8, డిసెంబర్ 2021, బుధవారం

138. సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా సంప్రదాయేశ్వరీ, సాధు, ఈ, గురుమండలరూపిణీ

   

సర్వోపాధి వినిర్ముక్తా, సదాశివ పతివ్రతా 
సంప్రదాయేశ్వరీ, సాధు, ఈ, గురుమండలరూపిణీ ॥ 138 ॥

708. సర్వోపాధివినిర్ముక్తా

ఆ పరమేశ్వరి అన్ని ఉపాధులనూ వదిలివేసింది అని ఈ నామానికి అర్ధం. 

సర్వగా అనే నామంలో అమ్మను సర్వరూపా అని చెప్పుకున్నాం. దానికి విరుద్ధంగా ఇక్కడ 

అమ్మకు ఏ ఉపాధీ లేదు అని చెప్పుకుంటున్నాం. అమ్మ ఏ ఉపాధి లోనికి ఒదగనిది అని అర్ధం. 

పరమేశ్వరి అన్నీ తానే, ఏదీ తాను కాదు అనే అర్ధాన్ని, ఈ సర్వగా, సర్వోపాధి వినిర్ముక్తా 

నామాలు చెప్తున్నాయి. శ్రీమాత అద్వైత రూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి. 

ఏ పదార్ధముతోనూ భేదమూ, అభేదమూ చూపదు. 

ఉపనిషత్తులు ఈ విధంగా చెప్తున్నాయి. "ఒక చెట్టుమీద రెండు పక్షులు కూర్చుని వున్నాయి. 

రెండూ ఒకే రకమైన పక్షులు. అందులో ఒకటి తన కర్మఫలములను భుజిస్తూ వుంది, 

అది జీవాత్మ. రెండవది ప్రశాంతంగా కూర్చుని వున్నది, అది పరమాత్మ. ఈ రెండూ ఒక్కటే 

అయినా, జీవాత్మ అవిద్య, అజ్ఞానం వలన ఆ సత్యం గ్రహించలేకుండా వున్నది. తెలుసుకున్న 

నాడు జీవాత్మ పరమాత్మలో లయించిపోతుంది. అదే అద్వైతం." 

అమ్మ అద్వైత స్వరూపాన్ని తెలుసుకున్న వాడు, జ్ఞానియై ఆ పరమాత్మకు 

ఏ ఉపాధులూ లేవనే జ్ఞానాన్ని  పొందుతున్నాడు.  
  

అన్ని ఉపాధులనూ వర్జించిన, ఆ సర్వోపాధివినిర్ముక్త కు వందనం. 

ఓం శ్రీ  సర్వోపాధివినిర్ముక్తాయై నమః  


709. సదాశివపతివ్రతా

పరమేశ్వరి ఆ పరమేశ్వరునితో పంచసామ్యాలని కలిగి వున్నదని చెప్పుకున్నాం. 

పరమేశ్వర పరమేశ్వరీ తత్త్వాలు ఒక్కటే. ఒకే వస్తువు రెండు నామ రూపాల్లో తెలియబడుతోంది. 

ఎప్పటికీ పరమేశ్వరుడే పార్వతికి భర్త. అందుకే ఈ నామంలో అమ్మను సదాశివపతివ్రతా అన్నాం. 

ఎన్ని అవతారాలు మారినా, అన్ని జన్మలలోనూ పరమేశ్వరి ఆ సదాశివుణ్ణే వరించింది. 

మహాదేవుడిని అగౌరవం చేసాడని, తండ్రి అయినా, దక్షుని యజ్ఞం ధ్వంసం చేసింది. 

హిమవంతుడికి కూడా తనను శివునికి ఇచ్చి వివాహం జరిపించాలనే నియమం పెట్టింది. 

సదాశివుడినే ధ్యానిస్తూ నిద్రాహారాలు మాని తపస్సు చేసింది. పర్ణాలు అంటే ఆకులు కూడా 

తినకుండా తపస్సు చేసిందనే అమ్మకు అపర్ణ అనే నామం వచ్చింది. 

గజాసురుడు, భస్మాసురుడు వంటివారు బోళా శంకరుడిని ఇబ్బంది పెట్టిన 

ప్రతిసారీ శంకరుణ్ణి  కాపాడుకుంటూ వచ్చింది.  

ప్రళయకాలంలో కూడా  తాండవం చేస్తూ శివుడు, లయము చేస్తూ శివాని కలిసే వుంటారు. 

సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యాలలోనూ ఆ సదాశివుని వెన్నంటే 

ఈ సదాశివపతివ్రత వుంటుంది. శివునిలో అర్ధభాగం ఈ అర్ధనారీశ్వరి.  

శంకరుడే తన పతి అనే నియమంతో వున్న శంకర పత్ని, ఆ సదాశివపతివ్రత కు వందనం.  

ఓం శ్రీ సదాశివపతివ్రతాయై నమః  


710. సంప్రదాయేశ్వరీ

సంప్రదాయమునకు ఈశ్వరి ఈ సంప్రదాయేశ్వరి. సంప్రదాయము అంటే, సమ్యక్ ప్రదాయము. 

సంప్రదాయములందు సమర్ధురాలు. సంప్రదాయము చేత తెలియదగినది సంప్రదాయేశ్వరీ.  

శ్రీవిద్య గురువు అనుగ్రహము చేత మాత్రమే లభిస్తుందని చెప్పుకున్నాం. 

శ్రీవిద్య వంశానుగతముగా, గురు పరంపరానుగతంగా శిష్యులకు అందుతుంది. 

శ్రీమాత ఈ సంప్రదాయం ద్వారానే ప్రకటితమవుతున్నది కనుక, 

ఈ నామంలో ఆ జగన్మాతను సంప్రదాయేశ్వరీ అంటున్నాం. 

యోగినీ హృదయమందు, దత్తాత్రేయసంహిత మందు సంప్రదాయము అనే మంత్రాన్ని 

గురించి చెప్పారు. ఆ సంప్రదాయమనే మంత్రానికి అధిదేవత కనుక, 

అమ్మను ఈ నామంలో సంప్రదాయేశ్వరీ అంటున్నాం.  

సంప్రదాయముగా, పరంపరగా శ్రీవిద్యాప్రదానం చేస్తున్న, ఆ సంప్రదాయేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ సంప్రదాయేశ్వర్యై నమః  


711. సాధు 

సాధు అంటే తగినది, ఉచితమైనది అని అర్ధం. సంప్రదాయేశ్వరీ అనే నామంలో చెప్పిన

సంప్రదాయేశ్వరీ తత్త్వము తగినది, ఉచితమైనది అని ఈ నామంలో చెప్పుకుంటున్నాం. 

సంప్రదాయము చేత తెలియదగినది సంప్రదాయేశ్వరీ అను విషయము సరియైనది అని 

ఈ సాధు నామం తెలియచేస్తోంది. అమ్మ చేసే ఏ కార్యమైనా ఉచితము, యుక్తము, తగినది,  

సరియైనది అనే భావం ఈ సాధు శబ్దం ద్వారా తెలియబడుతోంది. 

యుక్తమైనది మాత్రమే చేయు, ఆ సాధు కు వందనం. 

ఓం శ్రీ సాధునే నమః   


712. 

ఈ అంటే తురీయస్వరూపం. ఈ అంటే 'అస్య భగినీ' అనే అర్ధం భాస్కరరాయలు చెప్తున్నారు.  

అక్షరములలో "అ" అనే అక్షరమును నేను, అని భగవద్గీతలో ప్రకటించాడు భగవంతుడు.

కనుక, 'అ' అంటే నారాయణ స్వరూపం. ఆ నారాయణునికి భగినీ అంటే నారాయణి. 

అమ్మను ఈ నామంలో నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి అని చెప్పుకుంటున్నాం. 

"ఈం" కామకలాబీజము, మన్మధబీజము. సృష్టికి మూలమైన 'ఈం' శక్తియే దేవీ స్వరూపము. 

ఇది మిక్కిలి రహస్యమైన, గుహ్య విద్య. గురుముఖతః తెలియతగినది అని భాస్కరరాయలు 

చెప్తున్నారు. లిఖించలేని గుహ్యాతిగుహ్య మంత్రం ఇది.  

మన్మధ కళా బీజమైన, నారాయణ సోదరి, ఆ ఈ కి వందనం.  

ఓం శ్రీ యై నమః 


713. గురుమండలరూపిణీ

గురుమండలం అంటే గురు పరంపర. ఆ గురుమండల రూపంలో ఉంటుంది శ్రీవిద్య. 

"సదాశివసమారంభాం, వ్యాస శంకర మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం, వందే గురు 

పరంపరాం", అని చెప్పుకుంటాం. దీనిని బట్టీ, శ్రీవిద్య గురు పరంపరగా, సంప్రదాయములో 

లభించవలసినదే కానీ, అన్యత్రా లభించదు అని తెలుస్తోంది. గురుమండలం ద్వారా తప్ప 

నేర్వలేనిది శ్రీవిద్య. పుస్తకములలో లిఖించలేనిది అన్నారు  శ్రీవిద్యను భాస్కరరాయలు.  

తండ్రి నుంచి పుత్రులకు, గురువు నుండి శిష్యులకు మాత్రమే లభించేది ఈ గుహ్యాతిగుహ్యమైన 

విద్య. అప్పుడు కూడా ఆ విద్యను ఆ గురువు లేదా తండ్రి రూపంలో అందించేది ఆ శ్రీమాతయే. 

బ్రహ్మాది దేవతలను దివ్యౌఘము, దేవర్షులను సిద్దౌఘము, భూలోక ఋషులను మానవౌఘము 

అంటాం. ఇదే గురుమండలం. ఆ గురుమండల రూపిణే పరమేశ్వరి. 

పరమేశ్వరుడు ద్వారా పరమేశ్వరికి, పరమేశ్వరి ద్వారా, పరంపరగా దివ్యౌఘమైన, 

ఉమా మహేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు, వాణీహిరణ్యగర్భులకు, ఇంద్రాది దేవతలకు 

ఈ శ్రీవిద్య అందింది. వారి ద్వారా తరువాత సిద్దౌఘమైన సనకసనందాది సిద్ధులకు అందింది. 

వారి ద్వారా, మానవౌఘమైన విద్యారణ్య, గౌడపాద, శంకరభగవత్పాదులకు అందింది. 

వారి నించి వారి శిష్యులకు ఈ శ్రీవిద్య లభించింది. 

ఈ గురుపరంపర ద్వారా నేటికీ అర్హులైన వారికి శ్రీవిద్య అందుతూనే వున్నది. 

గురుమూర్తి రూపంలో, గురుమండలంలో, అర్హులైన వారికి కృపతో, శ్రీవిద్యను బోధిస్తున్న,  

ఆ గురుమండలరూపిణి కి వందనం. 

ఓం శ్రీ గురుమండలరూపిణ్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

1 కామెంట్‌: