సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154 ॥
813. మూర్తా
నామరూపాలతో వ్యక్తమవుతున్న, ఆ మూర్తా కు వందనం.
ఓం శ్రీ మూర్తాయై నమః
814. అమూర్తా
అమూర్తా అంటే అవ్యక్తము, ఇంద్రియాలకు గోచరించనిది, అవినాశమైనది. అక్షర స్వరూపం.
వాయువు, ఆకాశము కంటికి కనపడవు. అవి ఎన్నటికీ నశించవు.
పంచీకరణము కాకుండా వున్న మహాభూతముల సూక్ష్మాంశలు అన్నీ అమూర్తములే.
మనస్సు, ప్రాణము, కాలము వంటివి కంటికి కనబడవు, చేతికి చిక్కవు.
వాటికి ఉనికి వుంది కానీ, అవి అవ్యక్తరూపంలో ఉంటాయి.
ఓం శ్రీ అమూర్తాయై నమః
815. అనిత్యతృప్తా
అనిత్యతృప్తా అంటే అనిత్యములైన ఉపచారములతో తృప్తి చెందునది అని అర్ధం.
భక్తితో ఏ ఉపచారము చేసినా తృప్తి చెందేది అని భావం.
ఈ అనిత్యతృప్తా లక్షణం వలననే, భక్తిగా శబరి పెట్టిన అడవిపళ్ళను తిన్నా, స్నేహంతో సుదాముడు
తెచ్చిన అటుకులు తిన్నా, తృప్తి చెందాడు ఆ పరమాత్మ.
శ్రద్ధ, భక్తి, మనసు, సమర్పణ ముఖ్యం కానీ నియమాలు, నిబంధనలు కావు అని ఈ నామార్ధం.
అనితి, అతృప్తా అని భావిస్తే, అనితి అంటే శ్వాసించు ప్రాణులు.
వారిచే తృప్తి పొందనిది అని అర్ధం. తృప్తి పొందటానికి ఏకైక కారణం భక్తి.
ఆడంబరములగు పూజలు, జపములు చేసినంత మాత్రమున అమ్మ తృప్తి చెందదు అని భావం.
"గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను
చాలు, విశ్వదాభిరామ వినుర వేమ" అంటాడు ముందు భోగియై, తరువాత యోగియైన వేమన.
భక్తితో, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా తృప్తి పడేది శ్రీమాత.
భక్తితో ఏ సేవ చేసినా తృప్తి చెందే, ఆ అనిత్యతృప్త కు వందనం.
ఓం శ్రీ అనిత్యతృప్తాయై నమః
ఓం శ్రీ మునిమానసహంసికాయై నమః
817. సత్యవ్రతా
సత్యమే వ్రతముగా కలిగినది. సత్యం అంటే పరబ్రహ్మమే అని చెప్పుకున్నాం.
ఆ పరబ్రహ్మ వ్రతం కలది పరమేశ్వరి అని భావం. సత్యవాక్పరిపాలన చేయువారిని రక్షించునది.
దేవీ భాగవతంలో ఒక కథ వుంది. సత్యవ్రతుడనే బుద్ధిహీనుడైన బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు.
బుద్ధిహీనుడైనా, ఎల్లప్పుడూ సత్యమునే పలకటం వలన సత్యవ్రతుడనే నామం వచ్చింది.
ఒకసారి ఒక వేటగాడు ఒక వరాహమును వేటాడుతుంటే, ఆ వరాహము 'ఐ' అని ఘీంకరించింది.
అది విని, సత్యవ్రతుడు, 'ఐ' అని జపించడంమొదలుపెట్టాడు. వేటగాడు వచ్చి పంది ఎటు
పోయింది అని అడిగితే, తన సత్యవ్రతమునకు హాని కలుగకుండా, అదే సమయంలో ఆ
వరాహమును కూడా రక్షించడానికి, 'చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పగలిగే నోరు చూడలేదు', అని
చెప్పాడు. ఆతని సత్యవ్రతమునకూ, జీవకారుణ్యానికీ మెచ్చి, శ్రీమాత ఆ సత్యవ్రతుడికి, బుద్ధీ,
జ్ఞానాన్నిచ్చి, మహాకవిని చేసింది. సత్యవ్రతమును ఆచరించేవారిని కాపాడుతుంది శ్రీమాత.
శివసూత్రములలో, 'శరీరవృత్తియే వ్రతము' అని చెప్పారు. అంటే శరీరము కలిగి ఉండుటయే
వ్రతము అని అర్ధం. శరీరము తుచ్ఛము కాదు, శివభక్తి అనే వ్రతం ఆచరించుటకే లభించింది,
అని భావం. 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనం' అన్నాడు కుమారసంభవంలో కాళిదాసు.
శివవ్రతమన్నా, పరబ్రహ్మ వ్రతమన్నా సత్యవ్రతమే కదా.
సత్యపాలనే వ్రతముగా కలవారిని ఆదరించు, ఆ సత్యవ్రత కు వందనం.
ఓం శ్రీ సత్యవ్రతాయై నమః
818. సత్యరూపా
సత్యమైన రూపము కలది. లేదా సత్యమును రూపవంతముగా చేసి రక్షించునది అని అర్ధం.
ఎల్లవేళలా ఒకే తీరుగా ఉండేదాన్ని సత్యము అంటారు. కనుక సత్యరూపా అంటే త్రికాలముల
లోనూ ఒకే విధముగా ఉండునది అని కూడా అర్ధం.
హరిశ్చంద్రుడు తన సత్య వ్రతము వలననే రాజ్యాన్ని తిరిగి పొందాడు. కీర్తినీ, ముక్తినీ కూడా
పొందాడు. సత్యవ్రతమును ఆచరిస్తూ, ఆ శ్రీమాతను సత్యరూపంలో అర్చించే వారికి అమ్మ
భోగమూ, మోక్షమూ రెండూ ఇస్తుంది.
ఒకసారి సత్యమునకూ, అసత్యమునకూ తగవు వచ్చిందట. శంకరుడు రుజువర్తన కలిగిన
సత్యమునే సంరక్షించాడు అని బహ్వృచులు చెప్పారు. బహ్వృచులు అంటే, అనేక
ఋక్కులున్న ఋగ్వేదమును అధ్యయనము చేసినవారు.
ఎల్లప్పుడూ సత్యమనే రూపములో ప్రకాశిస్తున్న, ఆ సత్యరూప కు వందనం.
ఓం శ్రీ సత్యరూపాయై నమః
819. సర్వాంతర్యామినీ
సర్వుల అంతఃకరణములనూ నియమించునది సర్వాంతర్యామిని. జీవులందరి లోనూ వున్నది.
అంతర్యామి బ్రాహ్మణములో, "ఆత్మ అమృతము, మరణములేనిది, అంతర్యామి" అని వుంది.
మాండూక్యోపనిషత్తులో, " ఆత్మ అంతర్యామి, అన్నీ తెలిసినది, అన్నిటికీ కారణభూతము,
అందరి అంతఃకరణముల యందూ వున్నది" అని చెప్పారు.
వేదములో, 'జీవులందరిలో వారి బ్రహ్మరంధ్రముల ద్వారా ప్రవేశించి, అంతర్యామిగా ఉంటుంది',
అని వున్నది. స్మృతులలో, 'సత్యాసత్య రూపమగు, ఈ సమస్తములోనూ సర్వాత్మురాలుగా,
సర్వజ్ఞతతో వున్నది' అని చెప్పారు.
జీవులందరిలో అంతర్యామిగా వుండు, ఆ సర్వాంతర్యామిని కి వందనం.
ఓం శ్రీ సర్వాంతర్యామిన్యై నమః
820. సతీ
సత్యము యొక్క వ్యక్త రూపమే సతీ. సత్ ని అనుసరించునది సతీ.
సత్ అంటే బ్రహ్మము, పరమాత్మ. ఆ సత్ ను కలిగినది సతీ. సత్యవ్రతమును చేయునది సతీ.
పాతివ్రత్యమే రూపముగా కలది సతీ. పతిని అనుసరించునది సతీ.
సత్ అయిన పరమశివుణ్ణి పొందినది కనుక పరమేశ్వరిని ఈ నామంలో సతీ అంటున్నాం.
దక్షప్రజాపతి కుమార్తెకు దాక్షాయణి అనీ, సతీదేవి అనీ పేర్లు వున్నాయి.
బ్రహ్మపురాణంలో కూడా, "ఈ పార్వతి దక్షుని కుమార్తెగా వున్నప్పుడు సతీదేవిగా ఉండేది.
ఆమె ఇప్పుడు హిమవంతునికి పార్వతిగా పుట్టింది. శంకరుని ధర్మపత్ని, పతివ్రత. శంకరుని తప్ప
అన్యులను పతిగా పొందదు" అని చెప్పారు.
సత్యరూపయైన, శంకరపత్ని, ఆ సతి కి వందనం.
ఓం శ్రీ సత్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి