీ రహోయాగక్రమారాధ్యాయై నమః  


382. రహస్తర్పణతర్పితా

ఇది కూడా అంతర్యాగములో భాగమే. రహస్యముగా తనకు తర్పణములు అర్పించు భక్తుల పట్ల 

తృప్తి చెందినది అని భావం. తర్పణము అంటే, సర్వమూ ఆ దేవికి సమర్పించటమే. 

సర్వస్వమూ ఆ దేవికి రహోయాగము ద్వారా సమర్పించటానికి నమ్మకం, సాహసం కావాలి. 

చిదగ్నికుండంలో దేవేంద్రాదులంతా, తమను తామే ఆ యాగంలో ఆహుతి చేసుకునే 

సమయంలో ఆవిర్భవించింది లలితాదేవి. 

అంత దృఢవ్రతదీక్ష ఉంటేనే రహోయాగము, రహస్తర్పణమూ ఫలిస్తాయి. 

అటువంటి దృఢవ్రతము, రహస్య ఉపాసన వలన అమ్మ తృప్తి చెంది, 

భక్తుడికి ఊర్ధ్వగమనానికి అనుమతినిస్తుంది. 

బ్రహ్మమును చేరి బ్రహ్మానందాన్ని పొంది ముక్తుడవుతాడు జీవుడు. 

ఏకాంత సాధనా, దృఢవ్రతమూ, స్థిర విశ్వాసమూ, కల ఉపాసకుడు జ్ఞానాగ్నిలో సమస్త కర్మలనూ, 

కర్మఫలములనూ దగ్ధం చేసి సాయుజ్యముక్తిని పొందుతాడు. 

రహస్యముగా అంతర్యాగములో సర్వమూ హోమసమిధలుగా అర్పిస్తున్న భక్తుల దీక్షచే 

తృప్తురాలయిన, ఆ రహస్తర్పణతర్పిత కు వందనం. 

ఓం శ్రీ రహస్తర్పణతర్పితాయై నమః 

  

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


1 కామెంట్‌:

  1. మీ వివరణ చాలా చాలా అద్భుతంగా ఉంది జీవుని యొక్క ఊర్ధ్వ గమన సాధనకు ఎంతో ఉపయోగపడుతుంది చాలా చాలా ధన్యవాదములు

    రిప్లయితొలగించండి