26, డిసెంబర్ 2021, ఆదివారం

156. ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః

 

ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్పీఠరూపిణీ 
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః ॥ 156 ॥


831. ప్రాణేశ్వరీ

ప్రాణేశ్వరీ అంటే ప్రాణములకు ఈశ్వరి అని అర్ధం. ప్రాణములనగా ఇంద్రియములు. 

ఆ ఇంద్రియములకు అధిష్ఠాత్రి కనుక ప్రాణేశ్వరీ అనే నామం వచ్చింది. 

అయిదు ప్రధాన ప్రాణములకూ ముఖ్యప్రాణమయిన ప్రాణవాయువునకు అధిష్ఠాత్రి ప్రాణేశ్వరీ. 

అయిదు ఉపప్రాణములకూ కూడా అధిష్ఠాత్రి ప్రాణేశ్వరీనే. 

పంచ ప్రాణాలూ, పంచ ఉప ప్రాణాలూ గురించి ముందే చెప్పుకున్నాం. 

వేదములో, 'ప్రాణమునకు కూడా ప్రాణము' అని చెప్పబడింది, కనుక ప్రాణేశ్వరీ. 

ప్రాణము అంటే ప్రకృష్టమైన ప్రణము అని అర్ధం. ప్రణమంటే శబ్దము. శబ్దమంటే వేదము. 

కనుక ప్రాణము అంటే వేదము అని ఒక అర్ధం. ఆ వేదములకు ఈశ్వరి కనుక, ప్రాణేశ్వరీ. 

వేదములో చెప్పబడిన దేవత ప్రాణేశ్వరీ. వేదముచే ప్రతిపాదింపబడిన దేవత ప్రాణేశ్వరీ.  

దశవిధ ప్రాణములకూ ఈశ్వరి అయిన, ఆ ప్రాణేశ్వరి కి వందనం.

ఓం శ్రీ  ప్రాణేశ్వర్యై నమః  


832. ప్రాణదాత్రీ

ప్రాణదాత్రీ అంటే ప్రాణములను ఇచ్చునది. ప్రాణములంటే ఇంద్రియములని చెప్పుకున్నాం. 

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి మొత్తం ఇంద్రియములు 

పదకొండు. ఈ ఏకాదశేంద్రియములనూ ఇచ్చునది ప్రాణదాత్రీ అయిన ఆ జగదీశ్వరి. 

సకల జగత్తులకూ, సకల జీవులకూ జీవదాత్రి ఈ ప్రాణదాత్రి. 

"ప్రాణోత్క్రమణ సమయములో, ప్రాణము శరీరమును వదిలి వెడుతుంటే, మిగిలిన ప్రాణాలన్నీ 

దానిని అనుసరించి వెళ్లిపోతాయి", అని వేదములో చెప్పారు. 

వేదసూత్రాలలో ప్రాణగతులు ఏడు అని చెప్పారు. ఈ ప్రాణములనన్నీ ఇచ్చునది ప్రాణదాత్రీ. 

జీవుడికి ఏకాదశ ప్రాణములనూ ఇచ్చు, ఆ ప్రాణదాత్రి కి వందనం.  

ఓం శ్రీ ప్రాణదాత్ర్యై నమః  


833.  పంచాశత్పీఠరూపిణీ 

సంస్కృత సంఖ్యామానంలో పంచాశత్ అంటే యాభై అని అర్ధం. కానీ ఈ నామంలో పంచాశత్ 

అంటే, యాభై ఒకటి అని అర్ధం చేసుకోవాలి. 

ఎందుకంటే అమ్మ అధివసించిన ముఖ్య పీఠములు యాభైఒకటి. 

కనుక సుమారుగా అంచనా వేసి దగ్గరలోని దశమునకు జోడించి పంచాశత్ అన్నారు, అని అర్ధం 

చేసుకోవాలి. సంస్కృతములో కోటి అంటే ఖచ్చితంగా కోటి కాదు, లక్ష అంటే ఖచ్చితంగా లక్ష 

కాదు, సహస్రమంటే ఖచ్చితంగా వెయ్యి కాదు, అని ముందరే చాలాసార్లు చెప్పుకున్నాం. 

ఇక్కడ పంచాశత్ అనే సంస్కృత సంఖ్యకు యాభై ఒకటి అని అర్ధం చెప్పుకుంటే అమ్మవారి 

శక్తి పీఠాల సంఖ్యకు సరిపోతుంది. 

పంచాశత్ పీఠ రూపిణీ అంటే యాభై ఒక్క పీఠాల స్వరూపం, లేదా ఆ యాభై ఒక్క పీఠాలకు 

అధినేత్రి అని అర్ధం. అమ్మ అవతరించిన యాభై ఒక్క పీఠములూ అమ్మ స్వరూపమే కనుక, 

అమ్మను ఈ నామంలో పంచాశత్పీఠరూపిణీ అంటున్నాం. 

జ్ఞానార్ణవంలో, ఈ యాభై, లేదా యాభై ఒకటి పీఠాలనూ, మాతృకావర్ణాలతో న్యాసం చేయాలి 

అని చెప్పారు. న్యాసం చెయ్యడం అంటే ఒక్కో మాతృకావర్ణంతో, అంటే ఒక్కో అక్షరంతో, 

ఒక్కో పీఠాన్ని అనుసంధానించాలి అని అర్ధం. 

మాతృకావర్ణాలు యాభై. క్షకారమును కూడా కలుపుకుంటే యాభై ఒకటి. 

ఆ యాభై ఒక్క, లేదా యాభై అక్షర స్వరూపాలే శ్రీమాత పీఠాలు. 

ఆ యాభై ఒక్క, లేదా యాభై పీఠాల అధీశ్వరినే ఈ నామంలో పంచాశత్పీఠరూపిణీ అంటున్నాం. 

యాభై ఒక్క పీఠాలకూ స్వరూపాన్నిచ్చిన, ఆ  పంచాశత్పీఠరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  పంచాశత్పీఠరూపిణ్యై నమః  


834. విశృంఖలా

విశృంఖలా అంటే శృంఖలములు లేనిది, బంధనములు లేనిది, సంకెలలు లేనిది అని అర్ధం. 

ఎటువంటి కర్మ బంధములూ లేనిది, విధినిషేధములు లేనిది విశృంఖలా. 

ఎటువంటి కర్మ బంధములూ లేనిది అంటే, ఏ కర్మ శేషమూ మిగలనిది. అది పుణ్యకర్మ యైనా, 

పాపకర్మ యైనా అనుభవించి తీరవలసిందే కదా. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. 

పాపకర్మ అయితే ఇనపసంకెళ్లు, పుణ్యకర్మ అయితే బంగారు సంకెళ్లు. అంతే తేడా. 

సంకెళ్లు ఇనుపవైనా, పసిడివైనా సంకెల సంకెలే, బంధనమే. స్వేచ్ఛా ప్రతిరోధకమే. 

కనుక ముక్తిని పొందాలంటే, కర్మ శేషం వుండకూడదు. 

అన్ని కర్మలనూ తీర్చుకున్న తరువాతే ముక్తి దొరుకుతుంది. అమ్మకు ఏ కర్మలూ అంటవు 

కనుక, ఏ కర్మ శేషమూ ఉండదు. అందుకే అమ్మను విశృంఖలా అనే నామంతో పిలుస్తున్నాం. 

జీవులు మాత్రం అన్ని కర్మలనూ తీర్చుకున్న తరువాతే విశృంఖలలు అవుతారు. 

అప్పటివరకూ శృంఖలాలు తప్పవు. 

విశృంఖలా అంటే కట్టుబట్ట, గొలుసు అనే అర్ధాలు కూడా వున్నాయి. 

కనుక విశృంఖలా అంటే కట్టుబట్ట లేనిది, దిగంబరస్వరూపురాలు అని కూడా అర్ధం. 

అలంపురం క్షేత్రంలో వున్న జోగులాంబాదేవి నగ్నంగా ఉంటుంది. దిగంబరురాలు. 

దిక్కులే అంబరముగా, అంటే వస్త్రముగా కలిగినది దిగంబరా. 

అంటే శరీరమును కప్పేది దిక్కులే కానీ వస్త్రములు కావు అని భావం. 

ఏ కర్మ బంధములూ అంటని, ఆ విశృంఖల కు వందనం. 

ఓం శ్రీ విశ్రృంఖలాయై నమః 

  

835. వివిక్తస్థా

వివిక్తస్థా అంటే ఎవరూ లేని నిర్జన ప్రదేశములలో ఉండునది అని అర్ధం. 

వివిక్తము అంటే విజన ప్రాంతము, జనులు లేని, తిరుగాడని ప్రాంతము. 

అట్టి స్థలములు పవిత్రమైనవి అని హారీత స్మృతిలో చెప్పారు. 

అమరకోశంలో కూడా వివిక్తము అంటే, మనుషులు లేని ప్రదేశము, పవిత్రమైనది అని వుంది. 

మనుషులు చేరి ఆ పవిత్రతను నాశనము చేస్తున్నారు. ఇందుకు తిరుమల కొండలు, కేదారనాథ్ 

కొండలు, వైష్ణోదేవీ కొండలు, అమరనాథ్ కొండలు, శ్రీశైలం కొండలు వంటివి కొన్ని 

ఉదాహరణలు. 

అందుకే పవిత్రమైన ఆలయాలు, దేవస్థానములు దుర్జనారణ్యాలలో గానీ, దుర్గమమైన పర్వత 

ప్రాంతాలలో కానీ ఉండటం చూస్తూ ఉంటాం. అటువంటి పవిత్ర ప్రదేశములలో యోగులు, 

సిద్ధులు, ఉపాసకులు, సాధకులు అపవిత్రత అంటక, ఏ ధ్యానభంగమూ కాక, స్థిర మనస్కులై 

తపస్సు, సాధన, ఉపాసన చేసుకోగలుగుతారు.  

దుర్జన ప్రదేశములలో ఉండు వనదుర్గా స్వరూపమైన పార్వతీదేవియే వివిక్తస్థా.

వివిక్తులు అంటే వివేకము కలవారు అనే అర్ధం కూడా వుంది. 

వివిక్తస్థా అంటే ఆత్మానాత్మవివేకము ఉన్న వారి యందు ఉండునది అని ఇంకొక అర్ధం. 

పవిత్రమైన విజన ప్రదేశములలో వుండు, ఆ వివిక్తస్థా కు వందనం. 

ఓం శ్రీ వివిక్తస్థాయై నమః 


836. వీరమాతా

వీరులకు మాత వీరమాతా. వీరులంటే ఎవరో ముందు నామాలలో చెప్పుకున్నాం. 

ఎల్లప్పుడూ జయమును పొందేవారు వీరులు. యుద్ధములో మరణించిన వారికి వీరస్వర్గంలో 

స్థానముంటుంది. వారు యుద్ధంలో మరణించినా వారు వీరులనబడతారు. 

ఉపాసనలో ఉన్నతస్థితిని సాధించినవారిని కూడా వీరులంటారు. 

ఈ వీరులందరికీ హితము చేకూర్చు మాత కనుక, అమ్మను ఈ నామంలో వీరమాతా అంటున్నాం. 

గణపతికి వీరుడనే నామం వుంది. గణపతి కుమారస్వామిని తన ఉపాసనతో జయించి, 

గణాధిపత్యం సాధించాడు. పద్మ పురాణంలో గణేశుని గురించి ఒక కథ ఉంది.

"వీరకుడైన గణేశుడు తనకు ప్రియమైన వాడనీ, తన గణములచే పూజింపబడుతున్నాడనీ శివుడు

ప్రశంసిస్తే, పార్వతి, "ఈ బాలుడి వంటి పుత్రుడు కావలెనని కోరికగా వుంది", అంటుంది. అందుకు

శివుడు,"ఈ వీరకుణ్ణే నీ పుత్రుడుగా స్వీకరించు, నీ కోరికా తీరుతుంది, ఆ బాలుడూ నీ పుత్రుడుగా 

కృతార్థుడవుతాడు", అంటాడు. అప్పుడు పార్వతి తన చెలికత్తె విజయతో వీరకుణ్ణి తన వద్దకు 

పిలిపించుకుంది" అని సూతుడు పద్మపురాణంలో చెప్తాడు. 

వీరులైన వారందరికీ మాతయై హితము కూర్చు, ఆ వీరమాత కు వందనం. 

ఓం శ్రీ వీరమాత్రే నమః 


837. వియత్ప్రసూః

ఆకాశమును ప్రసవించింది కనుక వియత్ప్రసూ అనే నామం వచ్చింది. 

వేదములో 'అమ్మ నుండి ఆకాశం వచ్చింది', అని చెప్పారు. 

మఠాకాశమైనా, ఘటాకాశమైనా, దహరాకాశమైనా, పరాకాశమైనా, అన్ని ఆకాశాలూ అమ్మ నుంచి 

ఉద్భవించినవే. ఆ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, 

జలము నుంచి పృధ్వి వచ్చాయి. 

పంచభూతాలే కాదు సమస్తమూ అమ్మ సృష్టించిన ఆకాశము నుంచే వచ్చాయి. 

ఆ ఆకాశమును ప్రసవించిన పరమేశ్వరినే ఈ నామంలో వియత్ప్రసూ అంటున్నాం. 

మహత్తత్త్వమైన ఆకాశమును సృష్టించిన, ఆ వియత్ప్రసూ కు వందనం. 

ఓం శ్రీ వియత్ప్రసువే నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి