20, డిసెంబర్ 2021, సోమవారం

150. మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా

 

మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః 
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా ॥ 150 ॥

785. మార్తాండభైరవారాధ్యా

మార్తాండుడు అంటే సూర్యుడు. సూర్యుడు మృతాండుడు కనుక ఆ పేరు వచ్చింది. 

మణిద్వీపమందలి శ్రీపురంలో ఇరవై రెండు, ఇరవైమూడు ప్రాకారముల మధ్యగల భూమిపై 

మార్తాండభైరవుడనే దేవీ ఉపాసకుడున్నాడు. ఆ మార్తాండభైరవునిచే ఆరాధించబడినది 

కనుక, శ్రీదేవికి మార్తాండభైరవారాధ్యా అనే నామం వచ్చింది. 

మణిమల్లుడనే రాక్షసుడిని సంహరించిన శంకరునికి కూడా మార్తాండభైరవుడని పేరు. 

ఆ శంకరుని చేత పూజింపబడునది కనుక, మార్తాండభైరవారాధ్యా అయినది అని ఒక అర్ధం. 

స్కాందపురాణంలో, 'బ్రహ్మాండమంతా రాత్రి మరణించి, తిరిగి ఉదయాన సూర్యుని వలన

బ్రతుకుతున్నది. అందుకని సూర్యునికి మార్తాండుడు అనే పేరు వచ్చింది', అని వుంది. 

శ్రీవిద్యని ఉపాసించిన ప్రధములలో సూర్యుడు కూడా వున్నాడు. 

మార్తాండునిచే ఆరాధింపబడినది కనుక, శ్రీదేవిని మార్తాండారాధ్యా అంటున్నాం. 

భీరువుల సమూహాన్ని భైరవులంటారు. మార్కండేయపురాణంలో, "ఓ దేవీ, నిన్ను 

స్మరించినంత మాత్రమున భయమును పోగొట్టుచున్నావు" అని వున్నది. 

ఆవిధముగా భీతావహులైన భీరువులచే పూజింపబడునది భైరవారాధ్యా.

కాళికాపురాణంలో, అష్టభైరవులైన కాల భైరవుడు మొదలైన ఎనిమిదిమంది భైరవ సమూహముచే 

పూజింపబడుతున్నది కనుక భైరవారాధ్యా అయినది' అని వున్నది. 

ఈ విధముగా మార్తాండునిచే, భైరవులచే, మార్తాండభైరవునిచే పూజలందుకుంటున్న, 

ఆ మార్తాండభైరవారాధ్య కు వందనం. 

ఓం శ్రీ  మార్తాండభైరవారాధ్యాయై నమః  


786. మంత్రిణీ న్యస్తరాజ్యధూః

మంత్రిణి అయిన శ్యామలకు రాజ్యభారమును ఇచ్చినది కనుక, ఆ లలితా పరమేశ్వరికి 

మంత్రిణీన్యస్తరాజ్యధూః అనే నామం ఏర్పడింది. బ్రహ్మాండపురాణంలో మంత్రిణి అయిన 

రాజశ్యామలకు రాజ్య కార్య భారం ఇచ్చి మంత్రాంగములు చేయునది అని వున్నది. 

మంత్రోపాసకులను, మననము చేయువారిని, రక్షించే ధర్మము కలవారి నిర్మలచిత్తములకు

మంత్రము అని పేరు. అటువంటి నిర్మలచిత్తులను భగవతితో ఐక్యం చేసేది మంత్రిణి శ్యామల.  

అంటే దేవితో ఐక్యమయ్యే ప్రయత్నమే, సాధనే మంత్రిణీ స్వరూపం అని అర్ధం. 

శివసూత్రాలలో చిత్తమే మంత్రము, ప్రయత్నమే సాధకుడు, విద్యాశరీరస్ఫురత్తుయే(ప్రకాశమే) 

మంత్రరహస్యము అని చెప్పారు. 

ఈ మనన, త్రాణ మంత్ర రహస్యములు గురుముఖతః మాత్రమే తెలుస్తాయి అని చెప్పారు. 

మంత్రిణి అయిన శ్యామలను ఆరాధిస్తే, ఆ దేవతే భారం వహిస్తుంది అని ఈ నామ భావం.  

కార్యభారం వహించి, ఉపాసకులను దేవితో ఐక్యం చేసే, ఆ మంత్రిణీన్యస్తరాజ్యధు కు వందనం.  

ఓం శ్రీ మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః  


787.  త్రిపురేశీ

త్రిపురేశీ అంటే త్రిపురములకూ ఈశ్వరి అని ఒక అర్ధం. 

సర్వాశాపరిపూరక చక్రస్వామినికి త్రిపురేశీ అని పేరు. ఆ సర్వాశాపరిపూరక చక్రాధీశ్వరి శ్రీలలిత, 

కనుక అమ్మకు ఈ త్రిపురేశీ అనే నామం వచ్చింది. 

స్థూల, సూక్ష్మ, కారణ శరీరములకు ప్రాణరూపిణి, కనుక త్రిపురేశీ. 

మయుడు నిర్మించిన త్రిపురములకూ ఈశ్వరి, కనుక త్రిపురేశీ. 

దేహములో వున్న త్రికూటములనే త్రిపురాలకు ఈశ్వరి, కనుక త్రిపురేశీ.    

త్రిపురములకు అధీశ్వరి అయిన, ఆ  త్రిపురేశి కి వందనం. 

ఓం శ్రీ త్రిపురేశ్యై నమః  


788. జయత్సేనా 

జయము కలిగించే, జయమును ఇచ్చే సేనను కలిగినది జయత్సేనా. 

అమ్మ బృహత్సేనను కలిగి, ఆ సేనతో సర్వత్రా విజయం సాధించింది, 

కనుక ఈ నామంలో అమ్మను జయత్సేనా అంటున్నాం. 

అమ్మ తన శక్తి సేనతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించింది. 

జయము కలిగించే అపార సేనావాహినిని కల అమ్మకు జయత్సేనా నామం వచ్చింది.  

జయత్సేనుడనే రాజ స్వరూపిణి అని ఒక అర్ధం. ఈ జయత్సేనుడి వంశంలోనే దుష్యంతుడు, 

భరతుడు పుట్టారు. భారతదేశం పేరు ఈ భరతుడి పేరు నించే వచ్చిందని అంటారు. 

సర్వత్రా విజయాన్నిచ్చే సేన గల, ఆ జయత్సేన కు వందనం. 

ఓం శ్రీ జయత్సేనాయై నమః 


789. నిస్త్రైగుణ్యా

 ఏ గుణ ధర్మములూ లేనిది. గుణ ధర్మములను వదిలివేసినది అని అర్ధం. 

త్రిగుణాలకు అతీతమైనది, నిర్గుణ స్వరూపురాలు కనుక అమ్మకు ఈ నామం వచ్చింది. 

ఏ గుణమునకూ లొంగనిది ఆ పరమేశ్వరి. నిర్గుణ స్థితి అయిన మోక్షమును ఇచ్చునది 

లలితాపరాభట్టారిక.  

గుణరహిత అయిన, ఆ నిస్త్రైగుణ్య కు వందనం. 

ఓం శ్రీ నిస్త్రైగుణ్యాయై నమః 


790. పరాపరా

పరా, అపరా స్వరూపురాలు పరాపరా. అందరియందు ఒకే భావనను కలిగివుండేది పరాపరా. 

శత్రువు, మిత్రుడు అనే భేదము చూపదు. స్వ, అన్య అనే తేడా లేనిది. 

దూరముగా వున్నా, దగ్గరగా వున్నా అన్నీ ఈ పరాపరా స్వరూపమే. 

పరావిద్య, అపరావిద్యా అనే విద్యల స్వరూపురాలు పరాపరా.  

ముండకోపనిషత్తులో, "పరమేశ్వరుడికి సంబంధించినది పరావిద్య. ధర్మములు, కర్మలు గురించి 

చెప్పేది అపరావిద్య", అని వుంది. 

చతుర్వేదములు, వేదాంగములు అపరావిద్య. లౌకిక సుఖములకు ఉపయోగపడతాయి. 

వీటివలన మోక్షము రాదు. ఇహము నకు ఉపయోగపడుతుంది అపరా విద్య. 

పరావిద్య వలన, ఆత్మసాక్షాత్కారం, మోక్షం కలుగుతాయి. 

పరావిద్య, ఇంద్రియాలకు అందనిది. బ్రహ్మజ్ఞాన సంబంధమైన విద్య. 

విశ్వమంతా వ్యాప్తి చెంది వున్న ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోవడమే పరావిద్య. 

అమ్మ తన ఉపాసకులకు ఈ పరా, అపరా విద్యలను, ఎవరు ఏది కోరితే అది ఇస్తుంది. 

ఈ రెండు విద్యల స్వరూపమూ ఆ శ్రీలలితే. 

ఇహము, పరము రెండింటికీ ఆధారభూతమయిన, ఆ పరాపర కు వందనం. 

ఓం శ్రీ పరాపరాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి