19, జనవరి 2022, బుధవారం

నేనెందుకు రాశానంటే.........


ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ 
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్

నేనెందుకు రాశానంటే.......

ఒక మూడు, నాలుగేళ్ల నుంచీ లోపల నుంచి లలితా అమ్మవారి గురించి రాయాలని, ఏదో ఎప్పుడూ తొలుస్తూ ఉంది. చివరకు, అమ్మవారి కృప వలన, ఆ మనోమథనం ఇలా పరిణమించింది. 

ఈ సోషల్ మీడియా ఉధృతి ఎక్కువయ్యాక, ఎవరెవరో వాట్సాప్ లో ఏవేవో షేర్ చేస్తూ ఉండేవారు. అన్నీ ఫార్వార్డ్సే. ఒక్కటీ అవి పంపించేవారి ఒరిజినల్ మాటర్ కాదు. విసుగేసేది. నా అభిరుచి తెలిసినవారు పుంఖానుపుంఖాలుగా ఈ దేవీ దేవతల ఫార్వర్డ్స్ పంపించేవారు. ఒక్కో రోజు, ఒకటే పోస్ట్ పదిసార్లు వచ్చేది. డిలీట్ చేసీ చేసీ విసుగేసేది. భక్తి, నమ్మకం అంటే ఇది కాదు, ఫార్వర్డ్స్ పంపించకండి అని మొత్తుకునేదాన్ని. కానీ ఆ ప్రవాహం ఆగలేదు. 

కొన్నిసార్లు శ్రీలలితాసహస్రనామాల గురించి వన్ లైనర్ ఫార్వర్డ్స్ వచ్చేవి. బొమ్మలు చాలా  బాగుండేవి. అవి కాస్త శ్రద్ధగా చూసి దాచుకునేదాన్ని. ఏవైనా సరే ఓ పదో, పాతికో వచ్చాక ఆగిపోయేవి. భలే చికాకు అనిపించేది. అలవాటు చేసి ఆపేస్తారేమిటి అని విసుక్కునేదాన్ని. సరే, బొమ్మలతో వన్ లైనర్ లు ఆగిపోయాక, మరెవరో మహానుభావులు కొంచెం వివరణతో కూడిన నామాలుమళ్ళీ ఓ పది, పదిహేను పంపించారు. అంతే, మళ్ళీ ఆగిపోయింది. ఏమిటిదంతా, అని అడిగితే, వారికి ఎవరు షేర్ చేశారో వారు ఆపేశారట. చిన్నపిల్లలకి ఏ చాక్లెట్టో, ఐస్క్రీమో నాకించి లాక్కున్నట్టు ఉండేది నా బాధ. తెలిసినవారితో, 'ఈ గోలంతా ఏమిటి, నేనే ఎప్పుడో మొత్తం రాసేస్తా' అంటూ ఉండేదాన్ని. బహుశా ఆ బాధ అంతా లోపల ఉందేమో. 

సౌభాగ్య భాస్కర భాష్యం పుస్తకం మా సువర్చల అత్తయ్య దగ్గర చూసాను, చదివాను. కానీ ఆ ప్రతి చాలా జీర్ణావస్థలో వుంది. మంచి కాపీ దొరకలేదు. చివరకు సుమారు మూడు నాలుగేళ్ల క్రితం చాలా యాదృచ్చికంగా భాస్కరరాయలవారు రాసిన సౌభాగ్య భాస్కర భాష్యం పుస్తకం దొరికింది. డా. నోరి భోగీశ్వరశర్మ సోమయాజి గారు ఆ పుస్తకాన్ని పునః ప్రచురించి మాలాంటి వారికి ఎంతో ఆనందాన్నిచ్చారు. ఆ పుస్తకం కొనుక్కుని భాస్కరరాయ భాష్యం ఈసారి చాలా తీరికగా చూసాను.

ఆ సంస్కృత భాష్యాన్ని తెలుగులో, ముఖ్యంగా అమ్మవారిమీద భక్తి, శ్రద్ధా, విశ్వాసం వుండి, ఇంకొంచెం తెలుసుకుందామనే ఆసక్తి వున్నవారికి, సంస్కృతం రాక, ఆ గ్రంధాలు చదవలేని వారికిదాదాపుగా బిగినర్స్ కి, ఉపయోగంగా సరళమైన భాషలో, కర్మ, భక్తి, జ్ఞానము, ఉపాసనా అనేవి ముఖ్య మార్గాలుగా తీసుకునినేనే రాయాలని లోపల్లోపల అనిపించినా, బద్ధకం వలన రచన మొదలుపెట్టలేదు. నేను  మొదటినుంచీ కూడా సింపుల్ గా చెప్పాలనే అనుకున్నాను. భాషాడంబరం, పదవిన్యాసం నా లక్ష్యాలు కాదు. నాకేం వచ్చో చెప్పాలని కాదు, నా పాఠకులకు ఏం కావాలో  చెప్పే  ప్రయత్నం చేశాను. భాస్కరరాయలు చాలా ధ్యానమార్గం, యోగమార్గం, ఎంతో లోతైన అంతరార్ధాలు కూడా రాశారు. ఆ మార్గం లోకి నేను పోలేదు. చాలా వ్యాకరణం రాశారు. నేను దాన్నీ టచ్ చెయ్యలేదు. కేవలం నామార్ధాలు ఆయన ఏ దృక్పథంతో రాసారని నాకు అనిపించిందో, వాటికి, నా అనుభవాలు, దర్శనాలు, అమ్మవారితో నాకున్న అనుబంధం ఆధారంగా ఈ వ్యాఖ్యానం రాసాను. ఎన్ని చదివినానా ఈ శ్రీ లలితా విజయం గ్రంధానికి కేవలం శ్రీ భాస్కరరాయ పండితుడు రాసిన సంస్కృత సౌభాగ్య భాస్కర భాష్యం మాత్రమే ముఖ్య లేదా ఏకైక ఆధారం. 

ఎందరో పారాయణలు చేస్తున్నాం, రండి అని పిలిచేవారు. చాలా భక్తి శ్రద్ధలతో చేసేవారు కూడా. కానీ వారు పదవిభజనలో, పదఉచ్చారణలో, చేసే లోపాలు చూసి బాధపడేదాన్ని. అలా కాదు, ఇలా చదవాలి అంటే, పట్టించుకునే వాళ్ళు కాదు. చెప్పి చెప్పీ విసుగేసిసుమారు ఓ పదేళ్ల నుంచీనేనే ఆ పారాయణలకి వెళ్ళటం మానుకున్నా. మధ్యలో బ్రేక్ వస్తే, బట్టీ పట్టిన స్తోత్రం మర్చిపోతామనే వాళ్ళ భయం వాళ్ళది. అవీ ఇవీ అన్నీ కలిసి, నేనే సరిగ్గా పదవిభజన చేస్తూ, అర్ధం చెపుతూ రాయాలని అనుకున్నా. అర్ధం తెలుస్తే, తప్పు చదవరేమో అన్న ఆశ మనసులో. 

సుమారు ఓ పది నెలల క్రితం మా సువర్చల అత్తయ్యతో, "అత్తయ్యా, ఒక నామం చెప్తా. నీకు ఓకే అనిపిస్తే రాస్తా" అని, మొదటి శ్రీమాతా నామానికి నాకు మనసులో స్ఫురించిన భావం చెప్పా. అత్తయ్య 'బాగుంది, రాయి' అంది. అప్పుడు అత్తయ్య నాకు ఒక మంచి ఉపయోగకరమైన సలహా కూడా ఇచ్చింది. ఎలా రాయాలీ, ఎంత రాయాలీ, అన్నప్పుడు 'రోజుకి ఒక శ్లోకం రాయి. ఆ శ్లోకంలో ఎన్ని నామాలుంటే అన్ని నామాలకీ రాయి', అని చెప్పింది. ఈ లిమిట్ బాగుంది అని చాలా సంతోషపడ్డా. నా బ్లాగ్ వుంది కదా, అప్పటికే ప్రయాణోపనిషత్, జ్ఞాపకాలదొంతర రాస్తూ వున్నా, దానిలోనే ఇది కూడా రాయాలని సంకల్పం చేసేసా. అన్నీ అనుకున్నానే కానీ, మళ్ళీ బద్ధకం ఆవహించేసింది. మొదలుపెట్టలేదు. చివరకు అకస్మాత్తుగా ఎవరో తరిమినట్టు, అప్పటికప్పుడు, 2021 గురుపూర్ణిమ నాడు మధ్యాహ్నం అన్ని పనులూ ముగించుకుని, ప్రయాణోపనిషత్ బ్లాగ్ లోనే, మొదటిశ్లోకం పోస్ట్ చేశా. ఆ రోజు నుంచీ రోజుకి ఒక శ్లోకం అనే నియమాన్ని పెట్టుకుని, దానిని ఉల్లంఘించకుండా వ్యాఖ్యానం రాసి పోస్ట్ చేస్తూనే వున్నా. 

కొన్నిసార్లు పనులు వచ్చేవి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చేది. అటువంటి రోజులలో కొన్ని ముందు నుంచీ రాసి ఉంచుకుంటే మంచిదని అనిపించింది. అప్పటినుంచీ, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు రాసి పెట్టుకునే దాన్ని. అమ్మవారి కార్యం. ప్రోత్సాహం, ప్రోద్బలం అమ్మవారిదే. ప్రేరణాస్ఫురణా ఆవిడదే. చిన్న పిల్లవాడు అడవి దాటుతూ భయంతో 'కృష్ణా, తోడు రావా', అని పిలిచినట్టు, నేను కూడా, "అమ్మా, నువ్వు రాయమని అంటేనే రాస్తున్నాను. బాధ్యత నీదే. నడిపించు, నీ  చేయి పట్టుకుని నడుస్తాను", అని భారం ఆ లలితా పరమేశ్వరి మీదే వేసేసాను. తమాషా, ఎన్ని గంటలు రాసినా, ఎన్ని రాత్రుళ్ళు మేలుకునే వున్నా, అలసట అనిపించలా. హాయిగానే వుంది. మధ్యలో వచ్చే అడ్డంకులకి నేను, మావారు భండాసురులని పేరు పెట్టుకున్నాం. భండాసురులు వచ్చాయి, పోయాయి. మా పని మాత్రం ఎక్కడా ఆగకుండా చక్కగా అయిపోయింది. అందుకేనేమో, అమ్మ ఆజ్ఞ లేనిదే ఏం చేసినా ముందుకు సాగదు, అంటారు. 

కాలడిలో స్వర్ణోత్తుమన చూసి, అక్కడ మండపంలో కూర్చుని, పైన చక్కగా చెక్కలో చెక్కిన లక్ష్మీదేవిని చూస్తూ కనకధారాస్తోత్రం చదువుకోవడం, తిరువనంతపురంలో, అనంత పద్మనాభ స్వామి గుడిలో, కళ్యాణ మండపంలో కూర్చుని విష్ణుసహస్రనామస్తోత్రం చదువుకోవడం, శ్రీనగర్ లో చక్రేశ్వరీ అమ్మవారి మహాశిల ముందు కూర్చుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ  సిందూరం అంతా పూసేసుకోవడం, త్రయంబకంలో పై నుంచి శివలింగాన్ని చూస్తూ లోపలికి  పడిపోబోవడం, రెండే రోజుల ప్రయత్నంతో, రెండే రోజుల్లో అమరనాథ్ వెళ్లి, అంతెత్తు వున్న హిమ లింగాన్ని దర్శించుకోవడం, ఇవి నా జీవితంలో కొన్ని అపురూప ఘట్టాలు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు,   శ్రీ లలితా సహస్ర నామ సరళ వ్యాఖ్యానం రాయడం ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది. 

ఈ శ్లోకాలన్నీ, మొదట్లో ప్రయాణోపనిషత్ అనే టైటిల్ కిందే పోస్ట్ చేశా. తరువాత చాలా టైటిల్స్ మార్చా. చాలాకాలం పాటు శ్రీ లలితా సుధావాహిని అనే పేరుతో పబ్లిష్ అయ్యింది. చివరకు, భాస్కరరాయల వారి బాటలోఅమ్మవారి పేరూ, నాపేరూ కూడా కలిసి వచ్చేలా, ఈ మొత్తం వ్యాఖ్యానానికి శ్రీ లలితావిజయం అనే పేరు నిశ్చయం  చేసుకున్నా.  

మొత్తం మీద దక్షిణామూర్తి ఆశీస్సులతోగురుపూర్ణిమ నాడు మొదటినామంతో ప్రారంభించిన ఈ వ్యాఖ్యానం, నారాయణుడి ఆశీస్సులతోవైకుంఠఏకాదశి నాడు వెయ్యో నామంతో ముగించివెయ్యి నామాల వ్యాఖ్యానమూ రాయగలిగాను. అంతా లలితా దేవి సంకల్పమూకృపా తప్ప మరేదీ కాదు. 

ఇంకో విషయం చెప్పాలి. మొదట్లో, ఈ స్తోత్రం రహస్యం కదా, ఇలా అందరికీ పబ్లిక్ గా బ్లాగ్ లో చెప్పొచ్చా అనే సందేహం కలిగింది. ఎందుకంటే స్వయంగా అమ్మవారే, 'ఇది అందరికీ చెప్పకూడదు, అర్హులైన వారికి మాత్రమే చెప్పాలి' అని ఒక నిబంధన పెట్టింది కదా. నేను ఈ సందేహంలో పడి రాయడంలో ఇంకొంచెం జాగు చేశా. ఏదో ఒక నెపంతో తప్పించుకోవాలని ఒక చిన్న దురాలోచన. అప్పుడు అమ్మవారే ఇలా చెప్పినట్టు అనిపించింది. "అర్హత సంగతి నేను చూస్తా, అది నీ పని కాదు, నువ్వు రాయి, ఎవరికి ఎలా చేరాలో నేను చేరుస్తా" అని. ఈ స్తోత్ర వ్యాఖ్యానానికి నన్ను ఉపకరణంగా ఎన్నుకున్నందుకు ఆ జగదంబకు సదా కృతజ్ఞురాలిని. నాచేత రాయించటమే కాదు, నాకు అవసరమైనవన్నీ సమకూర్చి పెట్టింది. ఈ స్తోత్రవ్యాఖ్యానం నాకు తెలియని ఎందరినో నాకు పరిచయం చేసింది. నన్ను తెలియని ఎందరికో నన్ను పరిచయం చేసింది. 

ఇప్పటికే చదివిన కొందరికి అమ్మ కనిపిస్తే, కొందరికి వారికి కావలసిన కోరిక తీర్చిపెట్టింది. ఇది సత్యం. అన్నీ నేనే చూసుకుంటాను అన్న మాట అమ్మది. పూర్వ, ఉత్తర పీఠికలలో కూడా, ఈ నామాలు పారాయణ చేసిన వారి కోరికలు తీరుస్తాను అని అమ్మ ఇచ్చిన మాట పొల్లుపోదు. 

 ఓం శ్రీ సర్వానుల్లంఘ్యశాసనాయై నమః 

ఓం శ్రీ ఆబాలగోపవిదితాయై నమః 

ఓం శ్రీ లలితాంబికాయై నమః 

 ……… భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

        

 


4 కామెంట్‌లు:

  1. My heart filled with happiness after reading this. Thanks for sharing your experiences. Stay blessed

    రిప్లయితొలగించండి
  2. శ్రీరామ జయం! నేనెందుకు రాశానంటే అన్న శీర్షికన మీ మాటకు ధన్యవాదములు... మీ అభిలాష మీ జన్మ చరితార్ధం... ఆ బ్రహ్మ కీట జననీ ఎవరిని ఏ పని కోసం నియామకం చేసిందో ఆ కారణం దృష్ట్యా పుట్టినా... ఆ దిశగా మీ ప్రయత్నం సఫలీకృతం... శుభం శుభం శుభం!!

    రిప్లయితొలగించండి
  3. Chala bagundi Chydhivina koddhi meru racinavi chydhavalani vndhi ammavari kurpa miku appudu undalani Korukutuonnanu maa (cosister) naku post hysushunnaru (mi friend lakshmi)

    రిప్లయితొలగించండి