4, డిసెంబర్ 2021, శనివారం

134. రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా రాజత్కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః

  

రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా 
రాజత్కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥ 134 ॥

684. రాజరాజేశ్వరీ

రాజరాజులైన దేవేంద్ర, కుబేరాది దేవతలకు ఈశ్వరి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు 

ఈశ్వరి అని ఈ నామానికి అర్ధం. సాధారణ జనులను పాలించేవారు రాజులు. 

రాజులను పాలించేవారు రాజరాజులైన చక్రవర్తులు. ఆ చక్రవర్తులను పాలించేవారు దేవతలు. 

ఆ దేవతలను పాలించునది జగదీశ్వరి అయిన, ఈ శ్రీ రాజరాజేశ్వరీదేవి. 

రాజరాజులకే ఉపాస్యదేవత శ్రీ రాజరాజేశ్వరి.  

రాజులను, రాజరాజులను, దేవతలను పాలించు, 
ఆ రాజరాజేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ  రాజరాజేశ్వర్యై నమః  

685. రాజ్యదాయినీ

రాజ్యములను ఇచ్చునది రాజ్యదాయినీ. ఇంద్రుణ్ణి స్వర్గమునకు రాజుగా చేసినది రాజరాజేశ్వరి.   

విష్ణువును వైకుంఠమునకూ, శివుడిని కైలాసమునకూ, బ్రహ్మను సత్యలోకమునకూ 

అధిపతులను చేసినది రాజ్యదాయినీ అయిన ఈ పరమేశ్వరి. 

అష్టదిక్పాలకులకూ ఆయా ఆధిపత్యములను ఇచ్చింది ఈ జగన్మాతే.  

దేవతలను స్వర్గము మొదలైన ఉత్కృష్టమైన ఊర్ధ్వలోకాలకు ఆధిపతులను చేసేది జగదీశ్వరి. 

బలిచక్రవర్తికి సుతల లోకాధిపత్యమును ఇచ్చినదీ ఈ జగదాంబే. 

ఎప్పుడు దేవతలకు ఏ కష్టం వచ్చి రాజ్యం కోల్పోయినా, వారు తిరిగి ఆ రాజ్యాన్ని పొందేలా 

చూసేది ఈ  రాజ్యదాయినీ దేవతే. అందుకే ఈ నామంలో అమ్మను రాజ్యదాయినీ అంటున్నాం.   

ఎవరైనా పదవి కోల్పోతే, ఈ నామజపం చేస్తే, ఫలితం ఉంటుంది.  

అర్హులైనవారికి రాజ్యాధిపత్యములను అనుగ్రహిస్తున్న, ఆ రాజ్యదాయిని కి వందనం.  

ఓం శ్రీ రాజ్యదాయిన్యై నమః  

686. రాజ్యవల్లభా

రాజ్యములంటే ఇష్టపడేది రాజ్యవల్లభా. స్వర్గాది రాజ్యములంటే అమ్మకు ఇష్టం. 

ఆ రాజ్యాధిపతులంటే అనుగ్రహం కల తల్లి రాజ్యవల్లభా. 

మణిద్వీపమందు కల శ్రీమన్నాగరానికి నాయిక ఈ తల్లి. 

ఆ శ్రీమన్నగరంలో చక్రవర్తులు, దేవతలు, వారి భార్యలతో కూడి అమ్మను సేవిస్తూ వుంటారు. 

అమ్మ ఈ రాజరాజులందరికీ రాజ్యాలిచ్చిన రాజ్యదాయినీ. 

వీరెవ్వరూ అమ్మ ఆజ్ఞను దాటి చరించరు. పరమేశ్వరి ఆ శ్రీ చక్రనగరమహాసామ్రాజ్ఞి. 

అన్ని రాజ్యాలూ, అందరు రాజులూ ఆ శ్రీచక్రనగర సామ్రాజ్ఞికి అధీనులుగానే వుంటారు. 

అందుకే ఈ నామంలో అమ్మను రాజ్యవల్లభా అంటున్నాం. 

రాజ్యములను, రాజులను వశము చేసుకున్న, ఆ రాజ్యవల్లభ కు వందనం. 

ఓం శ్రీ రాజ్యవల్లభాయై నమః  

687. రాజత్కృపా  

అమ్మ అమితమైన కృప కలది అని ఈ నామ భావం. 

అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు ఎవరిపై పడతాయో, వారు సర్వసంపన్నులు. 

సౌందర్యలహరిలో శంకరాచార్యుడు, 'అమ్మ  కృపాదృష్టి పడినవాడు సర్వమునూ పొందుతాడు, 

అందరూ అతని చుట్టూనే పరిభ్రమిస్తారు' అని అంటాడు. 

శ్రీకృష్ణుని కృప ఉంటే మూగవాడు మాట్లాడతాడు, కుంటివాడు కొండను కూడా దూకేస్తాడు అని 

అంటారు. శ్రీకృష్ణుడన్నా, శ్రీమాత అన్నా ఒక్కరే అని చాలాసార్లు చెప్పుకున్నాం. 

అమ్మవారి కృప ఉంటే, అన్ని వైకల్యాలూ పోయి స్వస్థులవుతారు. 

కాళిదాసు, జ్ఞానసంబంధర్ మొదలైన భక్తులను కటాక్షించింది ఈ కృపే. 

అమ్మ కృపను అందుకే రాజత్కృపా అన్నారు.  

భక్తుల పట్ల దయతో ప్రకాశించే, ఆ రాజత్కృప కు వందనం. 

ఓం శ్రీ రాజత్కృపాయై  నమః   

688. రాజపీఠనివేశితనిజాశ్రితా

తనను ఆశ్రయించిన భక్తులను రాజపీఠములపై కూర్చుండ బెట్టినది అని ఈ నామార్ధం. 

తనను ఆశ్రయించి వున్న భక్తుల పట్ల కృప కలిగివుంటుంది ఆ శ్రీలలిత. 

అర్హులైన, యోగ్యులైన, తన భక్తులకు రాజ్య సింహాసనములను, 

పదవులను ఇచ్చు తల్లి కనుక, అమ్మను రాజపీఠ నివేశిత నిజాశ్రితా అన్నారు.  

రాజపీఠముల నెక్కే పదవుల నిచ్చి కరుణించే, ఆ రాజపీఠనివేశితనిజాశ్రిత కు వందనం. 

ఓం శ్రీ రాజపీఠనివేశితనిజాశ్రితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి